Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Updated : 23 Jan 2022 17:06 IST

1.ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు మరోసారి కరోనా

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు మరోసారి కరోనా సోకింది. రిపబ్లిక్‌ డే ఉత్సవాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్‌ నుంచి దిల్లీ వెళ్లే ముందు ఆయనకు కొవిడ్‌ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో వెంకయ్యకు కరోనా నిర్ధరణ అయింది. ప్రస్తుతం ఆయన హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. వైద్యుల సూచన మేరకు వారంపాటు ఉపరాష్ట్రపతి స్వీయ నిర్బంధంలో ఉండనున్నట్లు ఆయన కార్యాలయం తెలిపింది.

2.రండి చర్చిద్దాం.. పీఆర్సీ సాధన సమితి నేతలకు మంత్రుల ఫోన్‌

పీఆర్సీ జీవోలపై రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు ఆందోళనలు కొనసాగిస్తున్న వేళ.. పీఆర్సీ సాధన సమితి నేతలతో చర్చలకు ప్రభుత్వం ఆహ్వానించింది. ఉద్యోగ సంఘాల నేతలకు మంత్రులు బొత్స సత్యనారాయణ, పేర్ని నాని ఫోన్‌ చేసి సంప్రదింపులకు రావాలని కోరారు. విజయవాడ రెవెన్యూ భవన్‌లో ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి, రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతలు సమావేశమై రేపు సీఎస్‌కు ఇవ్వనున్న సమ్మె నోటీసు, ఉద్యమ కార్యాచరణ సహా ఇతర అంశాలపై చర్చించారు.

Viral video: పెళ్లి వేడుకలో విషాదం.. డ్యాన్స్‌ చేస్తుండగానే ఆగిన గుండె

3.మార్చి 31 లోపు ప్రతి నియోజకవర్గంలో ‘దళితబంధు’: హరీశ్‌రావు

రాష్ట్రంలో మార్చి 31వ తేదీ లోపు ప్రతి నియోజకవర్గంలో దళితబంధు పథకం అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించినట్లు మంత్రి హరీశ్‌రావు తెలిపారు. దళితబంధు పథకంపై ఆయన సంగారెడ్డిలో ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. సంగారెడ్డి జిల్లాలో ఒక్కో నియోజకవర్గంలో వంద మందికి నిధులు మంజూరు చేసినట్లు చెప్పారు. కలెక్టర్‌ ఖాతాలో నిధులు జమ చేసినట్లు వివరించారు.

4.ఆ నివేదికను బహిర్గతం చేయకపోవడం అత్యంత దుర్మార్గం: ఎమ్మెల్సీ లక్ష్మణరావు

రాష్ట్రంలో రాజ్యాంగం, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ప్రభుత్వం నడుస్తోందని పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ లక్ష్మణరావు విమర్శించారు. ఉద్యోగులూ రాజ్యాంగంలో భాగమేనని.. వారితో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలని కోరారు. విజయవాడ ఎన్జీవో కార్యాలయంలో పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉద్యోగ సంఘాల రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అన్ని జిల్లాలకు చెందిన ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల నేతలు పాల్గొన్నారు.

5.త్వరలో ఆప్‌ మంత్రిని అరెస్టు చేస్తారు.. కానీ, మేం చన్నీలా ఏడ్వం

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల వేళ.. ఆప్‌ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు సమీపిస్తోన్న నేపథ్యంలో త్వరలో దిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్పారు. ‘జైన్‌ను ఈడీ అరెస్టు చేయనున్నట్లు తెలిసింది. ఆయన ఆస్తులపై కేంద్ర ప్రభుత్వం గతంలోనూ రెండుసార్లు దాడులు చేయించినా.. ఏం దొరకలేదు. ఈడీ అధికారులు మళ్లీ రావాలనుకుంటే.. వారికి స్వాగతం’ అని అన్నారు.

6.సమాజ్‌వాదీ పార్టీలోకి దేశంలోనే అత్యంత పొడగరి వ్యక్తి

దేశంలో అత్యంత పొడగరి వ్యక్తిగా గుర్తింపు పొందిన యూపీకి చెందిన ధర్మేంద్ర ప్రతాప్‌ సింగ్‌ సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నరేష్‌ ఉత్తమ్‌ పటేల్‌ ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. ధర్మేంద్ర ప్రతాప్‌ రాకతో రాబోయే ఎన్నికల్లో పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఈ సందర్భంగా నరేష్‌ విశ్వాసం వ్యక్తంచేశారు. సమాజ్‌వాదీ విధానాలు నచ్చి ఆయన చేరారని పార్టీ అధికార ప్రతినిధి రాజేంద్ర చౌధరి తెలిపారు.

Corona : దేశంలో కొవిడ్‌ ఆందోళన.. ఐఐటీ మద్రాస్‌ పరిశోధకుల గుడ్‌ న్యూస్‌

7.కరోనా విజృంభణ.. ఊరటనిచ్చే కబురు!

దేశంలో కరోనా వ్యాప్తి తీరు ఆందోళన కలిగిస్తోంది. గత మూడు రోజులుగా కొత్త కేసులు మూడు లక్షలకు పైగా నమోదవుతున్నాయి. ఈ తరుణంలో ఐఐటీ పరిశోధకులు ఊరటనిచ్చే కబురు అందించారు. ఒకరి నుంచి మరొకరికి వైరస్‌ సంక్రమణ తీరును తెలిపే ఆర్‌-వాల్యూ (రీ-ప్రొడక్షన్‌ నంబర్‌) తగ్గుముఖం పడుతున్నట్లు వెల్లడించారు. జనవరి 14-24 మధ్య ఆర్‌-వాల్యూ 1.57గా నమోదైనట్లు పేర్కొన్నారు.

8.ఐసీసీ టీ20 ఉత్తమ క్రికెటర్‌గా పాక్‌ ఆటగాడు

క్రికెట్‌లో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఐసీసీ టీ20 క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా పాక్‌ బ్యాటర్‌, వికెట్‌ కీపర్‌ మహమ్మద్‌ రిజ్వాన్‌ ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) ఆదివారం ప్రకటించింది. 2021లో 29 టీ20 మ్యాచ్‌లు ఆడిన రిజ్వాన్‌ అత్యుత్తమ ఫామ్‌ను కొనసాగిస్తూ.. 134.89 స్ట్రైక్‌ రేట్‌తో 1,326 పరుగులు సాధించాడు. ఏకంగా 73.66 సగటుతో ఈ రన్స్‌ చేయడం విశేషం.

9.పదవి ఊడగొట్టిన ప్రసంగం..!

నోటి దురద జర్మనీ నేవీ చీఫ్‌ పదవిని ఊడగొట్టింది. ఐరోపా సమాఖ్య విధానానికి భిన్నంగా ఆయన వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటల్లోనే పదవికి రాజీనామా చేయించారు. జర్మనీ నావికాదళం చీఫ్‌ కే అచిమ్‌ షాన్‌బాక్‌ నిన్న భారత్‌లోని న్యూదిల్లీలో ఉన్న మనోహర్‌ పారేకర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టడీస్‌ అండ్‌ అనాలసిస్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.

10.పెళ్లి పెద్దగా మారి ఫ్రెండ్‌ వివాహం జరిపించిన శ్రద్ధాకపూర్‌

నటుడు శక్తికపూర్‌ కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ప్రస్తుతం బాలీవుడ్‌ లక్కీలేడీగా పేరు తెచ్చుకున్నారు నటి శ్రద్ధా కపూర్‌. వరుస ప్రేమ కథా చిత్రాలతో అలరిస్తోన్న ఈ బ్యూటీ.. ‘సాహో’తో తెలుగువారికీ సుపరిచితురాలైంది. ప్రస్తుతం లవ్‌ రంజన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఓ సినిమాలో నటిస్తోంది. తాజాగా తన స్నేహితురాలి వివాహం కోసం పెళ్లి పెద్దగా మారి.. దగ్గరుండి వివాహం జరిపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని