Telangana News: 111జీవో పరిధి గ్రామాల్లో ఆంక్షలు ఎత్తివేత.. ప్రభుత్వం ఉత్తర్వులు

జీవో 111 పరిధిలోని గ్రామాల్లో ఆంక్షలు ఎత్తివేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. షరతులతో ఆయా గ్రామాల్లో ఆంక్షలను ఎత్తివేస్తూ 69వ నంబర్‌ ఉత్తర్వును పురపాలక శాఖ జారీ చేసింది.

Updated : 20 Apr 2022 20:22 IST

హైదరాబాద్: జీవో 111 పరిధిలోని గ్రామాల్లో ఆంక్షలు ఎత్తివేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. షరతులతో ఆయా గ్రామాల్లో ఆంక్షలను ఎత్తివేస్తూ 69వ నంబర్‌ ఉత్తర్వును పురపాలక శాఖ జారీ చేసింది. అయితే హిమాయత్‌సాగర్‌, ఉస్మాన్‌సాగర్‌ జంట జలాశయాల్లో నీటి నాణ్యత దెబ్బతినరాదని షరతు విధించింది. షరతుల్లో భాగంగా ఎస్టీపీల నిర్మాణం, కాలుష్య  తీవ్రత తగ్గింపునకు చర్యలు తీసుకోనున్నారు. భూగర్భ జలాల నాణ్యత పరిరక్షణకు చర్యలు తీసుకోనున్న ప్రభుత్వం.. జలాశయాల్లోకి నీరు వెళ్లేలా డైవర్షన్‌ ఛానళ్ల నిర్మాణాలు చేపట్టనున్నారు. విధివిధానాల రూపకల్పన, సమగ్ర మార్గదర్శకాల కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో కమిటీనీ ఏర్పాటు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. జంట జలాశయాల పరిరక్షణ, కాలుష్య నిరోధానికి తీసుకోవాల్సిన చర్యలు, గ్రీన్‌ జోన్లు సహా జోన్ల నిర్ధరణ, ట్రంక్‌ వ్యవస్థ అభివృద్ధి కోసం ఈ కమిటీ విధానాలు రూపొందించాల్సి ఉంటుంది. రోడ్లు, డ్రైన్లు, ఎస్టీపీలు, డైవర్షన్ డ్రైన్ల నిర్మాణానికి నిధులు సమీకరించాల్సి ఉంటుంది.

అసలు ఏంటీ జీవో 111...

హైదరాబాద్‌ నగర శివారులోని గండిపేట, హిమాయత్‌సాగర్‌ జలాశయాల పరిరక్షణకు జీవో 111 అమల్లో ఉంది. పది కిలోమీటర్ల పరిధిలో కాలుష్యం కారక పరిశ్రమలు, భారీ హోటళ్లు, నివాస కాలనీలు, ఇతర కాలుష్య కారక నిర్మాణాలపై నిషేధం విధిస్తూ 1994లో తొలుత జీవో నం.192ను తీసుకొచ్చింది. దీనికి కొన్ని సవరణలు చేస్తూ 1996 మార్చి 8న అప్పటి ప్రభుత్వం జీవో 111ను తెచ్చింది.

* క్యాచ్‌మెంట్‌ పరిధిలో వేసే లేఅవుట్లలో 60శాతం ఓపెన్‌ స్థలాలు, రోడ్లకు వదలాలి.

* వినియోగించే భూమిలో 90శాతం కన్జర్వేషన్‌ కోసం కేటాయించాలి. ఇందుకుగాను హుడా బాధ్యత వహించాలి.

* రసాయనాలు, క్రిమిసంహారకాల స్థాయిలు లెక్కించేందుకు ప్రత్యేక ఏజెన్సీతో పర్యవేక్షించాలి.

* జీ+2కి మించి నిర్మాణాలు చేసేందుకు వీల్లేదు.

జీవో 111 ఎత్తివేయడం లేదా పరిధి కుదించాలని..

ఒకప్పుడు జంట జలాశయాల నుంచి హైదరాబాద్‌కు తాగునీటి అవసరాలు తీరేవి. రానురానూ కృష్ణా, గోదావరి జలాలు అందుబాటులోకి రావడంతో జంట జలాశయాలపై ఆధారపడటం లేదని స్థానికులు చెబుతున్నారు. దీనివల్ల జీవో 111 ఎత్తివేయడం లేదా పరిధి కుదించాలని కొన్నేళ్లుగా డిమాండ్‌ చేస్తున్నారు. ఈ జీవోపై అధ్యయనం చేసేందుకు 2016లో తెలంగాణ ప్రభుత్వం హైపర్‌ కమిటీని నియమించింది. గ్రామాల పరిధిలోని పాలకవర్గాలు గతంలో పలుమార్లు తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపించాయి. జీవో ఎత్తివేతకు వ్యతిరేకంగా పలువురు పర్యావరణవేత్తలు న్యాయస్థానాలను ఆశ్రయించారు. జీవోపై స్పష్టమైన వైఖరి ప్రకటించాలని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. దీనిపై గతేడాది సెప్టెంబరులో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులతో ప్రత్యేకంగా సమీక్షించారు. జలాశయాలను పరిరక్షిస్తూ పర్యావరణ పరిరక్షణకు ఇబ్బంది లేకుండా ప్రత్యేకంగా మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించాలని సీఎం ఆదేశించారు. ఈ నేపథ్యంలో పలు షరతులు విధిస్తూ జీవో 111 పరిధి గ్రామాల్లో ఆంక్షలు ఎత్తివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని