logo

సాగునీటి వనరుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి

అభివృద్ధి ఎలా ఉంటుందో ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన తొమ్మిదేళ్ల పాలనలో చేసి చూపించారని ఎమ్మెల్యే బానోతు శంకర్‌నాయక్‌ అన్నారు.

Published : 08 Jun 2023 04:52 IST

మహబూబాబాద్‌లో మున్నేరు వాగు వద్ద పూజ చేస్తున్న ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌

మహబూబాబాద్‌, న్యూస్‌టుడే: అభివృద్ధి ఎలా ఉంటుందో ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన తొమ్మిదేళ్ల పాలనలో చేసి చూపించారని ఎమ్మెల్యే బానోతు శంకర్‌నాయక్‌ అన్నారు. రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం మహబూబాబాద్‌ పట్టణంలోని మున్నేరువాగు వద్ద నిర్వహించిన సాగునీటి దినోత్సవం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మున్నేరు వాగులోని చెక్‌డ్యాం వద్ద పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వేసవి కాలం వచ్చిందంటే మున్నేరువాగు ఎండిపోయి తాగునీటి కోసం గతంలో ఇతర ప్రాంతాల వైపు చూసేవారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ దూరదృష్టితో కాళేశ్వరం ప్రాజెక్ట్‌ నిర్మించడం వల్ల ప్రతి గ్రామంలోని చెరువులు కళకళలాడుతున్నాయన్నారు. దీంతో రైతులు రెండు పంటలు పండిస్తూ అభివృద్ధి సాధిస్తున్నారన్నారు. ప్రతిపక్ష పార్టీలకు ఈ అభివృద్ధి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ‘మా తెలంగాణం కోటి ఎకరాల మాగాణం’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ నిర్మాణంపై పవర్‌ ఆఫ్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించారు. అదనపు కలెక్టర్‌ ఎం.డేవిడ్‌, ఆర్డీవో కొమురయ్య, నీటిపారుదల శాఖ ఎస్‌ఈ వెంకటేశ్వర్లు, పురపాలక సంఘం ఛైర్మన్‌ డాక్టర్‌ పాల్వాయి రామ్మోహన్‌రెడ్డి, వైస్‌ఛైర్మన్‌ ఎండీ.ఫరీద్‌, వార్డు కౌన్సిలర్లు చిట్యాల జనార్ధన్‌, మార్నేని వెంకన్న, బత్తుల సరస్వతి, వట్టం జ్యోత్స్న, బండి ఇందిర, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులున్నారు.

పంటల నిలయాలుగా ఎడారి ప్రాంతాలు

నర్సింహులపేట, న్యూస్‌టుడే: జిల్లాలో కొన్ని ప్రాంతాలు ఒకప్పుడు నీటి చుక్క లేక ఏడారి ప్రాంతంగా ఉండేదని, ప్రస్తుతం కాళేశ్వరం జలాలతో రెండు పంటల సాగుకు నిలయంగా మారిందని జిల్లా పాలనాధికారి శశాంక అన్నారు. నర్సింహులపేటలోని ఓ వేడుకల మందిరంలో దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలో సాగు నీటి దినోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన సదస్సులో ఎమ్మెల్యే రెడ్యానాయక్‌తో పాటు  జిల్లా పాలనాధికారి బుధవారం హజరయ్యారు. నియోజకవర్గంలో ఉన్న 180 పెద్ద చెరువుల్లో 50శాతం పైగా చెరువులు నీటి కళతో ఉన్నాయంటే కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పదనం అన్నారు. ఆరు సంవత్సరాల కాలంలోనే 21 చెక్‌డ్యాంలు నిర్మించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే అన్నారు. ఎంపీపీలు పద్మ, సుశీల, నీటి పారుదల శాఖ ఈఈ సుదర్శన్‌, డీఈ రాజ్‌కుమార్‌, దశాబ్ది ఉత్సవాల నియోజకవర్గ అధికారి సుధాకర్‌, తహసీల్దార్‌ వివేక్‌, ఎంపీడీవో సత్యనారాయణరెడ్డి, సర్పంచి రజితారెడ్డి, వైస్‌ ఎంపీపీ దేవేందర్‌, రైతు సమన్వయ సమితి జిల్లా కమిటీ సభ్యుడు తోట సురేష్‌, భారాస మండలాధ్యక్షుడు మైదం దేవేందర్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని