వీసాల రద్దు జాతి వివక్షే..! చైనా

చైనా విద్యార్థుల వీసాలను రద్దుచేయడం రాజకీయ కక్షతోపాటు జాతి వివక్ష చూపించడమేనని ఆరోపించింది.

Published : 11 Sep 2020 02:06 IST

అమెరికా రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోంది

బీజింగ్‌: చైనాకు చెందిన దాదాపు వెయ్యిమందికిపైగా విద్యార్థులు, పరిశోధకుల వీసాలను అమెరికా రద్దుచేసిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా చైనా స్పందించింది. చైనా విద్యార్థుల వీసాలను రద్దుచేయడం రాజకీయ కక్షతోపాటు జాతి వివక్ష చూపించడమేనని ఆరోపించింది. దీనిపై ప్రతి స్పందించే హక్కు చైనాకు ఉందని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియన్‌ స్పష్టం చేశారు. వివిధ కారణాలతో చైనా విద్యార్థులపై చర్యలు తీసుకుంటూ, అమెరికాలో వారిని అణచివేతకు గురిచేయడాన్ని వెంటనే ఆపాలని అన్నారు. ఈ చర్యలు చైనా విద్యార్థుల మానవ హక్కులను కాలరాయడమేనని ఝావో లిజియన్‌ పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే, చట్ట వ్యతిరేక వాణిజ్య పద్ధతులు, గూఢచర్యానికి చైనా పాల్పడుతున్నట్లు అమెరికా ఆరోపిస్తోంది. ఇలా అమెరికా మేధో సంపత్తితోపాటు కరోనా వైరస్‌ పరిశోధనా సమాచారాన్ని తస్కరించేందుకు విద్యార్థి వీసాలను చైనా దుర్వినియోగం చేస్తోందని ఇప్పటికే పలుమార్లు స్పష్టంచేసింది. జాతీయ భద్రతకు ప్రమాదం పొంచి ఉన్నందున, ఇప్పటివరకు దాదాపు వెయ్యిమంది విద్యార్థుల, పరిశోధకుల వీసాలను రద్దుచేసినట్లు అమెరికా తాజాగా వెల్లడించింది. ఈ నేపథ్యంలో అమెరికా తీరుపై మండిపడిన చైనా, విద్యార్థులపై కక్షసాధింపు చర్యలు ఆపాలని సూచించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని