రాత్రయితే ఆకాశం గులాబీ రంగులోకి..!

సృష్టిలోని అందాలన్నీ ఒకెత్తు.. నెలకోసారొచ్చే పౌర్ణమి ఒకెత్తు.. ఆస్వాదించే మనసు ఉండాలే గానీ.. ప్రతి పున్నమీ ఓ పండగే. అయితే ఆ రెండు పట్టణాల్లో మాత్రం ప్రతిరాత్రి పండు వెన్నెలే.. ప్రతిరోజూ నిండు పౌర్ణమే.. ఇంతకీ ఎక్కడ అనుకుంటున్నారా..? స్వీడన్‌లో దాదాపు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న గిస్లోవ్‌, ట్రెల్లెబోర్గ్‌ అనే రెండు చిన్న పట్టణాల్లో..

Published : 12 Dec 2020 17:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సృష్టిలోని అందాలన్నీ ఒకెత్తు.. నెలకోసారొచ్చే పౌర్ణమి ఒకెత్తు. ఆస్వాదించే మనసు ఉండాలే గానీ.. ప్రతి పున్నమీ ఓ పండగే. అయితే ఆ రెండు పట్టణాల్లో మాత్రం ప్రతిరాత్రి పండు వెన్నెలే.. ప్రతిరోజూ నిండు పౌర్ణమే. ఇంతకీ ఎక్కడ అనుకుంటున్నారా..? స్వీడన్‌లోని ఉత్తరప్రాంతంలో ఉన్న గిస్లోవ్‌, ట్రెల్లెబోర్గ్‌ అనే రెండు చిన్న పట్టణాల్లో. అక్కడి ప్రజలు కొద్దిరోజులుగా ఈ విచిత్రానుభూతిని ఎదుర్కొంటున్నారు. రాత్రయితే చాలు ఆకాశం గులాబీవర్ణంలోకి మారి అక్కడి వారిని కనువిందు చేస్తోంది. ఇలా ఉన్నట్టుండి ఆకాశంలో ఏర్పడిన మార్పులను చూసి అక్కడి ప్రజలు మొదట్లో భయపడ్డారట. ఇంతకీ ఆకాశం అలా మారడానికి కారణం ఏంటో తెలుసా..? ఓ టమాట తోట. ఆ తోటలో ఏర్పాటు చేసిన ఎనర్జీ సేవింగ్‌ సిస్టమ్‌ వల్ల ఆకాశంలో కృత్రిమంగా గులాబీవర్ణం ఏర్పడుతోందని తేలింది. ఆ తోట రైతు టమాట మొక్కలకు ఎల్‌ఈడీ లైట్లు ఏర్పాటు చేశారు. దీంతో వాటి కాంతి మేఘాలపై పడటంతో ఇలాంటి మార్పులు వస్తున్నాయని తోట యజమాని చెప్పాడు. ప్రస్తుతం ఆకాశం రంగు మారిన చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.

ఆ రెండు చిన్న పట్టణ వాసులే కాదు.. ఆ మార్గంలో ప్రయాణించే వారంతా ఈ మార్పులను ఎంతో వింతగా తిలకించారు. తర్వాత అక్కడి ప్రజలు గులాబీ వెలుగు వల్ల తాము కంటినిండా నిద్రపోవడం లేదని అధికారులకు ఫిర్యాదు చేశారు. అటు పక్షులకూ దీని వల్ల ప్రమాదం పొంచి ఉందని, గులాబీవర్ణం వల్ల వాటికి కళ్లు కనిపించకగా గందరగోళానికి గురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, దీనిపై టమాట తోట యజమాని స్పందిస్తూ.. మొక్కలపై గులాబీవర్ణం ప్రసరింపజేస్తే త్వరగా ఎదిగి అధిక దిగుబడి వస్తుందన్నాడు. కేవలం ఎల్‌ఈడీ లైట్లను ఉపయోగించి విద్యుత్‌ను ఆదా చేసేందుకే ఇలా చేశానని చెప్పాడు. ప్రజలను ఇబ్బంది పెట్టాలన్నది తన ఉద్దేశం కాదని ఆ రైతు వివరించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని