logo

నేర వార్తలు

రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తులను వాహనాలు ఢీకొనడంతో వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మృతి చెందారు. సిద్దిపేట జిల్లా అక్బర్‌పేట-భూంపల్లి, కుకునూరుపల్లి మండలాల్లో జరిగాయి.

Published : 21 Mar 2023 02:17 IST

వాహనాలు ఢీకొని ఇద్దరు బాటసారుల మృతి

స్వామి గౌడ్‌, మల్లేశం

దుబ్బాక, కొండపాక, న్యూస్‌టుడే: రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తులను వాహనాలు ఢీకొనడంతో వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మృతి చెందారు. సిద్దిపేట జిల్లా అక్బర్‌పేట-భూంపల్లి, కుకునూరుపల్లి మండలాల్లో జరిగాయి. పోతారెడ్డిపేట గ్రామానికి చెందిన బండారి స్వామి గౌడ్‌(45) అక్బర్‌పేట చౌరస్తాలోని హోటల్‌లో సప్లయర్‌గా పని చేస్తూ, భార్య, పిల్లలతో జీవనం కొనసాగిస్తున్నాడు. రోజు మాదిరిగానే సోమవారం తెల్లవారుజాము 4 గంటలకు కాలినడకన బయలుదేరాడు. రామలింగేశ్వర వేడుక మందిరం వద్ద సిద్దిపేట నుంచి రామాయంపేట వైపు వెళుతున్న గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య నవ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ వి.గంగరాజు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కుకునూరుపల్లికి చెందిన రెడ్డమైన మల్లయ్య అలియాస్‌ మల్లేశం(65) సోమవారం ఉదయం 6 గంటల సమయంలో టీ తాగడానికి హోటల్‌కు వెళ్లాడు. అనంతరం రోడ్డు దాటుతుండగా హైదరాబాద్‌ నుంచి సిద్దిపేట వైపు వేగంగా వచ్చిన ద్విచక్ర వాహనం బలంగా ఢీకొట్టింది. తీవ్రగాయాలు కాగా 108 అంబులెన్స్‌లో గజ్వేల్‌లోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్సకు సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ చనిపోయాడు. కుమారుడు శ్రీనివాస్‌ ఫిర్యాదు చేయగా ఎస్‌ఐ పుష్పరాజ్‌ దర్యాప్తు చేస్తున్నారు.


వాహనం ఢీకొని యువకుడి దుర్మరణం

జహీరాబాద్‌ అర్బన్‌, న్యూస్‌టుడే: గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో యువకుడు అక్కడికక్కడే మృతిచెందినట్లు చిరాగ్‌పల్లి ఎస్‌ఐ కాశీనాథ్‌ పేర్కొన్నారు. జహీరాబాద్‌ మండలం సత్వార్‌ సమీపంలోని 65వ నెంబర్‌ జాతీయ రహదారిపై ఆదివారం అర్ధరాత్రి గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో తీవ్ర గాయాలతో 30 ఏళ్ల వయస్సు కలిగిన గుర్తుతెలియని వ్యక్తి మృత్యువాత పడినట్లు చెప్పారు. ఒంటిపై ఎరుపు రంగు టీషర్టు, నీలం రంగు జిన్‌ప్యాంట్‌ ధరించి ఉన్నట్లు తెలిపారు. మృతదేహన్ని జహీరాబాద్‌ ప్రాంతీయ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచామని, గుర్తించిన వ్యక్తులు చరవాణి 87126 56766 నెంబర్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు.


పాముకాటుతో ఆటోడ్రైవర్‌..

పాపన్నపేట, న్యూస్‌టుడే: ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో పాము కాటు వేయడంతో చికిత్స పొందుతూ ఆటో డ్రైవర్‌ మృతి చెందిన సంఘటన పాపన్నపేటలో సోమవారం చోటుచేసుకుంది. ఎస్సై విజయ్‌కుమార్‌ తెలిపిన ప్రకారం. మండల పరిధి దౌలాపూర్‌కు చెందిన వడ్ల అశోక్‌ (32) పాపన్నపేటలో ఉంటూ, ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం రాత్రి భోజనం చేసి ఇంట్లో నిద్రిస్తున్నాడు. ఈ క్రమంలో అర్ధరాత్రి అశోక్‌ తల భాగంలో పాము కాటు వేసింది. వెంటనే తేరుకున్న ఆయన భార్యకు విషయం తెలుపడంతో స్థానికుల సాయంతో మెదక్‌ ఏరియా ఆస్పత్రికి తరలించారు.  పరిస్థితి విషమంగా మారడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు చెప్పారు. ఆయనకు భార్య గంగమణి, కూతురు వెన్నెల, కొడుకు అభిలాష్‌ ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు.


విద్యుదాఘాతంతో రైతు మృత్యువాత

సిద్దిపేట అర్బన్‌, న్యూస్‌టుడే: పంట పొలానికి నీరు పెట్టేందుకు స్టార్టర్‌ డబ్బా పట్టుకోవడంతో విద్యుదాఘాతమై యువ రైతు మృతి చెందాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం జక్కాపూర్‌లో సోమవారం చోటుచేసుకుంది. చిన్నకోడూరు ఠాణా ఏఎస్‌ఐ దేవయ్య తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన బాయిమీది రాజ్‌కుమార్‌ (32) వ్యవసాయం చేస్తూ తల్లిదండ్రులకు ఆసరాగా ఉంటున్నాడు. సోమవారం ఉదయం పొలానికి నీరు పెట్టి వస్తానని వెళ్లాడు. మధ్యాహ్నం 12 గంటలయిన ఇంటికి తిరిగి రాలేదు. కుమారుడి కోసం తండ్రి రాములు పొలం వద్దకు వెళ్లి చూడగా కరెంటు షాక్‌తో చనిపోయి కనిపించాడు. మృతుడికి తల్లి లక్ష్మి, సోదరుడు, ముగ్గురు అక్కలు ఉన్నారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


కుమార్తె పెళ్లికి ఆర్థిక ఇబ్బందులు.. తల్లి బలవన్మరణం

చిన్నకోడూరు, న్యూస్‌టుడే: కుమార్తె వివాహం చేయడానికి ఇంటి ఆర్థిక పరిస్థితులు సహకరించక పోవడంతో ఆవేదనకు గురైన తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం పెద్దకోడూరు జరిగింది. ఎస్‌ఐ శివానందం, స్థానికులు వివరాలు తెలిపారు. పెద్దకోడూరుకు చెందిన బోనాల కనకవ్వ (42), గణయ్య దంపతులు వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. వీరికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలున్నారు. తమ భూమి నుంచి రంగనాయకసాగర్‌ జలాశయంలో మూడున్నర ఎకరాలు పోయి అర ఎకరం మిగిలింది. భూమికి పరిహారం వచ్చింది. పెద్ద కుమార్తె వివాహం చేశారు. మిగిలిన పొలంలో వ్యవసాయం చేసుకుంటున్నారు. కొంత అప్పు మిగిలింది. చిన్న కుమార్తెకు పెళ్లి ఎలా చేయాలని మనస్తాపానికి గురై తల్లి తరచూ బాధపడేది. ఈ నెల 8న రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో విషగుళికలు మింగింది. గమనించిన కుటుంబ సభ్యులు గ్రామస్థుల సాయంతో సిద్దిపేట ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందింది. సోమవారం కనకవ్వ కుమారుడు రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని