logo

‘కెవి’ ఫస్ట్‌లుక్‌ విడుదల

ఆద్యత్‌ ప్రొడక్షన్స్‌ బ్యానరుపై గౌతం చొక్కలిగం నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం ‘కెవి’. తమిళ్‌ దయాళన్‌ దర్శకత్వం వహించారు.

Updated : 28 Jan 2023 05:18 IST

షీలా రాజ్‌కుమార్‌

కోడంబాక్కం, న్యూస్‌టుడే: ఆద్యత్‌ ప్రొడక్షన్స్‌ బ్యానరుపై గౌతం చొక్కలిగం నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం ‘కెవి’. తమిళ్‌ దయాళన్‌ దర్శకత్వం వహించారు. మండేలా, పేట్టైక్కాళి ఫేమ్‌ షీలా రాజ్‌కుమార్‌, విజయ్‌టీవీ ఫేమ్‌ జాక్లిన్‌ హీరోయిన్లుగా నటించారు. ఆదవన్‌ హీరోగా పరిచయమవుతున్నారు. చార్లస్‌ వినోద్‌, జీవాలు ఇతర తారాగణం. బాలసుబ్రమణ్యం సంగీతం సమకూర్చుతున్నారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను నటుడు యోగిబాబు విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ.. ‘‘ 800 ఏళ్ల చరిత్రలో తమిళనాడులో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించాం. కెవి అంటే పునాది అని అర్థం. రాష్ట్రంలో ఎన్నో ప్రభుత్వాలు మారాయి. చాలా విషయాల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. కానీ గిరిజన ప్రాంత ప్రజల జీవితాల్లో మాత్రం మార్పు రాలేదు. ఈ విషయాలన్నీ చిత్రంలో ప్రస్తావించామని’’ పేర్కొన్నారు.


ఆదవన్‌


వేసవిలో వస్తున్న ‘ఎన్‌ ఇనియ తనిమయే’

‘ఎన్‌ ఇనియ తనిమయే’లో ఓ దృశ్యం

కోడంబాక్కం, న్యూస్‌టుడే: సగు పాండియన్‌ దరక్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎన్‌ ఇనియ తనిమయే’. జేమ్స్‌ వసంతన్‌ సంగీతం సమకూర్చారు. శ్రీపతి, రీషా ప్రధాన తారాగణం. సినిమా గురించి దర్శకుడు మాట్లాడుతూ.. ‘‘ ఇది థ్రిల్లర్‌ కథా చిత్రం. సమాజానికి ఉపయోగపడే ఓ ముఖ్యమైన విషయంతో చిత్రీకరించాం. ఈ ఏడాది వేసవిలో చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. తంగర్‌బచ్చన్‌ చిత్రాలకు పనిచేసిన శివభాస్కరన్‌ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. పాటలన్నీ చాలా అద్భుతంగా వచ్చాయి. చిత్రంలో అమ్మ సెంటిమెంట్‌ కూడా ఉంటుంది. జేమ్స్‌ వసంతన్‌ సంగీతం సినిమాకు మరింత ప్లస్‌పాయింట్‌గా ఉంటుంది. తాజాగా తొలి పాటను కూడా విడుదల చేశాం. మంచి స్పందన లభిస్తోందని’’ పేర్కొన్నారు.


నా తొలి థ్రిల్లర్‌ చిత్రమిది

ఆర్‌జే బాలాజీ

కోడంబాక్కం, న్యూస్‌టుడే: రేడియో జాకీ నుంచి కథానాయకుడి స్థాయికి ఎదిగి తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకున్న నటుడు ఆర్‌జే బాలాజీ. ఇప్పటికే తన స్వీయ దర్శకత్వంలో మూడు చిత్రాల్లో నటించి హిట్లను అందుకున్నారు. తాజాగా ఆయన నటించిన చిత్రం ‘రన్‌ బేబీ రన్‌’. జైన్‌ కృష్ణకుమార్‌ దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 3న చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. ‘‘ రేడియో జాకీ నుంచి రచయిత, దర్శకుడు, హీరోగా ఒక్కో అడుగు దాటుకుంటూ వస్తున్నా. దేవుని కృపతో కొంత అభిమానగణం వచ్చింది. ‘రన్‌ బేబి రన్‌’ నా కెరీర్‌లో ముఖ్యమైన చిత్రం. ఇందులో ఇషా తల్వార్‌ హీరోయిన్‌గా నటించారు. ఐశ్వర్యారాజేష్‌ కీలక పాత్ర పోషించారు. శ్యామ్‌ సీఎస్‌ సంగీతం సినిమాకు హైలెట్‌. ఇది నా తొలి థ్రిల్లర్‌ సినిమా. అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది. ఇక ఈ మధ్య నటుడు విజయ్‌కి ఓ కథ వినిపించా. ఆయనకు కూడా బాగా నచ్చింది. అందులోని హాస్య ఎలిమెంట్స్‌ను బాగా ఎంజాయ్‌ చేశారు. రెండు నెలల్లో స్క్రిప్ట్‌ పూర్తి చేయమని చెప్పారు. కానీ ఆయన స్థాయికి స్క్రిప్ట్‌ సిద్ధం చేయాలంటే కనీసం ఏడాది సమయం కావాలి. అందుకే ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. తప్పకుండా ఆయన నాకు మరో అవకాశం కల్పిస్తారని నమ్ముతున్నట్లు ’’ పేర్కొన్నారు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు