logo

పాలక పక్షాల వైఫల్యాలను ఎండగడుతాం: ఎంపీ ఉత్తమ్‌

ప్రతిపక్షాలపై అక్రమ కేసులు పెడితే భాజపా నామరూపాలు లేకుండా పోతుందని పీసీసీ మాజీ అధ్యక్షుడు, నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.

Published : 27 Mar 2023 03:16 IST

మాట్లాడుతున్న ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, చిత్రంలో బత్తుల లక్ష్మారెడ్డి

మాడ్గులపల్లి(వేములపల్లి), న్యూస్‌టుడే: ప్రతిపక్షాలపై అక్రమ కేసులు పెడితే భాజపా నామరూపాలు లేకుండా పోతుందని పీసీసీ మాజీ అధ్యక్షుడు, నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలోని వేములపల్లి మండలం ఆమనగల్లు నుంచి హాథ్‌ సే హాథ్‌ జోడో యాత్రను కాంగ్రెస్‌ నాయకులు బత్తుల లక్ష్మారెడ్డితో కలిసి ప్రారంభించారు. కేంద్రంలో భాజపా, రాష్ట్రంలో భారాస వైఫల్యాలను ఎండగడుతూ కాంగ్రెస్‌ను బలోపేతం చేస్తామన్నారు. ప్రతి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల మీదుగా యాత్ర సాగుతుందని అన్నారు. కేంద్రంలో కార్పొరేట్‌ వ్యవస్థకు కొమ్ముకాస్తున్న భాజపా ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయిందన్నారు. ఎన్నో నీతి మాటలు చెప్పే నరేంద్రమోదీ జాతి సంపదను కొల్లగొడుతున్నారని విమర్శించారు. దేశ సంపదను మోదీ ఏ విధంగా అదానీ కంపెనీలకు కట్టబెడుతున్నాడో పార్లమెంట్‌లో రాహుల్‌గాంధీ చెప్పడంతోనే ఆయనపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. ఎప్పుడో ఐదేళ్ల కింద ఎన్నికల సమయంలో కర్ణాటకలో రాహుల్‌ మాట్లాడిన మాటలకు గుజరాత్‌లోని సూరత్‌ కోర్టులో కేసుపెట్టి లోక్‌సభకు అనర్హుడిగా ప్రకటిస్తారా అని ప్రశ్నించారు. 2024లో రాహుల్‌గాంధీ ఎంపీ అయ్యి, దేశానికి ప్రధాని అవుతారని చెప్పారు. మిర్యాలగూడ పురపాలక కాంగ్రెస్‌ ఫ్లోర్‌ లీడర్‌ బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ తాను ప్రజాసేవ చేస్తూ పరోక్షంగా రాజకీయాలు చేశానని, ఇప్పటి నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని చెప్పారు. మిర్యాలగూడలో మళ్లీ కాంగ్రెస్‌ను గెలిపిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ ఎంపీపీ పుట్టల సునీత, భ్లాక్‌కాంగ్రెస్‌ అధ్యక్షుడు తమ్మడబోయిన అర్జున్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని