Go First flight: గో ఫస్ట్ విమానం అత్యవసర ల్యాండింగ్.. ఎందుకంటే..?

స్మోక్‌ వార్నింగ్ రావడంతో దేశీయ విమానయాన సంస్థ గో ఫస్ట్ (Go First) విమానం అత్యవసరంగా ల్యాండ్ కావాల్సి వచ్చింది.

Updated : 12 Aug 2022 17:12 IST

కోయంబత్తూర్‌: బెంగళూరు నుంచి మాల్దీవుల్లోని మాలెకు బయలుదేరిన దేశీయ విమానయాన సంస్థ గో ఫస్ట్‌ (Go First) విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్‌ చేశారు. స్మోక్‌ వార్నింగ్ రావడంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ఫ్లైట్‌ గగనతలంలో ఉండగా పైలట్ స్మోక్ వార్నింగ్‌ను గుర్తించడంతో.. సిబ్బంది అప్రమత్తమై తమిళనాడులోకి కోయంబత్తూర్‌లో అత్యవసరంగా దింపారు. ఆ సమయంలో విమానంలో 92 మంది ప్రయాణికులున్నారు. అయితే అది తప్పుడు అలారం శబ్దమని (ఫాల్టీ స్మోక్‌ అలారం) ఎయిర్‌ పోర్టు అధికారులు వెల్లడించారు. అలారంలో సమస్య ఈ పరిస్థితికి దారితీసిందని, వెంటనే విమానం టేకాఫ్ అవుతుందని చెప్పినట్లు ఓ వార్తా సంస్థ పేర్కొంది. 

గత కొన్ని రోజులుగా దేశీయ విమానాల్లో తరచూ సాంకేతిక లోపాలు, ఇతర సమస్యలు తలెత్తుతున్న విషయం తెలిసిందే. ఆ మధ్య వరుసగా స్పైస్‌జెట్‌, ఇండిగో విమానాలు ఈ సమస్యల కారణంగా దారిమళ్లించడం, అత్యవసర ల్యాండింగ్‌ వంటివి చోటుచేసుకున్నాయి. గత నెల గో ఫస్ట్‌కు చెందిన విమానానికి కూడా తృటిలో పెను ప్రమాదం తప్పింది. గగనతలంలో ఉండగా విమానం విండ్‌ షీల్డ్‌కు పగుళ్లు ఏర్పడ్డాయి. దీంతో విమానాన్ని దారిమళ్లించి అత్యవసరంగా దించేశారు. వరుసగా వెలుగుచూస్తోన్న ఈ సమస్యలపై గత నెల విమానయాన శాఖ మంత్రి జోతిరాదిత్య సింధియా సంస్థల అధిపతులతో సమావేశం నిర్వహించారు. భద్రతా పర్యవేక్షణను పెంచే అన్ని చర్యలను తీసుకోవాలని ఆదేశించారు.

ఈ క్రమంలోనే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) నిబంధనలను మరింత కఠినతరం చేసింది. బేస్‌, ట్రాన్సిట్ స్టేషన్లలో నిపుణులు అనుమతించిన తర్వాతే విమానాలు బయటకు రావాలనే నిబంధనను తప్పనిసరి చేసింది. B1/B2 లైసెన్స్‌ ఉన్న నిపుణులైన ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటనెన్స్ ఇంజినీర్ నుంచి సరైన అనుమతి తర్వాతే బేస్‌, ట్రాన్సిట్ స్టేషన్లలో విమానాలను విడుదల చేయాలనే నిబంధనను తప్పనిసరి చేస్తున్నట్లు డీజీసీఏ వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని