గ్రామాల్లో కరోనా: ముకుతాడుకు అదొక్కటే మార్గం!

మహమ్మారి ఉద్ధృతికి ముకుతాడు వేసేందుకు వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వేగవంతంగా చేపట్టడం ఒక్కటే పరిష్కారమని ఎస్‌బీఐ పరిశోధన వెల్లడించింది.

Updated : 07 May 2021 21:35 IST

ఎస్‌బీఐ తాజా నివేదిక

దిల్లీ: దేశంలో వ్యాప్తంగా కరోనా ఉద్ధృతి పెరగడం, ముఖ్యంగా రోజువారీ కేసుల్లో సగం గ్రామీణ ప్రాంతాల్లోనే నమోదవకావడం ఆందోళన కలిగించే విషయమని ఇప్పటికే ఆరోగ్యరంగ నిపుణులు పేర్కొంటున్నారు. ఈ సమయంలో మహమ్మారి ఉద్ధృతికి ముకుతాడు వేసేందుకు వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వేగవంతం చేయడం ఒక్కటే పరిష్కారమని ఎస్‌బీఐ రీసెర్చ్‌ నివేదిక వెల్లడించింది. గత కొంత కాలంగా గ్రామీణ ప్రాంతాలకు వైరస్‌ వ్యాపించిన తీరును ఎస్‌బీఐ నిపుణుల బృందం తాజా నివేదికలో విశ్లేషించింది.

ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న మొత్తం కేసుల్లో దాదాపు 44శాతం భారత్‌లోనే ఉంటున్నాయి. ముఖ్యంగా సెకండ్‌ వేవ్‌ ప్రభావం గ్రామీణ ప్రాంతాలపై ఎక్కువగా చూపుతోంది. గత మార్చి నెలలో దేశవ్యాప్తంగా అధిక తీవ్రత ఉన్న 15జిల్లాల్లో (55శాతంగా) ఉండగా ప్రస్తుతం అది దేశవ్యాప్తంగా అన్ని జిల్లాలకూ పాకింది. మార్చి నెలలో గ్రామీణ జిల్లాల్లో 36శాతంగా ఉన్న కేసులు, మే నెల వచ్చేసరికి 48శాతానికి పెరగడం ఆందోళన కలిగించే విషయమని ఎస్‌బీఐ గ్రూప్‌ ముఖ్య ఆర్థిక సలహాదారు సౌమ్యకాంతి ఘోష్‌ వెల్లడించారు. ఈ సమయంలో వైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రస్తుతం వ్యాక్సినేషన్‌ వేగం పెంచడం ఒక్కటే మార్గమని అభిప్రాయపడ్డారు. ఇది కూడా ఓ భారీ మిషన్‌ మాదిరిగా చేపడితేనే ఎక్కువ మందికి చేరే అవకాశం ఉంటుందని అన్నారు.

గ్రామాలకు పాకిన వైరస్‌..

జిల్లాల వారీగా పరిశీలిస్తే వైరస్‌ వ్యాప్తి ఎలా ఉందో స్పష్టంగా తెలుస్తుందని ఎస్‌బీఐ నివేదిక పేర్కొంది. మార్చి నెలలో మహారాష్ట్రలో కేవలం 11 నుంచి 15 గ్రామీణ ప్రాంత జిల్లాల్లోనే ఉద్ధృతి ఎక్కువగా ఉంది. కానీ, ప్రస్తుతం అక్కడ ఈ సంఖ్య 6కు తగ్గింది. కానీ, ఇతర రాష్ట్రాల్లో వీటి ప్రభావం ఎక్కువైంది. ఆంధ్రప్రదేశ్‌లో 5, కేరళలో 2, కర్ణాటక, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో ఒక్కో జిల్లా చొప్పున వైరస్‌ విలయాన్ని ఎదుర్కొంటున్నాయని తాజా నివేదిక తెలిపింది. ఇలా దాదాపు చాలా రాష్ట్రాల్లో గ్రామీణ ప్రాంతాల్లో వైరస్‌ విస్తృతి పెరిగిందని పేర్కొంది.

వైరస్‌ తీవ్రత పెరుగుతున్నప్పటికీ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ అంత సంతృప్తికరంగా లేదని ఎస్‌బీఐ నివేదిక పేర్కొంది. ఇప్పటివరకు కేవలం 16కోట్ల డోసులను అందించగా వీటిలో 13కోట్లు తొలిడోసు, 3కోట్ల మంది రెండు డోసులు తీసుకున్నారు. ఏప్రిల్‌ నెలతో (రోజుకు 28 లక్షల డోసులు) పోలిస్తే రోజువారీ వ్యాక్సిన్‌ తీసుకునే వారి సంఖ్య ప్రస్తుతం (17లక్షలు) భారీగా తగ్గింది. ఇక ప్రస్తుతం దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌/కర్ఫ్యూ ఆంక్షలు కొనసాగుతున్నాయి. దీంతో ఆర్థిక ఒడిదొడుకులు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయని ఎస్‌బీఐ రీసెర్చ్‌ నివేదిక వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని