Pegasus: ‘పెగాసస్‌’ వల పెద్దదే..

దాదాపు రెండేళ్ల క్రితం భారత్‌లో వినిపించిన ‘పెగాసస్‌’ స్పైవేర్‌ ఇప్పుడు దేశాన్ని మరోసారి కుదేపిస్తోంది. ఈ స్పైవేర్‌ సాయంతో పలువురు కేంద్రమంత్రులు, ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టుల ఫోన్లు హ్యాకింగ్‌కు గురైనట్లు తాజాగా సంచలన కథనం వెలువడింది.

Updated : 19 Jul 2021 11:42 IST

మిస్డ్‌కాల్‌తోనే ఫోన్లోకి వచ్చి.. నిఘా పెట్టి

ఇంటర్నెట్‌డెస్క్‌: దాదాపు రెండేళ్ల క్రితం భారత్‌లో వినిపించిన ‘పెగాసస్‌’ స్పైవేర్‌ ఇప్పుడు దేశాన్ని మరోసారి కుదిపేస్తోంది. ఈ స్పైవేర్‌ సాయంతో పలువురు కేంద్రమంత్రులు, ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టుల ఫోన్లు హ్యాకింగ్‌కు గురైనట్లు తాజాగా సంచలన కథనం వెలువడింది. ఇంతకీ ఏంటీ ‘పెగాసస్‌’..? ఫోన్లను ఎలా హ్యాక్‌ చేస్తుంది..?చూద్దాం.

నిఘా కోసం.. సైబర్‌ ఆయుధంగా

ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఎస్‌వో గ్రూప్‌ అనే సంస్థ ‘పెగాసస్‌’ స్పైవేర్‌ని అభివృద్ధి చేసింది. నిఘా కార్యకలాపాల కోసం ఈ స్పైవేర్‌ను ఎన్‌ఎస్‌వో పలు ప్రభుత్వాలు, ప్రభుత్వ ఆధీనంలో పనిచేసే సంస్థలకు విక్రయిస్తుంటుంది. క్రిమినల్స్‌, ఉగ్రవాదులను పట్టుకోవడం కోసం ప్రభుత్వాలు ఈ స్పైవేర్‌ను ఉపయోగిస్తుంటాయి. నిపుణులు దీన్ని సైబర్‌ ఆయుధంగా అభివర్ణిస్తుంటారు. 2016లో తొలిసారిగా ఇది వెలుగులోకి వచ్చింది. ఐఫోన్‌ యూజర్లను లక్ష్యంగా చేసుకుని ఈ స్పైవేర్‌ సాయంతో హ్యాకింగ్‌ జరుగుతున్నట్లు అప్పట్లో కథనాలు వెలువడ్డాయి. దీంతో అప్పుడు యాపిల్‌ సంస్థ ఐఓఎస్‌ అప్‌డేట్‌ వెర్షన్‌ను విడుదల చేసింది. ఇది జరిగిన ఏడాదికి మరో విషయం వెలుగులోకి వచ్చింది. పెగాసస్‌కు ఐఫోన్లతో పాటు ఆండ్రాయిడ్‌ ఫోన్లను హ్యాక్‌ చేసే సామర్థ్యం ఉందని తేలింది. 2019లో భారత్‌లో ఈ స్పైవేర్‌ కలకలం రేపింది. వాట్సాప్‌ ద్వారా కొన్ని అజ్ఞాత సందేశాలు వచ్చాయని, వాటితో తమ ఫోన్లలోకి పెగాసస్‌ను జొప్పించారని కొందరు జర్నలిస్టులు, హక్కుల కార్యకర్తలు ఆరోపించారు. ఇదిలా ఉండగా.. పెగాసస్‌ స్పైవేర్‌తో తమ యూజర్ల గోప్యతకు భంగం కలుగుతోందంటూ రెండేళ్ల క్రితం ఫేస్‌బుక్‌ సంస్థ ఎన్‌ఎస్‌వోపై కేసు కూడా నమోదు చేసింది.

50 దేశాల్లో.. వల

తాజాగా ఈ పెగాసస్‌ మరోసారి వార్తల్లో నిలిచింది. ఇటీవల ఈ స్పైవేర్‌తో హ్యాకింగ్‌కు గురైన వారి డేటాబేస్‌ ఒకటి లీకైంది. ‘ది పెగాసస్’ పేరుతో ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌, ఫ్రాన్స్‌కు చెందిన ఫోర్‌బిడెన్‌ స్టోరీస్‌ దర్యాప్తు జరిపి ఈ డేటాబేస్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది. దీన్ని ‘ది వైర్‌’, ‘వాషింగ్టన్‌ పోస్ట్‌’ సహా ప్రపంచవ్యాప్తంగా 16 వార్తా సంస్థలతో పంచుకున్నాయి. ఇందులో 50వేలకు పైగా ఫోన్‌ నంబర్లు ఉండగా.. ఇప్పటివరకు 1000 నంబర్లను గుర్తించారు. దాదాపు 50 దేశాలకు చెందిన వ్యక్తుల ఫోన్ నంబర్లు ఇందులో ఉన్నాయి. పెగాసస్‌తో లక్ష్యంగా చేసుకున్నవారి జాబితాలో 189 మంది జర్నలిస్టులు, 600మందికి పైగా రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు, 65 మంది వ్యాపార ఎగ్జిక్యూటివ్‌లు, 85 మంది మానవహక్కుల కార్యకర్తలు ఉన్నారు. ఒక్క భారత్‌లోనే 300మందికి పైగా బాధితులుండగా.. అజర్‌బైజాన్‌, బహ్రెయిన్‌, హంగేరి, మెక్సికో, మొరాకో,  సౌదీ అరేబియా తదితర దేశాలకు చెందిన ప్రముఖుల పేర్లు తాజా డేటాబేస్‌లో ఉన్నాయి.

పెగాసస్‌తో హ్యాకింగ్‌ ఎలా..

హ్యాకింగ్‌ కోసం పెగాసస్‌ను ఎంచుకోవడానికి ప్రధాన కారణం.. ఈ స్పైవేర్‌ చాలా రహస్యంగా ఫోన్లోకి వస్తుంది. కనీసం అది మన ఫోన్లో ఉన్న విషయం కూడా గుర్తించలేం. సాధారణంగా నకిలీ వెబ్‌సైట్‌ లింక్‌ల ద్వారా హ్యాకర్లు ఈ స్పైవేర్‌ను పంపిస్తారు. యూజర్లు తమకు తెలియకుండానే ఈ లింక్‌ను క్లిక్‌ చేయడంతో పెగాసస్‌ ఫోన్లో ఇన్‌స్టాల్‌ అవుతుంది. ఇక వాట్సాప్‌ లాంటి యాప్‌ల ద్వారా చేసే వాయిస్‌ కాల్స్‌లో ఉండే సెక్యూరిటీ బగ్‌ల ద్వారా కూడా దీన్ని ఫోన్లలో ఇన్‌స్టాల్‌ చేస్తుంటారు. ఒక్కోసారి కేవలం మిస్డ్‌కాల్‌తోనే దీన్ని ఫోన్లలోకి జొప్పిస్తుంటారు. సాఫ్ట్‌వేర్‌ ఇన్‌స్టాల్‌ అయిన తర్వాత కాల్‌ లాగ్‌లోకి వెళ్లి మిస్డ్‌కాల్‌ను డిలీట్‌ చేస్తారు. అప్పుడు యూజర్‌కు మిస్డ్‌కాల్‌ వచ్చిన విషయం కూడా తెలియదు.

పెగాసస్‌ ఏం చేస్తుంది..

ఒకసారి పెగాసస్‌ ఫోన్లోకి వచ్చిన తర్వాత లక్షిత యూజర్ల చర్యలపై ఇది నిఘా పెడుతుంది. వాట్సాప్‌ ద్వారా జరిపే ఎన్‌క్రిప్టెడ్‌ సందేశాలనూ చదవగలదు. కాల్స్‌ను ట్రాక్‌ చేయడం, లొకేషన్‌ డేటాను తెలుసుకోవడం, యూజర్‌ మాట్లాడే కాల్స్‌ను మైక్రోఫోన్ల ద్వారా విని రికార్డ్‌ చేయడం వంటివి చేస్తుంది. ఇది పూర్తిగా నిఘా టూల్‌ లాంటిది. అందుకే ప్రభుత్వాలు ఎవరిపైనైనా నిఘా పెట్టాలనుకుంటే ఈ స్పైవేర్‌ను ఉపయోగిస్తుంటాయి. అంతేగాక ఇది చాలా స్మార్ట్‌ స్పైవేర్‌. యూజర్‌ తనను గుర్తించకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంటుంది. ఒకవేళ 60 రోజులకు పైగా ఈ మాల్‌వేర్‌ కమాండ్‌ కంట్రోల్‌ సర్వర్‌తో కమ్యూనికేషన్‌ చేయలేకపోయినా.. లేదా తప్పుడు డివైజ్‌లో ఇన్‌స్టాల్‌ అయినట్లు తెలిసినా దానంతట అదే నాశనం అవుతుంది.

ఎన్‌ఎస్‌వో ఏమంటోంది..

అయితే పెగాసస్‌తో హ్యాకింగ్‌ కథనాలు ఎన్‌ఎస్‌వో సంస్థ ఖండిస్తోంది. తాము మంచి పని కోసమే ఈ స్పైవేర్‌ను ప్రభుత్వాలకు విక్రయించామని పేర్కొంది. దీనిపై వస్తున్న వార్తలన్నీ పూర్తిగా అవాస్తవమని, ఆధారల్లేకుండా తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారని దుయ్యబట్టింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని