Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 17 Oct 2021 13:12 IST

1. Virat on Dravid: ద్రవిడ్‌ విషయంలో ఏం జరుగుతుందో నాకు తెలియట్లేదు: కోహ్లీ

టీమ్ఇండియా నూతన కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌ ఎంపిక దాదాపు ఖరారైంది. ఈరోజు నుంచి ప్రారంభంకానున్న టీ20 ప్రపంచకప్ తర్వాత ప్రస్తుతం ఉన్న రవిశాస్త్రి హెడ్‌కోచ్‌ బాధ్యతల నుంచి తప్పుకోనున్నాడు. ఈ ప్రపంచకప్‌తో అతడి కాంట్రాక్ట్‌ ముగిసిపోనుంది. ద్రవిడ్‌ ఆ స్థానాన్ని భర్తీ చేసే అవకాశం ఉంది. అతడికి ఆసక్తి లేకపోయినా బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ, సెక్రటరీ జైషా ప్రత్యేకంగా సమావేశమై ఒప్పించారని తెలిసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Shardul Thakur: శార్దూల్‌ ఠాకూర్‌ కొత్త ఆపద్బాంధవుడు..!

2. HYD: జలవిహార్‌లో సందడిగా అలయ్ బలయ్‌.. హాజరైన ప్రముఖులు

నగరంలోని జలవిహార్‌లో అలయ్‌ బలయ్‌ కార్యక్రమం సందడిగా జరుగుతోంది. హరియాణా గవర్నర్‌ దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అలయ్‌ బలయ్‌ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, గవర్నర్‌ తమిళిసై, హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ రాజేంద్ర విశ్వనాథ్‌, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌,  ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు, ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు, తదితరులు హాజరయ్యారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. Petrol diesel prices Hike: హైదరాబాద్‌లో రూ.110 దాటిన పెట్రోల్‌ ధర!

దేశంలో ఇంధన ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. ఆదివారం (17-10-2021) లీటర్‌ పెట్రోలుపై గరిష్ఠంగా 37 పైసలు, డీజిల్‌పై 38 పైసల వరకు ఎగబాకింది. దీంతో హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.110 దాటింది. ఇప్పటికే అన్ని రాష్ట్ర రాజధానుల్లోనూ లీటరు పెట్రోలు ధర రూ.100 మార్కును దాటేసింది. దేశంలో చాలా ప్రాంతాల్లో డీజిల్‌ సైతం రూ.100 దాటింది. ముంబయిలో లీటరు పెట్రోలుకు ఆదివారం రూ.111.77, దిల్లీలో 105.84 చొప్పున వసూలు చేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Global NCAP: మీ కారు మిమ్మల్ని కాపాడే సూపర్‌ స్టారా..?

4. AP News: వైకాపాలోని ఓ వర్గానికి మంత్రి సురేశ్‌ భయపడుతున్నారు: అచ్చెన్న

ఏపీలో ఎస్సీలను అణచివేయడమే వైకాపా నైజంగా కనిపిస్తోందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలంలో దళితులపై వైకాపా నాయకుల దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జగన్ పాలనపై ఎస్సీలు వ్యతిరేకంగా ఉన్నారనే దాడులు చేసి బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిషత్ ఎన్నికల్లో  వైకాపా నేతలు ఓడిపోతే దానికి దళితులు కారణం అవుతారా అని నిలదీశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. Pragya Singh Thakur: కబడ్డీ ఆడిన వీల్‌ఛైర్‌ ఎంపీ

మధ్యప్రదేశ్‌ భాజపా నాయకురాలు, భోపాల్‌ ఎంపీ ప్రగ్యాసింగ్‌ ఠాకుర్‌ కబడ్డీ ఆడుతున్న వీడియో ఒకటి వైరలై వివాదంగా మారింది. మాలెగావ్‌ పేలుళ్ల కేసులో నిందితురాలైన ఆమె గత కొన్నేళ్లుగా వీల్‌ఛైర్‌కే పరిమితమయ్యారు. ఈ అనారోగ్య కారణాలను చూపే ఆమె బెయిల్‌పై విడుదలయ్యారు. అయితే శుక్రవారం రాత్రి భోపాల్‌లో సింధి వర్గం ఏర్పాటుచేసిన దుర్గా పూజలో పాల్గొన్న ప్రగ్యాసింగ్‌ అక్కడ యువకులతో సరదాగా కబడ్డీ రైడింగ్‌ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Mohan Bhagwat: కశ్మీర్‌ సమస్యకు పరిష్కారం అప్పుడే!

6. Aryan khan: పేదల కోసం పనిచేస్తా.. చెడు మార్గంలో వెళ్లను: ఆర్యన్‌ఖాన్‌

విడుదల అయిన తర్వాత పేదల సంక్షేమానికి కృషి చేస్తానని.. తనకు చెడ్డపేరు తెచ్చే  పనులు చేయబోనని, చెడు మార్గంలో వెళ్లనని బాలీవుడ్‌ నటుడు షారుఖ్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌ శనివారం ఎన్‌సీబీ అధికారులకు హామీ ఇచ్చాడు. ఈనెల 2న ఓ క్రూయిజ్‌ నౌకలో మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్న కేసులో ఆర్యన్‌ను ఎన్‌సీబీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈమేరకు ముంబయిలోని ఓ జైలులో అధికారులు అతనికి కౌన్సిలింగ్‌ నిర్వహించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. Corona : 2 లక్షల దిగువకు క్రియాశీల కేసులు..

దేశంలో కరోనా మహమ్మారి క్రమంగా అదుపులోకి వస్తోంది. తాజాగా కొత్త కేసులు 14 వేలకు దిగి రావడం ఊరట కలిగిస్తోంది. ఇక మరణాలు కూడా 150లోపే నమోదయ్యాయి. మరోవైపు  రికవరీలు పెరుగుతుండటంతో క్రియాశీల కేసులు 2 లక్షల దిగువకు పడిపోయాయి. కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 11 లక్షల కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 14,146 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇవి 229 రోజుల కనిష్ఠానికి చేరాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. Lovestory: ‘లవ్‌స్టోరీ’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది.. సరికొత్త ట్రైలర్‌ అదిరింది..!

‘లవ్‌స్టోరీ’తో చాలా రోజుల తర్వాత సూపర్‌హిట్‌ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు నటుడు నాగచైతన్య. ఆయన కథానాయకుడిగా నటించిన ఈ సినిమా గత నెలలో విడుదలై బాక్సాఫీస్‌ వద్ద సూపర్‌హిట్‌ టాక్‌ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. కాగా, ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌ డేట్‌ని తాజాగా చిత్రబృందం ప్రకటించింది. అక్టోబర్‌ 22న సాయంత్రం ఆరు గంటల నుంచి ఆహా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ వేదికగా అందుబాటులో ఉంటుందని చిత్రబృందం తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* MAA Elections: ‘మా’పై రాంగోపాల్‌ వర్మ సెటైర్‌

9. China: భారత్‌పైకి భూటాన్‌ అస్త్రం..  మరో కుట్రకు తెరలేపిన చైనా

భారత్, చైనా సీనియర్‌ సైన్యాధికారుల మధ్య 13వ విడత సరిహద్దు చర్చలు విఫలమైన అనంతరం.. మన దేశాన్ని చక్రబంధంలో ఇరికించడానికి బీజింగ్‌ చేస్తున్న కుట్రలు స్పష్టంగా వెలుగులోకి వస్తున్నాయి. మన పొరుగు దేశాల్లో ప్రాబల్యం పెంచుకోవడానికి డ్రాగన్‌ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. దీనికి తాజా ఉదాహరణ భూటాన్‌తో శుక్రవారం కుదుర్చుకున్న అవగాహనా ఒప్పందం (ఎంఓయు). రెండు దేశాల మధ్య అపరిష్కృత వివాదాల పరిష్కారానికి చైనా మూడు అంచెల ఒప్పందాన్ని.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. Heavy rain:  కేరళలో భారీ వర్షాలకు 11 మంది మృతి!

కేరళలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇప్పటి వరకు 11 మంది మృతిచెందారు. మరో 12 మంది గల్లంతయ్యారు. శనివారం కురిసిన భారీ వర్షాల కారణంగా రహదారులు, లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. అయితే, భారీ వర్షాల ధాటికి ఉప్పొంగిన వాగులు, వంకల కారణంగా వరదలు ఇంకా కొనసాగుతున్నాయి. జలాశయాల్లో నీటి మట్టాలు గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని