అలాంటి పోలీసు చిత్రాలు డేంజర్‌: బాంబే హైకోర్టు న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు

సింగం(Singham) వంటి పోలీసు చిత్రాలను ఉద్దేశించిన బాంబే హైకోర్టుకు చెందిన జడ్జి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏమన్నారంటే..?

Updated : 23 Sep 2023 18:21 IST

ముంబయి: న్యాయ ప్రక్రియను పట్టించుకోకుండా సత్వరమైన న్యాయాన్ని అందించే సింగం(Singham) వంటి పోలీసు సినిమాలు ప్రమాదకరమని బాంబే హైకోర్టుకు చెందిన న్యాయమూర్తి జస్టిస్ గౌతమ్ పటేల్(Justice Gautam Patel of the Bombay High Court ) అభిప్రాయపడ్డారు. ఇలాంటి సినిమాలు హానికరమైన సందేశాన్ని పంపుతాయని అన్నారు. ఇండియన్ పోలీసు ఫౌండేషన్ వార్షికోత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా న్యాయ ప్రక్రియ విషయంలో ప్రజల అసహనాన్ని ప్రశ్నించారు.

‘పోలీసుల్ని రౌడీలు, జవాబు దారీ లేనివారిగా చూపించడం పట్ల ప్రజలు ఆకర్షితులవుతున్నారు. న్యాయమూర్తులు, రాజకీయ నాయకులు, జర్నలిస్టుల గురించి ఇలాగే చిత్రీకరిస్తున్నారు.  కోర్టులు తమ పని తాము చేయడం లేదని ప్రజలు భావించినప్పుడు.. పోలీసుల చర్యలను స్వాగతిస్తున్నారు. అందుకు ఉదారహరణగా.. అత్యాచార కేసుల్లోని నిందితుల్ని పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేసినప్పుడు ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. అప్పుడు న్యాయం జరిగిందని వారు భావిస్తారు. కానీ న్యాయం జరిగిందా..?’ అని ప్రశ్నించారు.

పన్నూ వార్నింగ్ ఇస్తే.. కేంద్రం షాకిచ్చింది: ఆస్తులు స్వాధీనం చేసుకున్న ఎన్‌ఐఏ

‘సింగం చిత్రం క్లైమాక్స్‌లో మొత్తం పోలీసులందరూ విలన్‌ పాత్రగా చిత్రీకరించిన రాజకీయ నాయకుడిపై తిరగబడతారు. దాంతో అక్కడ న్యాయం జరిగినట్లు చూపించారు. కానీ అక్కడ న్యాయం జరిగిందా..? ఎందుకింత అసహనం. ఈ ప్రక్రియ నిదానంగా జరుగుతుంది. వ్యక్తి స్వేచ్ఛను హరించకూడదనే సూత్రమే అందుకు కారణం. షార్ట్‌కట్స్‌ వెంటపడితే ఈ న్యాయ ప్రక్రియ ప్రశ్నార్థకంగా మారుతుంది. అందుకే ఇలాంటి సందేశాలు ఎంత ప్రమాదకరమో ఆలోచించారా..?’ అని అన్నారు.

పోలీసు యంత్రాంగం పనితీరులో  సంస్కరణలు తీసుకురావాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిల్‌ వేసిన  యూపీ మాజీ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్ పోలీసు ప్రకాశ్‌ సింగ్‌ ప్రయత్నాన్ని జడ్జి కొనియాడారు. ఆయన సంస్కరణలు సాకారం కావడంలో అవిశ్రాంత పోరాటం చేశారని చెప్పారు. అలాగే మనల్ని మనం సంస్కరించుకుంటే తప్ప చట్టం అమలులో యంత్రాంగాన్ని సంస్కరించడం సాధ్యం కాదని వ్యాఖ్యానించారు. 

2011లో రోహిత్‌శెట్టి దర్శకత్వంలో సింగం సినిమా విడుదలైంది. అందులో బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గణ్ ఒక పవర్‌ఫుల్ పోలీసు అధికారిగా కనిపిస్తారు. ఇది 2010లో వచ్చిన తమిళ చిత్రానికి రీమేక్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని