Finance Ministry: ఆర్థిక శాఖ సమాచారం విదేశాలకు లీక్‌.. బడ్జెట్‌ వేళ కలకలం

గూఢచర్యం (espionage) ఆరోపణలతో కేంద్ర ఆర్థికశాఖలో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్న ఓ వ్యక్తిని దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఆర్థిక శాఖకు చెందిన కీలక సమాచారాన్ని అతడు విదేశాలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు.

Updated : 19 Jan 2023 11:48 IST

దిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరానికి గానూ దేశ బడ్జెట్‌ (Budget 2023)ను ప్రవేశపెట్టేందుకు కేంద్ర ఆర్థిక శాఖ సిద్ధమవుతున్న వేళ.. ఈ మంత్రిత్వ శాఖ (Finance Ministry)లో గూఢచర్యం ఘటన కలకలం రేపుతోంది. ఆర్థికశాఖలో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తోన్న ఓ వ్యక్తి.. అత్యంత రహస్య సమాచారాన్ని విదేశాలకు అందిస్తున్నట్లు దిల్లీ పోలీసు క్రైం బ్రాంచ్‌ గుర్తించి అరెస్టు చేసింది.

గూఢచర్యం (espionage) ఆరోపణలతో ఆర్థికశాఖలో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్న సుమిత్‌ను దిల్లీ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేస్తున్న అతడు గత కొంతకాలంగా ఆర్థిక మంత్రిత్వ (Finance Ministry) శాఖకు చెందిన కీలక సమాచారాన్ని విదేశాలకు అందిస్తున్నాడని, అందుకు బదులుగా భారీ మొత్తంలో డబ్బు తీసుకుంటున్నాడని పోలీసులు వెల్లడించారు. అధికారిక రహస్యాల చట్టం కింద అతడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు తెలిపారు. సమాచారాన్ని చేరవేసేందుకు నిందితుడు ఉపయోగించిన మొబైల్‌ ఫోన్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

2023-24 ఆర్థిక సంవత్సరానికి గానూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ (Nirmala Sitharaman) ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో దేశ బడ్జెట్‌ (Union Budget 2023)ను ప్రవేశపెట్టనున్నారు. ఈ సమయంలో ఈ గూఢచర్యం ఘటన బయటకు రావడం కలకలం రేపుతోంది. బడ్జెట్‌కు సంబంధించిన పత్రాలు విదేశాలకు లీకైతే.. దేశ మార్కెట్‌పై అది ప్రతికూల ప్రభావం చూపుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ఇటీవల కేంద్ర మంత్రిత్వ శాఖల్లో తరచూ గూఢచర్య ఘటనలు వెలుగు చూస్తుండటం దేశ భద్రతకు సవాలుగా మారుతోంది. గతేడాది నవంబరులో గూఢచర్యం ఆరోపణలపై విదేశాంగ మంత్రిత్వ శాఖలో డ్రైవర్‌ను దిల్లీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. పాకిస్థాన్‌కు చెందిన ఓ మహిళ వలపు వలలో చిక్కుకున్న ఆ డ్రైవర్‌‌.. విదేశాంగ శాఖకు చెందిన పత్రాలు, సమాచారాన్ని చేరవేశాడని, అందుకు బదులుగా డబ్బు తీసుకున్నాడని పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని