అక్కడ మాస్క్‌ లేకపోతే.. రూ. 500 ఫైన్‌..!

దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్‌ విజృంభిస్తోంది. దీంతో కొన్ని రాష్ట్రాల్లో వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి ఆంక్షలు విధిస్తూ.. కఠిన చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలో కొవిడ్ ఉద్ధృతి అధికంగా ఉన్న రాష్ట్రాల్లో కరోనా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు గట్టిగానే హెచ్చరిస్తున్నారు...

Updated : 07 Jul 2021 14:32 IST

రాయ్‌పూర్: పెరుగుతున్న కరోనా కేసులను అరికట్టడానికి ఆంక్షలు విధిస్తూ పలు రాష్ట్రాలు చర్యలు చేపడుతున్నాయి. ఈ క్రమంలో కొవిడ్ ఉద్ధృతి అధికంగా ఉన్న రాష్ట్రాల్లో కరోనా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు గట్టిగానే హెచ్చరిస్తున్నారు. అయితే బహిరంగ ప్రదేశాల్లో ముఖానికి మాస్క్‌ ధరించని వారికి ఏకంగా రూ.500 జరిమానా విధించనున్నట్లు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. ఇప్పటివరకు రాష్ట్రంలో మాస్క్‌ ధరించనివారికి రూ.100 జరిమానా విధించేవారు. అయితే  కొవిడ్ మళ్లీ విజృంభిస్తుండటంతో బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు ఫేస్‌ మాస్క్‌ వాడటంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కఠిన చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

ఎపిడెమిక్‌ డిసీజ్‌ యాక్ట్‌ 1897 ప్రకారం.. ఈ జరిమానాను రూ.500 వరకు పెంచినట్లు  రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. దీంతో ప్రజలు బహిరంగ ప్రదేశాలలో తప్పనిసరిగా సామాజిక దూరం పాటించి, ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోవాలని సూచించింది. రాష్ట్రంలో ఒక్కసారిగా వైరస్‌ వ్యాప్తి పెరగడంతో కొన్ని జిల్లాల్లో 144 సెక్షన్‌ విధించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఛత్తీస్‌గఢ్‌, రాయ్‌పూర్‌, దర్గ్, బస్తర్‌, రాయ్‌ఘర్‌ జిల్లాల్లో పండగలు, వేడుకలు, సమావేశాల నిర్వహణలో ఆంక్షలు విధించినట్లు వివరించింది.

గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 2,419 కొత్త కేసులు నమోదు కాగా, గత నాలుగు నెలల్లో ఇదే అత్యధికమని అధికారులు ప్రకటించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,32,113కి చేరింది. ఇప్పటివరకు 3,14,769 మంది వైరస్‌ నుంచి కోలుకోగా, 4,026 మంది చనిపోయినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరోవైపు కరోనా తీవ్రత అధికంగా ఉన్న కర్ణాటకలో మాస్క్‌ లేకపోతే రూ. 250 ఫైన్‌ విధించనున్నట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. మహారాష్ట్రలో జరిమానా రూపంలో రూ. 4 కోట్లు వసూలు చేసినట్లు ఆ రాష్ట్ర అధికారులు ఇప్పటికే వెల్లడించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని