కరోనా: అక్కడ ప్రతి 17సెకన్లకు ఒక మరణం

కరోనావైరస్ ప్రారంభ దశలో తీవ్ర అల్లకల్లోలానికి గురైన ఐరోపా..మరోసారి అదే పరిస్థితిని ఎదుర్కోంటోంది

Updated : 21 Dec 2022 17:09 IST

హెచ్చరించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

బ్రసెల్స్‌: కరోనావైరస్ ప్రారంభ దశలో తీవ్ర అల్లకల్లోలానికి గురైన ఐరోపా..మరోసారి అదే పరిస్థితిని ఎదుర్కొంటోంది. యూరోపియన్‌ యూనియన్‌లో ప్రతి 17 సెకన్లకు ఒక వ్యక్తి మరణించడం తీవ్రతకు అద్దంపడుతోంది. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థలోని ఈయూ ప్రాంతీయ డైరెక్టర్ హాన్స్ క్లుగే ఆందోళన వ్యక్తం చేశారు.

‘ప్రపంచ వ్యాప్తంగా 28 శాతం కేసులు, 26 శాతం మరణాలు ఈ ప్రాంతంలోనే నమోదవుతున్నాయి. గతవారం 29వేల కేసులు వెలుగు చూడగా, ప్రతి 17 సెకన్లకు ఒక వ్యక్తి మరణిస్తున్నాడు’ అని హాన్స్‌ క్లుగే వెల్లడించారు. గతవారంలో మరణాలు 18 శాతం పెరిగాయని తెలిపారు. అయితే, వైరస్ వ్యాప్తిని నివారించడానికి అక్కడి ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతుండటంతో.. గత మూడు నెలల కాలంలో తొలిసారిగా ఈ వారం కరోనా కేసుల్లో తగ్గుదల కనిపించింది. తాజాగా వారం రోజుల్లో కొత్త కేసులు 10 శాతానికి తగ్గిన నేపథ్యంలో..యూకే, ఫ్రాన్స్, స్పెయిన్ వంటి తదితర ప్రభుత్వాలు విధించిన కఠిన లాక్‌డౌన్లు ఫలితాలిచ్చాయని క్లుగే అభిప్రాయడ్డారు. కానీ, రాజకీయ ప్రయోజనాల కోసం త్వరగా ఆంక్షలు ఎత్తివేయడం సరైంది కాదని హెచ్చరించారు. ప్రస్తుతం కేసుల్లో తగ్గుదల కనిపిస్తున్నా..పరిస్థితి మాత్రం సంక్లిష్టంగానే ఉందని ప్రభుత్వాలను అప్రమ్తతం చేశారు. 

కాగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం.. యూరోపియన్‌ యూనియన్‌లో ఇప్పటివరకు 15.7 మిలియన్ల కొవిడ్-19  కేసులు నమోదు కాగా, మొత్తం మరణాల సంఖ్య 3,55,000గా ఉందని క్లుగే వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని