XE Variant: దేశంలో మొదటి ఎక్స్‌ఈ వేరియంట్ కేసు.. ధ్రువీకరించిన ఇన్సాకాగ్‌

దేశంలో ఒమిక్రాన్ సబ్‌ వేరియంట్ ఎక్స్‌ఈ మొదటి కేసును గుర్తించినట్లు తాజాగా ఇన్సాకాగ్ ధ్రువీకరించింది.

Published : 04 May 2022 02:14 IST

దిల్లీ: దేశంలో ఒమిక్రాన్ సబ్‌ వేరియంట్ ఎక్స్‌ఈ మొదటి కేసును గుర్తించినట్లు తాజాగా ఇన్సాకాగ్ ధ్రువీకరించింది. అత్యంత సాంక్రమిక శక్తి ఉందని భావిస్తోన్న ఈ వేరియంట్‌ ఇదివరకే గుజరాత్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో వెలుగుచూసినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే వాటిపై కచ్చితమై నిర్ధారణ లేదు. తాజాగా వైరస్ జన్యుక్రమాన్ని గుర్తించే ల్యాబొరేటరీల ప్రభుత్వ కన్సార్షియం(ఇన్సాకాగ్) దీనిపై స్పష్టత ఇచ్చింది. 

‘BA.2.10, BA.2.12.. BA.2 ఉప రకాలుగా గుర్తించాం. BA.2 పాత సీక్వెన్సులే కొత్త వాటిగా వర్గీకరణకు గురయ్యాయి. ఇవి వైరస్ తీవ్రత పెంచుతాయనేదానికి ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లేవు.  గత వారంతో పోల్చితే 12 రాష్ట్రాల్లో కేసులు పెరుగుతోన్న దాఖలాలు కనిపిస్తున్నాయి. 19 రాష్ట్రాల్లో తగ్గుతున్నాయి. ఇప్పటివరకూ దేశంలో ఎక్స్‌ఈ క్లస్టర్లు ఏర్పడిన దాఖలాలు లేకపోవడం ఊరటనిచ్చే అంశం’ అంటూ ఇన్సాకాగ్ తాజాగా వెల్లడించింది.  

ఒమిక్రాన్‌ ఉపరకాలైన బీఏ.1, బీఏ.2 ల కలయికగా భావిస్తోన్న ఎక్స్‌ఈ వేరియంట్‌ తొలుత బ్రిటన్‌లో వెలుగు చూసింది. అనంతరం, పలు దేశాలకూ పాకింది. కొద్ది వారాల క్రితం ఈ వేరియంట్‌ కేసులు గుజరాత్‌, మహారాష్ట్రలో నమోదైనట్లు స్థానిక ప్రభుత్వాలు వెల్లడించాయి. అయితే, ఎక్స్‌ఈ వేరియంట్‌ వ్యాప్తి, తీవ్రతపై స్పష్టత లేనప్పటికీ ప్రాథమిక ఆధారాల ప్రకారం ఈ వేరియంట్‌ అధిక సాంక్రమికశక్తి కలిగిఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఒమిక్రాన్‌లో ఇప్పటివరకు ఉన్న ఇతర ఉత్పరివర్తనాల కంటే వ్యాపించే గుణం ఎక్స్‌ఈ వేరియంట్‌కు దాదాపు 10శాతం ఎక్కువ ఉన్నట్లు బ్రిటన్‌ పరిశోధకులు అంచనా వేశారు. ప్రస్తుతం దేశంలో ఒమిక్రాన్ సబ్ వేరియంట్ల ఉనికి కనిపిస్తున్నప్పటికీ.. కరోనా కొత్త కేసుల సంఖ్య మాత్రం అదుపులోనే ఉంది. వ్యాక్సినేషన్, కరోనా కారణంగా సహజంగా సంక్రమించిన రోగనిరోధకత.. వైరస్ కట్టడిలో కీలక పాత్ర పోషిస్తున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని