కరోనాతో చనిపోయాడని అంత్యక్రియలు.. రెండేళ్లకు తిరిగి ప్రత్యక్షమైన యువకుడు

రెండేళ్ల క్రితం ఓ యువకుడు కరోనా బారిన పడ్డాడు. చికిత్స పొందుతూ చనిపోయాడని ఆస్పత్రి వర్గాలు మృతదేహాన్ని అప్పగించగా.. కుటుంబసభ్యులు భారమైన హృదయాలతో అంత్యక్రియలు నిర్వహించారు.

Updated : 17 Apr 2023 09:30 IST

రెండేళ్ల క్రితం ఓ యువకుడు కరోనా బారిన పడ్డాడు. చికిత్స పొందుతూ చనిపోయాడని ఆస్పత్రి వర్గాలు మృతదేహాన్ని అప్పగించగా.. కుటుంబసభ్యులు భారమైన హృదయాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఇప్పుడు అదే వ్యక్తి మళ్లీ ఇంటి ముందు ప్రత్యక్షం అయ్యాడు. మధ్యప్రదేశ్‌లోని ధార్‌ జిల్లాలో ఈ ఘటన వెలుగుచూసింది. 2021లో కరోనా రెండో ఉద్ధృతి సమయంలో కమలేశ్‌ పాటిదార్‌ (35)ను ఆయన కుటుంబసభ్యులు గుజరాత్‌లోని వడోదర ఆస్పత్రిలో చేర్చారు. మహమ్మారితో పోరాడుతూ అతను మృతిచెందినట్లు వైద్యులు వెల్లడించారు. మృతదేహానికి అప్పటి నిబంధనల ప్రకారం కుటుంబ సభ్యులు అక్కడే అంత్యక్రియలు నిర్వహించి, స్వస్థలానికి తిరిగి వచ్చారు. ఈ సంఘటన జరిగిన దాదాపు రెండేళ్ల తర్వాత కమలేశ్‌ కరోడ్కల గ్రామంలోని తన ఇంటికి వచ్చాడు. చనిపోయాడనుకున్న వ్యక్తి ఒక్కసారిగా ప్రత్యక్షం కావడంతో కుటుంబసభ్యులు షాక్‌కు గురయ్యారు. ఇన్నాళ్లు ఎక్కడున్నావని ప్రశ్నించగా.. అతని నుంచి సరైన సమాధానం రాలేదు. దీంతో వారు అధికారులను ఆశ్రయించారు. కమలేశ్‌ను విచారించాక స్పష్టత వస్తుందని పోలీసులు తెలిపారు. ఆసుపత్రిలో ఏదైనా పొరపాటు జరిగిందా అనే విషయం కూడా విచారణలో తేలాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని