Fahadh Faasil: ‘పుష్ప’ తర్వాత ఎలాంటి మార్పు రాలేదు: ఫహాద్‌ ఫాజిల్‌

‘పుష్ప’ తర్వాత తన కెరీర్‌లో ఎలాంటి మార్పు రాలేదని నటుడు ఫహాద్‌ ఫాజిల్‌ అన్నారు. 

Published : 07 May 2024 17:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సుకుమార్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కిన ‘పుష్ప’(Pushpa) ప్రపంచస్థాయిలో రికార్డులు సొంతం చేసుకుంది. ఇందులో ఎస్పీ భన్వర్‌సింగ్ షెకావత్‌గా ఫహాద్‌ ఫాజిల్‌ తన నటనతో ఆకట్టుకున్నారు. తాజాగా ఆయన ఈ సినిమాపై చేసిన కామెంట్స్‌ వైరలవుతున్నాయి.

‘పుష్ప’ తర్వాత మీకు పాన్‌ ఇండియా స్థాయిలో గుర్తింపు వచ్చిందా? అని అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ.. ‘‘పుష్ప’ తర్వాత నాలో, నా కెరీర్‌లో ఎలాంటి మార్పు రాలేదు. ఇందులో దాచుకోవాల్సిన విషయమేం లేదు. ఇదే సంగతి నేను సుకుమార్‌కు కూడా చెప్పాను. ఎవరినీ కించపరచడం నా ఉద్దేశం కాదు. ఆ చిత్రం తర్వాత నేనేదో మ్యాజిక్‌ చేస్తానని ప్రేక్షకులు అనుకోవడం లేదు. ఇప్పుడు మలయాళం తెలియని ప్రేక్షకులు కూడా మలయాళం చిత్రాలు చూస్తున్నారు. అది నాలో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. నా మనసంతా మలయాళ చిత్రాలపైనే ఉంటుంది. ‘పుష్ప’ను సుకుమార్‌ మీద ఉన్న అభిమానంతో చేశాను’’ అని చెప్పారు. ప్రస్తుతం ఆయన ‘పుష్ప2’ (Pushpa2)లో నటిస్తున్నారు. మొదటిభాగంతో పోలిస్తే రెండో పార్ట్‌లో ఆయన పాత్ర నిడివి ఎక్కువగా ఉండనుంది.  హీరోకు, ఆ పాత్రకు మధ్య చాలా యాక్షన్‌ సన్నివేశాలు ఉండనున్నాయి. ఇప్పటికే ఆయనకు సంబంధించిన చిత్రీకరణ కూడా పూర్తయినట్లు సమాచారం. భారీ అంచనాల మధ్య ఈ సీక్వెల్‌ ఆగస్టు 15న విడుదలకు సిద్ధమైంది.

మరోవైపు ఫహాద్‌ ఫాజిల్‌ ప్రధాన పాత్రలో నటించిన ‘ఆవేశం’ విజయాన్ని అందుకుంది. ఈ ఏడాది మలయాళంలో భారీ కలెక్షన్లు సాధించిన సినిమాల వరుసలో చేరింది. రూ.30 కోట్లతో తెరకెక్కించిన ఈ చిత్రం ఇప్పటివరకు రూ.150కోట్లు వసూలు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు