Amrullah Saleh: పరిస్థితి దయనీయంగా మారింది.. పంజ్‌ షేర్‌ను కాపాడాలని ఐరాసకు విజ్ఞప్తి

పంజ్‌షేర్‌ వ్యాలీపై తాలిబన్ల దాడులను అరికట్లేలా చర్యలు చేపట్టాలని అఫ్గాన్‌ మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్‌ ఐక్యరాజ్య సమితికి విజ్ఞప్తి చేశారు.....

Updated : 05 Sep 2021 18:54 IST

కాబుల్‌: పంజ్‌షేర్‌ వ్యాలీపై తాలిబన్ల దాడులను అరికట్లేలా చర్యలు చేపట్టాలని అఫ్గాన్‌ మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్‌ ఐక్యరాజ్య సమితికి విజ్ఞప్తి చేశారు. పంజ్‌షేర్‌లో ప్రస్తుతం సంక్షోభం కొనసాగుతోందని తెలిపారు. తాలిబన్లు ఈ ప్రాంతానికి మానవవనరులు, నిత్యావసరాలను నిలిపివేశారని.. ప్రస్తుతం దాడులకు తెగబడ్డారని, వారి అరాచకాలను అరికట్టాలని ఐక్యరాజ్య సమితితోపాటు అంతర్జాతీయ నేతలను ఆయన కోరారు. సంక్షోభాన్ని నివారించేందుకు తక్షణసాయం అందించాలని వేడుకున్నారు.

పంజ్‌షేర్‌ ప్రావిన్స్‌తోపాటు, బగ్లాన్‌ ప్రావిన్స్‌లోని మూడు జిల్లాల్లో ఆర్థిక వనరులు, సెల్‌ఫోన్‌ సిగ్నళ్ల నిలిపివేతతో ఇక్కడ మహా మానవ సంక్షోభం ఏర్పడిందని అఫ్గాన్‌ మాజీ ఉపాధ్యక్షుడు ఐరాసకు లేఖ రాశారు. ‘పంజ్‌షేర్‌ ప్రావిన్స్‌పై తాలిబన్ల దాడిని నివారించాలని ఐక్యరాజ్యసమితితోపాటు అంతర్జాతీయ సమాజాన్ని కోరుతున్నా. వేలాది మంది నిర్వాసితులు, స్థానిక పౌరులను రక్షించేందుకు రాజకీయ పరిష్కారం చూపించాలి’ అని కోరారు. తాలిబన్లతోపాటు విదేశీ దుష్ట శక్తులు పంజ్‌షేర్‌పై దాడి చేస్తున్నట్లు తెలిపారు.

మహిళలు, చిన్నారులు, వృద్ధులు సహా పంజ్‌షేర్‌లో 2.5లక్షల మంది నివాసం ఉంటున్నారని, కాబుల్‌ ఆక్రమణలతో మరో 10వేలమంది ఇక్కడకు చేరుకున్నట్లు అమ్రుల్లా వివరించారు. ‘తాలిబన్లపై భయంతో ఈ ప్రాంతానికి చేరుకున్నవారంతా మసీదులు, పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలతోపాటు మరికొందరు బహిరంగ ప్రదేశాల్లో ఆకలితో అలమటిస్తున్నారు. పంజ్‌షేర్‌తోపాటు వ్యాలీలోని మరికొన్ని ప్రాంతాలు కూడా సంక్షోభంతో ఇక్కట్లు పడుతున్నాయి. ఈ పరిస్థితిపై దృష్టి సారించకపోతే మానవహక్కులు అడుగంటిపోతాయి. తిండి కోసం సామూహిక హత్యలు, మారణహోమం జరిగే అవకాశం ఉంది’ అని ఆయన భయాందోళన వ్యక్తం చేశారు.

ఈ సంక్షోభాన్ని నివారించేందుకు తక్షణసాయం అందించాలని అమ్రుల్లా సలేహ్‌ కోరారు. ఆహారం, నీరు, వైద్య సదుపాయాలు అత్యవసరమని ఐరాసకు తెలియజేశారు. తన ఈ విన్నపంపై ఐరాస, ఐక్యరాజ్య సమితి, రెడ్‌క్రాస్‌ సొసైటీ, ఎన్‌జీఓలు సహా స్వచ్ఛంద సంస్థలు స్పందించి తగు సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. దేశం మొత్తాన్ని ఆక్రమించుకున్న తాలిబన్లు కొరకరాని కొయ్యగా మారిన పంజ్‌షేర్‌ను వశం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రాంతానికి అన్ని సదుపాయాలను నిలిపివేశారు. ప్రస్తుతం అక్కడకు చేరుకొని దాడులు ప్రారంభించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని