US: చేయని నేరానికి 43 ఏళ్లు జైల్లోనే.. విడుదల తర్వాత విరాళాల వెల్లువ

చేయని నేరానికి ఓ వ్యక్తి ఏకంగా 43 ఏళ్లు జైలు జీవితం గడిపాడు. దశాబ్దాలపాటు జైలు గోడల మధ్యే మగ్గిపోయాడు. చివరకు నిర్దోషి అని తేల్చి అతడికి స్వేచ్ఛ ప్రసాదించేనాటికి ఆయనకు 62 ఏళ్లు వచ్చేశాయి.....

Updated : 28 Nov 2021 23:34 IST

వాషింగ్టన్‌: చేయని నేరానికి ఓ వ్యక్తి ఏకంగా 43 ఏళ్లు జైలు జీవితం గడిపాడు. దశాబ్దాలపాటు జైలు గోడల మధ్యే మగ్గిపోయాడు. చివరకు నిర్దోషి అని తేల్చి అతడికి స్వేచ్ఛ ప్రసాదించేనాటికి ఆయనకు 62 ఏళ్లు వచ్చేశాయి. అగ్రరాజ్యానికి చెందిన కెవిన్​ స్ట్రిక్​లాండ్​ అనే వ్యక్తి దీన గాథ ఇది. అయితే కెవిన్‌ గురించి తెలుసుకున్న చాలా మంది ఆర్థిక సాయం అందించి ఆయనకు తోడుగా నిలుస్తున్నారు. ఇప్పటికే కోట్లాది రూపాయలు విరాళంగా జమయ్యాయి. 

అసలేం జరిగిందంటే.. 

1978 ఏప్రిల్​ 25న కన్సాస్​ నగరంలోని ఓ ఇంటిపై గుర్తుతెలియని నలుగురు దుండగులు దాడి చేశారు. లేరీ ఇన్​గ్రామ్​, జాన్​ వాకర్, షెర్రీ బ్లాక్​ అనే ముగ్గురిని కాల్చి చంపారు. ఈ ఘటన నుంచి తప్పించుకున్న సింథియా డగ్లస్​ అనే మహిళ కాల్పులు జరిపిన నలుగురిలో కెవిన్ స్ట్రిక్‌లాండ్‌ ఉన్నాడని భావించి అతని పేరును పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పోలీసులు కెవిన్​ను అరెస్ట్​ చేశారు. కోర్టు విచారణలో కూడా డగ్లస్​ ఇదే విషయాన్ని చెప్పింది. ఆమె సాక్ష్యాన్ని పరిగణించి కెవిన్​కు కోర్టు 50 ఏళ్ల జైలు శిక్ష ఖరారు చేసింది. అయితే డగ్లస్​ తాను పొరబడినట్లు ఆ తర్వాత  తెలుసుకుంది. కానీ ఇప్పుడు తాను తప్పు చేసినట్లు ఒప్పుకుంటే కోర్టు తనకు శిక్ష విధిస్తుందేమోనన్న భయంతో ఈ విషయం గురించి కొంతకాలం ఆమె ఎక్కడా చెప్పలేదు. 

అలా నిర్దోషిగా.. 

దశాబ్దాలు గడిచాక మళ్లీ ఈ ఏడాది ఆగస్టులో కెవిన్​ శిక్షను సవాల్​ చేస్తూ స్థానిక ప్రాసిక్యూటర్​ కోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు. ఈ కేసులో సాక్షిగా ఉన్న డగ్లస్​ మృతిచెందడంతో.. ఆమె కుటుంబసభ్యులు, స్నేహితులను కోర్టు విచారించింది. అయితే పోలీసులే కెవిన్​ను దోషి అని చెప్పమని తనను ఒత్తడి చేశారని డగ్లస్​ ఓ సందర్భంలో తమతో చెప్పినట్లు వారు కోర్టుకు తెలిపారు. చేసిన తప్పును సరిదిద్దుకునేందుకు డగ్లస్​ ప్రయత్నించిందని పేర్కొన్నారు. ఈ అంశాలను పరిగణించిన కోర్టు.. హత్యకు పాల్పడిన నిందితులు కూడా ఓ సందర్భంలో కెవిన్​తో తమకు ఎలాంటి సంబంధం లేదని వెల్లడించిన విషయాన్ని ప్రస్తావిస్తూ కెవిన్​ను నిర్దోషిగా ప్రకటించింది. 

రూ. 10.50కోట్ల విరాళాలు 

ఈనెల 23న కెవిన్​  జైలు నుంచి విడుదలయ్యాడు. తప్పుడు తీర్పు ఇచ్చినందుకు అందాల్సిన నష్టపరిహారం కూడా ఆయనకు అందలేదు. దీంతో బాధితుడికి సాయం చేసేందుకు ‘గో ఫండ్ ​మీ’ అనే సంస్థ ముందుకొచ్చింది. కెవిన్‌ గురించి తెలుసుకున్న ఎందరో ఆయన దీన గాథను చూసి చలించిపోతున్నారు. తమకు తోచినంత ఆర్థిక సాయం చేస్తున్నారు. గో ఫండ్‌ మీ సంస్థ ఇప్పటివరకు రూ. 10.50కోట్లు (1.5 మిలియన్లు) విరాళంగా సేకరించి కెవిన్​కు అందించింది.

Read latest National - International News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని