logo

మరిన్ని పోషకాలతో మధ్యాహ్న భోజనం

 సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్యను పెంచి బలోపేతం చేసేందుకు ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందిస్తోంది. గత కొన్నేళ్లుగా సన్నబియ్యంతో వండిన భోజనం పెడుతుండగా.. ఇక నుంచి మరిన్ని పోషకాలతో కూడిన మధ్యాహ్న భోజనం పెట్టేందుకు చర్యలు చేపట్టింది.

Published : 03 Oct 2022 01:54 IST

విస్నూరు ప్రాథమిక పాఠశాలలో..

జిల్లాలో బడులు: 508
విద్యార్థులు: 46,655

పాలకుర్తి, న్యూస్‌టుడే:  సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్యను పెంచి బలోపేతం చేసేందుకు ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందిస్తోంది. గత కొన్నేళ్లుగా సన్నబియ్యంతో వండిన భోజనం పెడుతుండగా.. ఇక నుంచి మరిన్ని పోషకాలతో కూడిన మధ్యాహ్న భోజనం పెట్టేందుకు చర్యలు చేపట్టింది. రోజుకో రకం కూర వండాలని ఏజెన్సీ నిర్వాహకులను ఆదేశించారు.  

పకడ్బందీగా అమలు
మధ్యాహ్న భోజనంలో గణనీయమైన మార్పులకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం.. ఆహారంలో పోషక విలువలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటోంది. గ్రామాల్లోని స్వయంసహాయక సంఘాల మహిళలు మధ్యాహ్నభోజనం నిర్వహణ బాధ్యతలు చేపట్టాయి. వీరికి నెలకు ఒకొక్కరికి రూ.1000 చొప్పున గౌరవ వేతనం అందిస్తున్నారు. పౌర సరఫరాలశాఖ ద్వారా ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల నుంచి విద్యాలయాలకు సన్నరకం బియ్యాన్ని సరఫరా చేస్తుండగా..  నిత్యం కూరగాయలతో కూడిన భోజనం అందిస్తున్నారు. వారంలో మూడు రోజులు గుడ్డు, పప్పు, కూరలు వండి పెడుతున్నారు. దీన్ని ప్రతి బడిలో పకడ్బందీగా అమలు చేసేలా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

లోపాన్ని అరికట్టేందుకు..
పలుచోట్ల విద్యార్థులు పోషకాహార లోపంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సర్వేల ద్వారా ఈ విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం దీన్ని అరికట్టేందుకు చర్యలకు ఉపక్రమించింది. పిల్లలకు పోషకాలతో కూడిన ఆహారం ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. బడుల్లో ప్రత్యేకంగా ఐరన్‌, ఫోలిక్‌యాసిడ్‌, విటమిన్‌-ఏ, బీ1, బీ3, బీ6, బీ12, జింక్‌ మినరల్‌్్స కలిగిన బియ్యం అందించేందుకు చర్యలు చేపట్టింది. ఇప్పటికే పలు పాఠశాలలకు అవసరమైన బియ్యం బస్తాలు అందజేశారు. గతంలో ప్రభుత్వం గుడ్డుకు రూ.4 మాత్రమే ఇస్తుండగా..  రూ.5కు పెంచింది. దీన్ని పకడ్బందీగా అమలు చేసేలా రాష్ట్ర విద్యాశాఖకు ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా మధ్యాహ్న భోజన బిల్లులను సకాలంలో చెల్లించాలని పేర్కొంది. ఇప్పటికే చెల్లింపులు సకాలంలో జరగడం లేదన్న అపవాదును దూరం చేసేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించింది.

పాటించాల్సిన నిబంధనలివి..
మధ్యాహ్నభోజనం మెనూ వివరాలను బడుల్లో గోడపై ప్రదర్శించాలి.

తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్య కమిటీలతో సమావేశాల నిర్వహణ, పర్యవేక్షణ.

వంటను ముందుగా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తిన్న తర్వాతే పిల్లలకు పెట్టాలి.

రోజువారీగా ఇస్తున్న బియ్యం, నిల్వల వివరాలు నమోదు చేయాలి.

భోజనం అనంతరం విద్యార్థుల సంఖ్య నమోదు చేయాలి.

విద్యాలయాల ఆవరణలో కిచెన్‌ గార్డెన్లను తప్పనిసరిగా అభివృద్ధి చేయాలి.

స్పష్టమైన ఆదేశాలు అందాయి
- కె.రాము, జిల్లా విద్యాధికారి

పోషకాలతో కూడిన ఆహారాన్ని పిల్లలకు అందించాలని స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. ఈ మేరకు పాఠశాలలకు బియ్యం బస్తాలు చేరుతున్నాయి. ప్రతి బడిలో ఎస్‌ఎంఎస్‌ విధానం, తల్లిదండ్రులు, ఎస్‌ఎంసీల పర్యవేక్షణ కచ్చితంగా ఉండాలి. తప్పనిసరిగా సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని