ట్రంప్‌ మరో కీలక నిర్ణయం!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చివరి రోజుల్లో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. చైనాకు చెందిన మరిన్ని యాప్‌లపై నిషేధం విధించారు. చైనా బిలియనీర్‌ జాక్‌ మాకు చెందిన యాంట్‌ గ్రూప్‌ ఆధ్వర్యంలోని అలీపే........

Updated : 06 Jan 2021 10:30 IST

వెళ్లే ముందు చైనాను ఇరుకున పెట్టే యత్నం

వాషింగ్టన్ ‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అధికారాన్ని వీడుతున్న చివరి రోజుల్లో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. చైనాకు చెందిన మరిన్ని యాప్‌లపై నిషేధం విధించారు. చైనా బిలియనీర్‌ జాక్‌ మా కు చెందిన యాంట్‌ గ్రూప్‌ ఆధ్వర్యంలోని అలీపే, టెన్సెంట్‌ గ్రూప్‌నకు చెందిన వీచాట్‌పే లావాదేవీ యాప్‌లు సహా మొత్తం ఎనిమిదింటి కార్యకలాపాల్ని నిలిపివేయాలని ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం కార్యనిర్వాహక ఉత్తర్వులపై ట్రంప్‌ సంతకం చేశారు. ఈ నిషేధం 45 రోజుల్లో అమల్లోకి రానుంది. అప్పటికి అధ్యక్ష పదవిని బైడెన్ అలంకరించనున్నారు.

వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని యాప్‌లు చైనాకు చేరవేస్తున్నాయని ట్రంప్‌ ఆరోపించారు. దీనివల్ల కీలక పదవుల్లో ఉన్న వ్యక్తుల సమాచారాన్ని సేకరించి చైనా ప్రభుత్వం దుర్వినియోగం చేసే ప్రమాదం ఉందని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే యాప్‌లపై నిషేధం విధించామని తెలిపారు. ట్రంప్‌ నిర్ణయంపై ఇటు కాబోయే అధ్యక్షుడు బైడెన్ బృందంగానీ, అటు అమెరికాలోని చైనా రాయబార కార్యాలయం గానీ స్పందించలేదు.

టెన్సెంట్‌ గ్రూప్‌నకు చెందిన వీచాట్‌ పే, క్యూక్యూవ్యాలెట్‌, టెన్సెంట్‌ క్యూక్యూ అనే యాప్‌లపైనా నిషేధం విధించారు. గతంలోనూ ట్రంప్‌ ఓసారి వీచాట్‌పేను నిషేధించారు. అప్పట్లో అమెరికాకు చెందిన ప్రముఖ కంపెనీలు యాపిల్‌, ఫోర్డ్‌ మోటార్‌, వాల్‌మార్ట్‌, వాల్ట్‌ డిస్నీ ట్రంప్‌ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. చైనాలో వ్యాపార నిర్వహణకు ఈ యాప్‌లు ఎంతో కీలకమని తెలిపారు. దీన్ని కోర్టులో సవాల్‌ చేయగా.. ట్రంప్‌ నిర్ణయాన్ని ధర్మాసనం కొట్టివేసింది. తాజా నిషేధాన్ని కూడా అమెరికా వ్యాపార సంస్థలు వ్యతిరేకించే అవకాశం ఉందని సమాచారం. క్యామ్‌స్కానర్‌, షేర్‌ఇట్‌, వీమేట్‌, డబ్ల్యూపీఎస్‌ ఆఫీస్ నిషేధిత జాబితాలో ఉన్నాయి.

ప్రముఖ వీడియో షేరింగ్‌ యాప్‌ టిక్‌టాక్ సహా చైనాలో ఆదరణ పొందిన సామాజిక మాధ్యమం వీచాట్‌పై ట్రంప్‌ ఆగస్టులోనే నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఈ నిషేధం ఇప్పటికీ అమల్లోకి రాలేదు. దీనిపై కోర్టులో ఇంకా వాదనలు కొనసాగుతున్నాయి.

ఇవీ చదవండి..

సారీ.. భారత్‌కు రాలేను

పోరాటానికి సన్నద్ధంగా ఉండండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని