సాధారణ పరిస్థితులు రావాలంటే..

భూమండలం మొత్తం కరోనా వైరస్‌తో వణికిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా 20 లక్షల మందికిపైగా వైరస్‌ బారిన పడ్డారు. అందులో 1,30,000 మందికిపైగా మృతిచెందారు...

Updated : 16 Apr 2020 10:05 IST

ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెర్రస్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: భూమండలం మొత్తం కరోనా వైరస్‌తో వణికిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా 20 లక్షల మందికిపైగా వైరస్‌ బారిన పడ్డారు. అందులో 1,30,000 మందికిపైగా మృతిచెందారు. ప్రాణాంతక వైరస్‌ను కట్టడిచేయడానికి ఇప్పటికే అన్ని దేశాలు లాక్‌డౌన్‌ పాటిస్తుండడంతో భూమ్మీద సగం జనాభా ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో రవాణా, వాణిజ్య, పారిశ్రామిక రంగాలతో పాటు ఎన్నో ఉపాధి రంగాలు మూతబడ్డాయి. ఇలాంటి విపత్కర పరిస్థితులు పోయి సాధారణ జనజీవనం కొనసాగాలంటే కొవిడ్‌ 19కు వ్యాక్సిన్‌ కనుగొనడం ఒకటే మార్గమని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెర్రస్‌ అభిప్రాయపడ్డారు. 

ఐక్యరాజ్య సమితిలో భాగస్వామ్యమైన సుమారు 50 అఫ్రికా దేశాలతో ఆంటోనియో వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనాను నివారించాలంటే సరైన మందు కనుగొనడం ఒకటే మార్గమని చెప్పారు. దాని వల్ల లక్షల మంది జీవితాలతో పాటు లక్షల కోట్ల డబ్బును ఆదా చేయొచ్చని చెప్పారు. ‘కొవిడ్‌ 19కు సరైన వ్యాక్సిన్‌ కనుగొంటేనే ప్రపంచం తిరిగి కోలుకునే అవకాశం ఉంది’ అని అన్నారు. ఈ మందును త్వరగా కనుగొనాలని, అది విశ్వవ్యాప్తంగా అందరికీ ఉపయోగపడేలా ఉండాలని తెలిపారు. 2020 చివరి నాటికి కరోనా వ్యాక్సిన్‌ను కనుగొనాలని ఆశాభావం వ్యక్తంచేశారు. ఈ మహమ్మారిని ఎదుర్కోడానికి మార్చి 25న తాను 2 బిలియన్ డాలర్ల విరాళాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తే, అందులో 20 శాతం మేర సేకరించినట్లు ఆంటోనియో వెల్లడించారు. 

అలాగే ప్రపంచ ఆరోగ్య సంస్థ ద్వారా ఐక్యరాజ్య సమితి 47 ఆఫ్రికా దేశాల్లో కరోనా పరీక్షలు జరిపించడానికి సన్నద్ధమైందని స్పష్టంచేశారు. కరోనా మహమ్మారి పరిణామాలను తగ్గించడానికి పలు దేశాలు చేస్తున్న కృషిని ఆయన కొనియాడారు. విపత్కర పరిస్థితుల్లో వ్యాపార సంస్థలు రిటర్నులు దాఖలు చేయడానికి ఉగాండా ఎక్కువ సమయం ఇచ్చిందని చెప్పారు. అలాగే ఉపాధి కోల్పోయిన వారికి నమీబియా ప్రభుత్వం అత్యవసర ఆదాయం ప్రకటించిందని తెలిపారు. ఇక కేప్ వెర్డే ప్రజలకు ఆహార సదుపాయల్ని కల్పిస్తుందని, ఈజిప్ట్.. పరిశ్రమల పన్నును తగ్గించిందని వివరించారు.

ఇవి చదవండి:

అమెరికాలో 24 గంటల్లో 2569 మరణాలు

మలేరియా ఔషధం... మర్మమిదే!

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని