రుణ లక్ష్యం రూ.15.4 లక్షల కోట్లు

ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇచ్చేందుకు  2023-24లో సెక్యూరిటీల ద్వారా   రూ.15.4 లక్షల కోట్లను అప్పుగా తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది.

Published : 02 Feb 2023 05:37 IST

 సెక్యూరిటీల ద్వారా సేకరించాలని ప్రతిపాదన

దిల్లీ: ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇచ్చేందుకు  2023-24లో సెక్యూరిటీల ద్వారా   రూ.15.4 లక్షల కోట్లను అప్పుగా తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇందులో రూ.11.8 లక్షల కోట్లను డేటెడ్‌ సెక్యూరిటీల ద్వారా తీసుకుంటామని, మిగిలినది చిన్న మొత్తాల పొదుపు.. తదితర మార్గాల ద్వారా పొందుతామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తన బడ్జెట్‌ ప్రసంగంలో తెలిపారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.14.21 లక్షల కోట్లు రుణంగా సేకరించాలన్నది లక్ష్యం కాగా జనవరి 27నాటికి రూ.12.93 లక్షల కోట్లు తీసుకున్నామని ఇది లక్ష్యంలో 91శాతం అని తెలిపారు. వార్షిక స్థూల జాతీయ ఉత్పత్తి(జీడీపీ)లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రుణ వాటా 83శాతంగా ఉందన్నారు. రాయితీల బిల్లు పెరిగినా ద్రవ్యలోటు 6.4శాతంగానే ఉందని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. కొత్త ఆర్థిక సంవత్సరంలో రుణేతర ఆదాయం రూ.27.2 లక్షల కోట్లని.. ఖర్చులు రూ.45 లక్షల కోట్లుగా అంచనా వేశామని తెలిపారు. పన్నుల ద్వారా నికర ఆదాయం రూ.23.3 లక్షల కోట్లు వస్తుందని అంచనా వేస్తున్నామని ద్రవ్యలోటును 5.9  శాతానికి కట్టడి చేశామని వివరించారు. 2025-26 నాటికి ద్రవ్యలోటును జీడీపీలో 4.5 శాతానికి తగ్గించాలన్నది లక్ష్యమని ఆమె పేర్కొన్నారు.

2022-23కి సంబంధించి స్థూల మార్కెట్‌ రుణాలను రూ.14.21 లక్షల కోట్లకు పరిమితం చేయాలని కేంద్ర ప్రభుత్వం సెప్టెంబరులో నిర్ణయించినా అవి  రూ.14.95 లక్షల కోట్లకు చేరాయి.

2022-23లో మార్కెట్‌ ద్వారా రూ.9.7 లక్షల కోట్ల నికర రుణాలు తీసుకోవాలని అంచనాలు రూపొందించినా రూ.11.6 లక్షల కోట్లు సేకరించారు.

రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం 50 ఏళ్ల పాటు ఇచ్చే వడ్డీ లేని రుణాలను మరో ఏడాది పాటు కొనసాగిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని