ఆ ఆరు రాష్ట్రాలు సున్నితమైనవి!

కరోనా వైరస్‌ ధాటికి మహారాష్ట్ర వణికిపోతోంది. ఈ నేపథ్యంలో వైరస్‌ ఉద్ధృతిని కట్టడి చేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారిని నియంత్రిస్తోంది. దీంతో ఆరు రాష్ట్రాలను ‘సెన్సిటివ్‌ ఆరిజిన్‌ (సున్నితమైన మూలాలు)’గా ప్రకటించిన మహారాష్ట్ర, అక్కడి నుంచి వచ్చే వారిపై ఆంక్షలు అమలు చేస్తోంది.

Updated : 22 Aug 2022 14:49 IST

ప్రకటించిన మహారాష్ట్ర ప్రభుత్వం

ముంబయి: కరోనా వైరస్‌ ధాటికి మహారాష్ట్ర వణికిపోతోంది. ఈ నేపథ్యంలో వైరస్‌ ఉద్ధృతిని కట్టడి చేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారిని నియంత్రిస్తోంది. దీంతో ఆరు రాష్ట్రాలను ‘సెన్సిటివ్‌ ఆరిజిన్‌ (సున్నితమైన మూలాలు)’గా ప్రకటించిన మహారాష్ట్ర, అక్కడి నుంచి వచ్చే వారిపై ఆంక్షలు అమలు చేస్తోంది.

దేశంలో కరోనా వైరస్‌ తీవ్రత అత్యంత ప్రమాదకరంగా ఉన్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర ముందుంది. నిత్యం అక్కడ 60వేలకు పైగా కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. దీంతో కేరళ, గోవా, గుజరాత్‌, దిల్లీ, రాజస్థాన్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాలను సున్నితమైన మూలాలు కలిగిన రాష్ట్రాలుగా ప్రకటించింది.  అక్కడి నుంచి మహారాష్ట్ర వచ్చేవారు తప్పనిసరిగా ఆర్‌టీపీసీఆర్‌ నెగటివ్‌ రిపోర్టుతో వస్తేనే అనుమతిస్తామని ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి సీతారాం కుంటే ప్రకటించారు. ఆయా రాష్ట్రాల నుంచి కొత్త రకం కరోనాను మహారాష్ట్రలోకి ప్రవేశించకుండా నిరోధించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు ఈ నిబంధనలు అమలులో ఉంటాయని పేర్కొన్నారు.

ఇదిలాఉంటే, దేశంలో పలు రాష్ట్రాలు కరోనా వైరస్‌ తీవ్రతకు అతలాకుతలం అవుతున్నాయి. మహారాష్ట్రలో నిత్యం 60వేల కేసులు నమోదవుతుండగా.. దిల్లీలో రోజువారీ కేసుల సంఖ్య 25వేలు దాటింది. ఇక ఉత్తర్‌ప్రదేశ్‌లో 30వేలు, కర్ణాటకలో 19వేలు, కేరళలో 18వేలు, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌లో 12వేల చొప్పున బయటపడుతున్నాయి. గుజరాత్‌, రాజస్థాన్‌, తమిళనాడు రాష్ట్రాల్లో నిత్యం 10వేలకు పైగా కొత్త కేసులు వస్తున్నాయి. దీంతో అప్రమత్తమైన మహారాష్ట్ర ప్రభుత్వం ఆరు రాష్ట్రాలను సున్నితమైన రాష్ట్రాలుగా ప్రకటించింది. ఇక దేశంలో నిన్న ఒక్కరోజే 2.73 లక్షల పాజిటివ్‌ కేసులు నమోదైన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని