కరోనా విలయం: ‘ప్రకృతి విపత్తు’గా పరిగణించండి!

కరోనా వైరస్‌ మహమ్మారి ధాటికి మహారాష్ట్ర వణికిపోతోంది. ఇలాంటి సమయంలో కరోనా విలయాన్ని ‘ప్రకృతి విపత్తు’గా పరిగణించాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Published : 15 Apr 2021 16:17 IST

కేంద్రానికి మహారాష్ట్ర సీఎం విజ్ఞప్తి

ముంబయి: కరోనా వైరస్‌ మహమ్మారి ధాటికి మహారాష్ట్ర వణికిపోతోంది. ఇలాంటి సమయంలో కరోనా విలయాన్ని ‘ప్రకృతి విపత్తు’గా పరిగణించాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీంతో కొవిడ్‌ బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి(ఎస్‌డీఆర్‌ఎఫ్‌)ని రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకునే వీలు కలుగుతుందన్నారు. ఇదే విషయంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.

‘ఇప్పటివరకు భారీ వర్షాలు, వరదలు, పిడుగుపాటు వంటి సంఘటనల వల్ల భారీ నష్టం వాటిల్లితేనే ప్రకృతి విపత్తుగా పరిగణిస్తున్నారు. తద్వారా బాధితులకు పరిహారం, ఆర్థిక సహాయాన్ని అందించే వీలుంది. కేంద్ర విపత్తు నిర్వహణ చట్టం ప్రకారమే రాష్ట్రానికి చెందిన అన్ని విపత్తు నిర్వహణ చట్టాలను రూపొందించారు. దీంతో కొవిడ్ విజృంభణ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిని ఆదుకోవడం ఇబ్బందిగా మారింది. ఇందుకు ఎస్‌డీఆర్‌ఎఫ్‌ నిధులను వినియోగించుకోవాలంటే కేంద్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి’ అని మహారాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారని పేర్కొన్నారు.

ఇదిలాఉంటే, మహారాష్ట్రలో కరోనా వైరస్‌ ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతోంది. నిన్న కొత్తగా 59వేల పాజిటివ్‌ కేసులు, 278 మరణాలు నమోదయ్యాయి. ఒక్క మహారాష్ట్రలోనే ఇప్పటివరకు కరోనాతో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 58వేలు దాటింది. దేశవ్యాప్తంగా లక్షా 73వేల మంది మృత్యువాతపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని