Mystery House On Moon: చంద్రుడిపై ఓ ‘మిస్టరీ హౌస్‌’?

చంద్రుడి ఉపరితలంపై ఓ వింత వస్తువు కనిపిస్తోందంటూ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది....

Updated : 06 Dec 2021 22:01 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: చంద్రుడి ఉపరితలంపై ఓ వింత వస్తువు కనిపిస్తోందన్న వార్త ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. చైనా 2019లో చంద్రుడిపైకి పంపిన ‘యుటు-2’ అనే రోవర్‌ ఇటీవల కొన్ని చిత్రాలు పంపింది. అందులో ఘనాకారంలో ఉన్న ఓ వస్తువు కనిపించినట్లు ఆండ్రూ జోన్స్‌ అనే స్పేస్‌ జర్నలిస్ట్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతానికి దీన్ని ‘మిస్టరీ హౌస్‌’గా వ్యవహరిస్తుండడం గమనార్హం.

యుటు-2 రోవర్‌ ‘వోన్‌ కార్మన్‌’ అనే క్రేటర్‌ దగ్గరికి వెళ్లినప్పుడు ఈ దృశ్యం కనిపించినట్లు ఆండ్రూ పేర్కొన్నారు. ప్రస్తుతం అది రోవర్‌కు 80 మీటర్ల దూరంలో ఉన్నట్లు తెలిపారు. అయితే, అది స్తంభమో లేక ఏలియనో కాదని పేర్కొన్నారు. మరైతే అది ఏంటనేది మాత్రం కచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మరో 2-3 ‘ల్యూనార్‌ డేస్‌’(దాదాపు 2-3 నెలలు)లో రోవర్‌ అక్కడికి చేరుకుంటుందని తెలిపారు. ఉల్కలు, గ్రహశకలాలు చంద్రుడిని ఢీకొట్టినప్పుడు పెద్ద పెద్ద రాళ్లు బయటపడుతుంటాయన్నారు. చైనా పంపిన ఛాంగ్‌ ఇ-3 మిషన్‌లోనూ ఇలాంటిది కనిపించినట్లు తెలిపారు. కానీ, అది ఓ పెద్ద బండరాయని తర్వాత తెలిసిందన్నారు.

ఇలా చంద్రుడికి సంబంధించి రోవర్లు పంపే చిత్రాల్లో ఏదో వింత ఆకారాలు కనిపించడం కొత్తేమీ కాదు. గతంలో యుటు-2 పంపిన ఫొటోల్లో ఆకుపచ్చ రంగులో జెల్‌ లాంటి పదార్థం ఒకటి కనిపించింది. తర్వాత జరిపిన పరిశోధనల్లో దాన్ని రాయిగా నిర్ధారించారు. ఇటీవల ఓ పెద్ద మేకు లాంటి ఆకారం కూడా కనిపించింది. అది కూడా రాయే అని తేలింది. ఆండ్రూ జేమ్స్‌.. చైనా అంతరిక్ష కార్యకలాపాల్ని రిపోర్ట్ చేస్తుంటారు. ప్రస్తుతం ఆయన స్పేస్‌.కామ్‌ అనే వార్తా సంస్థకు పనిచేస్తున్నారు.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని