Pollution Hotspots: దిల్లీలో 150 కాలుష్య హాట్‌స్పాట్‌లు గుర్తించాం

దేశ రాజధాని నగరంలో 150 కాలుష్య హాట్‌ స్పాట్‌లను గుర్తించినట్టు దిల్లీ పర్యావరణశాఖ మంత్రి గోపాల్‌ రాయ్‌ వెల్లడించారు. ‘గ్రీన్‌ దిల్లీ’ యాప్‌ ద్వారా వచ్చిన ఫిర్యాదుల...

Published : 05 Oct 2021 15:57 IST

దిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్‌ రాయ్‌ వెల్లడి

దిల్లీ: దేశ రాజధాని నగరంలో 150 కాలుష్య హాట్‌ స్పాట్‌లను గుర్తించినట్టు దిల్లీ పర్యావరణశాఖ మంత్రి గోపాల్‌ రాయ్‌ వెల్లడించారు. ‘గ్రీన్‌ దిల్లీ’ యాప్‌ ద్వారా వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా వీటిని గుర్తించామన్నారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో భాగంగా గతేడాది ‘గ్రీన్‌ వార్‌ రూమ్‌’ను ఏర్పాటు చేశామని.. దీనిద్వారా కాలుష్య నివారణ చర్యలను సమన్వయం, సమీక్ష చేయడం వంటి చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. ‘గ్రీన్‌ దిల్లీ’ యాప్‌ ఐవోఎస్‌ వెర్షన్‌ను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. కాలుష్యపూరిత చర్యలపై ‘గ్రీన్‌ దిల్లీ’ యాప్‌లో వచ్చే ఫిర్యాదులను తాము పరిష్కరించడంతో పాటు కాలుష్య నియంత్రణకు కృషిచేస్తున్నట్టు తెలిపారు.

ఈ యాప్‌ ద్వారా దాదాపు 27వేల ఫిర్యాదులు రాగా.. 23వేలకు పైగా పరిష్కరించినట్టు మంత్రి వెల్లడించారు. వచ్చిన ఫిర్యాదుల్లో అధికంగా మున్సిపల్‌ కార్పొరేషన్లు, దిల్లీ డెవలప్‌మెంట్‌ అథారిటీ, ప్రజా పనుల విభాగం (పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్టుమెంట్‌)కు సంబంధించినవేనన్నారు. గతంలో కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు,  దిల్లీ కాలుష్య నియంత్రణ అథారిటీ దిల్లీలో మొత్తంగా 13 కాలుష్య హాట్‌స్పాట్లను గుర్తించగా.. తాజాగా 150 హాట్‌స్పాట్‌లను గుర్తించినట్టు మంత్రి ప్రకటించడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని