దేశంలో 50వేలు దాటిన కరోనా కేసులు!

భారత్‌లో కరోనా వైరస్‌ ఉద్ధృతమవుతోంది. కొత్తగా నమోదవుతున్న కేసులతో పాటు, క్రియాశీల కేసులు, మరణాల సంఖ్యలోనూ పెరుగుదల కొనసాగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

Published : 25 Mar 2021 09:54 IST

దిల్లీ: భారత్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తి ఉద్ధృతమవుతోంది. కొత్తగా నమోదవుతున్న కేసులతో పాటు, క్రియాశీల కేసులు, మరణాల సంఖ్యలోనూ పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. క్రితం రోజుతో పోలిస్తే బుధవారం రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. గడిచిన 24గంటల్లో 10.65లక్షల పరీక్షలు చేయగా.. 53,476 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,17,87,534కి చేరింది. కొత్తగా 26,490 మంది వైరస్ బారి నుంచి బయటపడ్డారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 1,12,31,650కు చేరి.. రికవరీ రేటు 95.49శాతానికి తగ్గింది. 

ఇక కరోనా మరణాలు అంతకుముందు రోజు 275 నమోదు కాగా.. బుధవారం 251 మంది మరణించారు. దీంతో మహమ్మారి వెలుగులోకి వచ్చిన నాటి నుంచి దేశవ్యాప్తంగా కరోనాతో మరణించిన వారి సంఖ్య 1,60,692కి చేరింది. ఇక మరణాల రేటు 1.37 శాతానికి చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రియాశీల కేసుల సంఖ్య  3,95,192కి పెరిగింది. దేశంలో కరోనా వ్యాక్సిన్‌ ప్రక్రియ సజావుగానే సాగుతోంది. గడిచిన 24గంటల్లో 23.03లక్షల మందికి టీకా వేశారు. దీంతో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా టీకా తీసుకొన్న వారి సంఖ్య 5,31,45,709కి చేరింది. 

మహారాష్ట్రలో రికార్డు స్థాయిలో కేసులు
మహారాష్ట్రలో కరోనా వైరస్‌ ఉరుముతోంది. బుధవారం ఒక్కరోజే 32,855 కేసులు నమోదయ్యాయి. ఒక్క ముంబయి నగరంలోనే 5వేలకు పైగా కేసులు వెలుగుచూడటం గమనార్హం. గడిచిన 24 గంటల్లో 95 మంది మరణించడగా.. , 15,098 మంది కోలుకొన్నారు. మహారాష్ట్రలో ఇప్పటి వరకు 1.87కోట్ల నమూనాలు‌ పరీక్షించగా 25.64లక్షల మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వీరిలో 22.62లక్షల మంది కోలుకోగా.. 53,684 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 2.47లక్షల వేల యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని