వైద్య సిబ్బందిపై దాడిచేస్తే 7ఏళ్ల వరకు జైలు

రోనాపై యావత్‌ దేశం పోరాడుతున్న వేళ కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల కాలంలో వైద్య సిబ్బందిపై జరుగుతున్న దాడులను తీవ్రంగా పరిగణిస్తూ ఓ ఆర్డినెన్స్‌.....

Published : 22 Apr 2020 16:31 IST

సంబంధిత ఆర్డినెన్స్‌కు కేంద్ర కేబినెట్‌ ఆమోదం

దిల్లీ: కరోనాపై యావత్‌ దేశం పోరాడుతున్న వేళ కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల కాలంలో వైద్య సిబ్బందిపై జరుగుతున్న దాడులను తీవ్రంగా పరిగణిస్తూ ఓ ఆర్డినెన్స్‌ తీసుకొచ్చింది. ఇకపై ఎవరైనా కరోనాపై పోరాడుతున్న వైద్య సిబ్బందిపై దాడులకు పాల్పడితే నాన్‌ బెయిలబుల్‌ కేసులు నమోదు చేసి గరిష్ఠంగా ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధించనున్నారు. ఈ మేరకు 1987 నాటి అంటురోగాల చట్టానికి సవరణలు చేస్తూ తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు కేంద్ర కేబినెట్‌ ఆమోదం ముద్ర వేసింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అనంతరం కేబినెట్‌ నిర్ణయాలను కేంద్రమంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ మీడియాకు వివరించారు.

కరోనాపై దేశాన్ని కాపాడుతున్న వైద్య సిబ్బందిపై దాడులు జరగడం హేయమని కేంద్రమంత్రి ప్రకాష్‌ జావడేకర్‌ అన్నారు. ఇకపై అలాంటివి చేస్తే సహించేది లేదని  పేర్కొన్నారు. ఇందుకోసం కఠిన నిబంధనలతో ఆర్డినెన్స్‌ తీసుకొచ్చినట్లు తెలిపారు. వైద్యులపై దాడికి పాల్పడిన వారిపై కేసు తీవ్రతను బట్టి ఆరు నెలల నుంచి ఏడేళ్ల వరకు జైలు విధిస్తామని, రూ.లక్ష నుంచి 5 లక్షల వరకు జరిమానా విధిస్తామని చెప్పారు. దాడి సమయంలో వైద్య సిబ్బంది వాహనాలు, ఆసుపత్రికి సంబంధించి ఏదైనా ఆస్తి నష్టం సంభవిస్తే మార్కెట్‌ విలువ ప్రకారం లెక్కించి అంతకు రెట్టింపు మొత్తాన్ని నిందితుల నుంచి వసూలు చేస్తామని హెచ్చరించారు. రాష్ట్రపతి ఆమోదం అనంతరం ఆర్డినెన్స్‌ అమల్లోకి రానుందని తెలిపారు.  

క్లిష్టమైన సమయంలో వైద్యులు, ఆశావర్కర్లు, పారిశుద్ధ్య సిబ్బంది దేశానికి ఎనలేని సేవలందిస్తున్నారని జావడేకర్‌ కొనియాడారు. కాబట్టి కరోనా విధుల్లో ఉన్న అన్ని రకాల సిబ్బందికి రూ.50 లక్షల వరకు వైద్య బీమా సదుపాయం కల్పిస్తున్నట్లు  చెప్పారు. కొవిడ్‌ బాధితులకు ఆయుష్మాన్‌ భారత్‌ కింద చికిత్స అందించనున్నట్లు తెలిపారు. కరోనాపై పోరుకు రూ.15వేల కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. విమాన సేవలు ప్రారంభంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, సేవల పునరుద్ధరణకు సంబంధించిన తేదీని ప్రకటిస్తామని జావడేకర్‌ చెప్పారు.

ఇవీ చదవండి..

కిమ్‌ ఆరోగ్యంపై ఉత్తర కొరియా మౌనం

కిమ్‌ బాగుండాలని కోరుకుంటున్నా: ట్రంప్‌

చైనా దాన్ని అమలు చేయాల్సిందే.. లేదంటే!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని