CM Jagan: సీఎం జగన్‌కు నిరసన సెగ.. ‘సిద్ధం’ బస్సును అడ్డుకున్న మహిళలు

‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో సీఎం జగన్‌కు నిరసన సెగ తగిలింది.

Updated : 30 Mar 2024 17:42 IST

జొన్నగిరి: ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో సీఎం జగన్‌కు నిరసన సెగ తగిలింది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో తాగునీటి సమస్య పరిష్కరించాలంటూ గ్రామస్థులు బస్సును అడ్డుకున్నారు. తాగునీరు లేక ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సరైన నాయకుడు లేక గ్రామంలోని చెరువు నింపలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. 

ఖాళీ బిందెలతో మహిళలు.. జగన్‌ను అడ్డుకునేందుకు సిద్ధమైన విషయం ముందే తెలుసుకున్న పోలీసులు అప్రమత్తమయ్యారు. మహిళల వద్ద నుంచి ఖాళీ బిందెలను స్వాధీనం చేసుకున్నారు. అయినా సరే లెక్క చేయకుండా కొందరు మహిళలు సీఎం వాహనాన్ని అడ్డుకున్నారు. ఈక్రమంలో మహిళానేత శ్రీదేవి బస్సులో నుంచి ఆందోళనకారులను వారించే ప్రయత్నం చేశారు. దీంతో విధిలేని పరిస్థితుల్లో జగన్‌ బస్సులో నుంచి కిందకు దిగారు. సెక్యూరిటీ సిబ్బంది భారీగా మోహరించడంతో కొందరు మహిళలతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని చెప్పి వెళ్లి పోయారు. సీఎం జగన్‌ కనీసం స్పష్టమైన హామీ కూడా ఇవ్వలేదని గ్రామస్థులు వాపోయారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని