icon icon icon
icon icon icon

కేరళలో ఇం‘ఢీ’యా

దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు బలమున్న స్థానాల్లో కేరళ ఒకటి. ఈ రాష్ట్రంలో లెఫ్ట్‌, కాంగ్రెస్‌ల మధ్యే ఎప్పుడూ ప్రధాన పోటీ ఉంటుంది.

Updated : 16 Apr 2024 17:20 IST

పరస్పరం తలపడుతున్న కాంగ్రెస్‌, లెఫ్ట్‌
వయనాడ్‌లో రాహుల్‌పై సీపీఐ పోటీ

దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు బలమున్న స్థానాల్లో కేరళ ఒకటి. ఈ రాష్ట్రంలో లెఫ్ట్‌, కాంగ్రెస్‌ల మధ్యే ఎప్పుడూ ప్రధాన పోటీ ఉంటుంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ ఈ రాష్ట్రం నుంచి పోటీ చేయడంతో ఆ పార్టీ నేతృత్వంలోని యూడీఎఫ్‌ దాదాపుగా క్లీన్‌స్వీప్‌ చేసింది. మొత్తం 20 లోక్‌సభ స్థానాల్లో 19 గెలుచుకుని చరిత్ర సృష్టించింది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌కు ఎదురుగాలి వీచినా కేరళలో సత్ఫలితాలను సాధించింది. మరోసారి రాష్ట్రంలో క్లీన్‌స్వీప్‌ చేయాలని భావిస్తున్న పార్టీ రాహుల్‌ను మళ్లీ వయనాడ్‌ నుంచే పోటీకి దింపింది. సాధారణంగా అయితే ఆయన విజయం నల్లేరుపై నడకే. కానీ ఈసారి ఇండియా కూటమి భాగస్వామి అయిన సీపీఐ బరిలోకి దిగుతుండటంతో పోటీ ఆసక్తిగా మారింది. అదీ సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా సతీమణి అన్నీ రాజా బరిలోకి దిగడంతో గట్టి పోటీ ఉండే అవకాశముంది. దీంతోపాటు భాజపా రాష్ట్రశాఖ అధ్యక్షుడు కె.సురేంద్రన్‌ వయనాడ్‌లోనే పోటీ చేస్తున్నారు.

కూటమిలోనే పోటీ

దేశవ్యాప్తంగా ఇండియా కూటమిలో కాంగ్రెస్‌, సీపీఎం, సీపీఐ ఉన్నాయి. కేరళలో మాత్రం ప్రత్యర్థులుగా బరిలోకి దిగుతున్నాయి. సీపీఎంతో సీపీఐ జట్టు కట్టి అన్నీ రాజాను రంగంలోకి దింపింది. దీంతో ఇండియా కూటమిలోనే ఇద్దరు గట్టి అభ్యర్థులు ఒకే స్థానం నుంచి పోటీ పడుతున్నట్లయింది. వయనాడ్‌లో రాహుల్‌ పోటీ చేయడమంటే పొత్తు ధర్మాన్ని ఉల్లంఘించినట్లేనని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ఇటీవల వ్యాఖ్యానించారు. ఆయన కేరళలో లెఫ్ట్‌ కూటమితో పోటీ చేయడానికే వస్తున్నారని విమర్శించారు.


భారీ మెజారిటీ

2019 లోక్‌సభ ఎన్నికల్లో వయనాడ్‌ నుంచి పోటీ చేసిన రాహుల్‌ గాంధీ భారీ మెజారిటీతో గెలిచారు. ఆయనకు 4.31 లక్షల ఓట్ల మెజారిటీ వచ్చింది. కేరళలోనే ఇది అత్యధికం. రాహుల్‌కు 64.94శాతం ఓట్లు వచ్చాయి. ఆ ఎన్నికల్లో లెఫ్ట్‌ నుంచి పీపీ సునీర్‌, ఎన్డీయే భాగస్వామి భారత్‌ ధర్మ జనసేన (బీడీజేఎస్‌) నుంచి తుషార్‌ వెల్లపల్లి పోటీ చేశారు. తుషార్‌కు కేవలం 78,000 ఓట్లే (7.25 శాతం) వచ్చాయి.


లెఫ్ట్‌ ప్రతిపాదనను తిరస్కరించిన కాంగ్రెస్‌

గత ఏడాది సెప్టెంబరులోనే వయనాడ్‌ నుంచి రాహుల్‌ గాంధీ పోటీ చేయొద్దని లెఫ్ట్‌ ప్రతిపాదించింది. ఈ సీటును సీపీఐకి కేటాయించడంతో ఎల్డీఎఫ్‌ ఈ ప్రతిపాదన చేసింది. కాంగ్రెస్‌ దీనిని తిరస్కరించింది. భాజపాను నేరుగా ఎదుర్కొనే సీటులో రాహుల్‌ పోటీ చేయాలని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా గతంలోనే సూచించారు. భాజపాకు వ్యతిరేకంగా పోరాడుతున్న రాహుల్‌.. భాగస్వాములైన తమపై పోరాడటంతో అర్థం లేదని ఆయన వాదిస్తున్నారు.


సురేంద్రన్‌ గట్టి అభ్యర్థే

వయనాడ్‌లో పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు సురేంద్రన్‌ను బరిలో దించి భాజపా జాతీయ నాయకత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఆయనా రాహుల్‌కు గట్టి ప్రత్యర్థే. దీంతో ఇక్కడ ముక్కోణపు పోటీ నెలకొంది. స్వయంగా ప్రధాని మోదీయే సురేంద్రన్‌ను ఎంపిక చేశారు. దేశవ్యాప్తంగా 50శాతం ఓట్లను సాధించే ప్రయత్నాల్లో భాగంగా భాజపా కీలక నేతలను ఎన్నికల బరిలోకి దింపింది. తద్వారా అన్ని చోట్లా విజయం సాధించకపోయినా ఓట్ల శాతాన్ని గణనీయంగా పెంచుకోవాలనేది ఆ పార్టీ లక్ష్యం. రాహుల్‌ గాంధీ మెజారిటీని తగ్గించాలనే లక్ష్యమూ ఉంది.


వయనాడ్‌లో పోలింగ్‌ తర్వాతే అమేఠీలో పోటీపై నిర్ణయం..

ఒకప్పటి కాంగ్రెస్‌ కంచుకోట అయిన అమేఠీలో గాంధీ కుటుంబం నుంచి ఎవరు బరిలో దిగుతారన్నది ఆసక్తికరంగా మారింది. రాహుల్‌ మరోసారి భాజపా నాయకురాలు స్మృతి ఇరానీని ఢీకొంటారా.. లేదంటే తన సోదరి ప్రియాంక భర్త రాబర్ట్‌ వాద్రా పోటీ చేస్తారా..అనే దానిపై ఎలాంటి స్పష్టత లేదు. ‘ఇండియా’ కూటమితో సీట్ల సర్దుబాటులో భాగంగా అమేఠీ కాంగ్రెస్‌కే దక్కింది. ఏప్రిల్‌ 26న వయనాడ్‌లో పోలింగ్‌ పూర్తయిన తర్వాతే.. అమేఠీలో అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఐదో విడతలో భాగంగా మే 20న అక్కడ ఓటింగ్‌ జరగనుంది. మే 3 వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగుతుంది. ప్రస్తుతం కాంగ్రెస్‌ వయనాడ్‌ మీదే  దృష్టి పెట్టింది.  మరోపక్క.. అమేఠీలో రాహుల్‌ పోటీ చేస్తే, హస్తానికి అనుకూలంగా పరిస్థితి మారుతుందని పార్టీ అంతర్గత సర్వేలు వెల్లడించాయి. ఇప్పటికే గాంధీ కుటుంబంతో భావోద్వేగ పరంగా ముడిపడి ఉన్న ఆ ప్రాంతంలో ఇతర నేతలు బరిలో దిగితే.. అంతర్గత వైరానికి దారి తీయొచ్చని కార్యకర్తల నుంచి అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ పరిణామాల మధ్య రాహుల్‌ పోటీపై స్పష్టత రావాల్సి ఉంది.

ఈనాడు ప్రత్యేక విభాగం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img