logo

బ్యాలెట్‌ పెట్టెలో ఫలితం నిక్షిప్తం

మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది.

Published : 29 Mar 2024 03:55 IST

ప్రశాంతంగా ముగిసిన ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
2న ఓట్ల లెక్కింపు

మహబూబ్‌నగర్‌: పోలింగ్‌ కేంద్రం నుంచి బ్యాలెట్‌ పెట్టె స్ట్రాంగ్‌ రూంకు తరలింపు

ఈనాడు, మహబూబ్‌నగర్‌: మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో ఏ ఒక్క ఓటూ చేజారిపోకుండా జాగ్రత్త పడ్డారు. ఉమ్మడి జిల్లాలో 1,439 ఓట్లకుగాను 1,437 ఓట్లు పోలయ్యాయి. ఓటేసిన వాళ్లలో 19 మంది ఎక్స్‌అఫీషియో సభ్యులు కూడా ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీలు మన్నె శ్రీనివాస్‌రెడ్డి, పి.రాములు, ఎమ్మెల్సీలు కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, చల్లా వెంకట్రాంరెడ్డి, సత్యవతి రాథోడ్‌, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, జె.అనిరుథ్‌రెడ్డి, జి.మధుసూదన్‌రెడ్డి, వి.శ్రీహరి, చిట్టెం పర్నికారెడ్డి, మేఘారెడ్డి, రాజేశ్‌రెడ్డి, వంశీకృష్ణ, కె.నారాయణరెడ్డి, వి.శంకర్‌ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 83 మంది జడ్పీటీసీ సభ్యులు ఉండగా అందరూ ఓటింగ్‌లో పాల్గొన్నారు. 23 పురపాలికల్లో మొత్తం 449 మంది కౌన్సిలర్లు ఉండగా అందరూ ఓటేశారు. మొత్తం 888 మంది ఎంపీటీసీలు ఉండగా 886 మంది ఓటేశారు. నారాయణపేట జిల్లా మక్తల్‌ మండలం మంథన్‌గోడ్‌ ఎంపీటీసీ సుమిత్ర(భాజపా), నాగర్‌కర్నూల్‌ జిల్లా బిజినేపల్లి మండలం గుడ్ల నర్వ ఎంపీటీసీ శారద(స్వతంత్ర) ఓటు వేయకపోవడంతో 99.86 శాతం పోలింగ్‌ నమోదైంది. నాగర్‌కర్నూల్‌, నారాయణపేట పోలింగ్‌ కేంద్రాలు మినహా అన్నిచోట్ల వంద శాతం పోలింగ్‌ జరిగింది. పోలింగ్‌ కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లా కలెక్టర్లు వెబ్‌ క్యాస్టింగ్‌ ద్వారా పోలింగ్‌ తీరును పరిశీలించారు.

పోలింగ్‌ కేంద్రానికి వస్తున్న మన్నె జీవన్‌రెడ్డి, ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి,

ఎమ్మెల్యేల పర్యవేక్షణ..: ప్రజాప్రతినిధులు క్రాస్‌ ఓటింగ్‌ వేయకుండా ఎమ్మెల్యేలు పర్యవేక్షించారు. గద్వాల, అలంపూర్‌ ఎమ్మెల్యేలు కృష్ణమోహన్‌రెడ్డి, విజయుడు, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రాంరెడ్డి భారాసకు ఓట్లు అన్నీ సద్వినియోగం అయ్యేలా పర్యవేక్షణ చేశారు. నారాయణపేటలో మాజీ ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, ఎస్‌.రాజేందర్‌రెడ్డి దగ్గరుండి జిల్లాలోని తమ పార్టీ ఓట్లు చేజారకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. మిగతా నియోజకవర్గాల్లో భారాస ప్రజాప్రతినిధులందరూ కలిసి వచ్చి ఓట్లు వేశారు. భారాస అభ్యర్థి నవీన్‌కుమార్‌రెడ్డి పలు పోలింగ్‌ కేంద్రాల్లో పర్యటించారు. మొత్తం 12 నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలే ఉండటంతో వారి సారథ్యంలో ఓటర్లు ఎన్నికల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్‌ ఓట్లు చేజారకుండా ఎమ్మెల్యేలు స్థానిక ప్రజాప్రతినిధులతో మంతనాలు జరిపారు. కాంగ్రెస్‌ అభ్యర్థి మన్నె జీవన్‌రెడ్డి, సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి పలు పోలింగ్‌ కేంద్రాల్లో పర్యటించి ఓటింగ్‌ సరళిపై ఆరా తీశారు.  

జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి,  దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి

ఎవరికివారు గెలుపుపై ధీమా..

ప్రధాన పార్టీలు ఎవరికివారు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. మెజార్టీ ఓటర్లు తమకే ఓటేశారని ఆశాభావంతో ఉన్నారు. మొదటి ప్రాధాన్య ఓటుతోనే తాము గెలుస్తామన్న నమ్మకంలో కాంగ్రెస్‌ అభ్యర్థి మన్నె జీవన్‌రెడ్డి ఉన్నారు. ప్రస్తుతం ఉన్న ఓటర్లలో మెజారిటీ శాతం భారాసకు చెందిన ప్రజాప్రతినిధులే ఉన్నారని వారంతా తమకే ఓటు వేశారన్న నమ్మకంలో భారాస అభ్యర్థి నవీన్‌కుమార్‌రెడ్డి ఉన్నారు. రెండు ప్రధాన పార్టీల్లో కొందరు అభ్యర్థులు క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడ్డారన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఏప్రిల్‌ 2న విజేత ఎవరో తేలనుంది.

బంగారు నాణెం..

ఓ ప్రధాన పార్టీకి చెందిన ఓటర్లకు బంగారు నాణేలను ఇచ్చారని పోలింగ్‌ కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆ పార్టీకి చెందిన ఓటర్లను వివిధ ప్రాంతాల్లో శిబిరాలకు తీసుకెళ్లారు. తమకు డబ్బు ఇవ్వలేదని మహబూబ్‌నగర్‌లో పలువురు ఓటు వేయమని భీష్మించుకు కూర్చున్నారు. ఇప్పటికిప్పుడు డబ్బులు ఇవ్వడం కష్టమని, బదులుగా బంగారు నాణెలు ఇచ్చారని జోరుగా ప్రచారం సాగింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని