సంక్షిప్త వార్తలు(5)

శివ రాజ్‌కుమార్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘వేద’. ఘనవి లక్ష్మణ్‌ ముఖ్యభూమిక పోషించారు. హర్ష దర్శకత్వం వహించారు.

Published : 30 Jan 2023 01:19 IST

యాక్షన్‌ ‘వేద’

శివ రాజ్‌కుమార్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘వేద’. ఘనవి లక్ష్మణ్‌ ముఖ్యభూమిక పోషించారు. హర్ష దర్శకత్వం వహించారు. గీతా శివ రాజ్‌కుమార్‌ నిర్మాత. కన్నడంలో విడుదలైన ఈ చిత్రాన్ని త్వరలోనే కంచి కామాక్షి కలకత్తా క్రియేషన్స్‌ పతాకంపై తెలుగులో విడుదల చేయనున్నారు. అందులో భాగంగా ఇటీవలే మోషన్‌ పోస్టర్‌ని విడుదల చేశారు. చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న నిర్మాత వి.ఆర్‌.కృష్ణ మండపాటి మాట్లాడుతూ ‘‘యాక్షన్‌ డ్రామాతో రూపొందిన చిత్రమిది. కన్నడంలో డిసెంబరులోనే విడుదలైన ‘వేద’ మంచి విజయాన్ని అందుకుంది. తెలుగు ప్రేక్షకుల్నీ తప్పకుండా అలరిస్తుంది. త్వరలోనే విడుదలకి ముందస్తు వేడుకని నిర్వహిస్తాం’’ అన్నారు. అదితి సాగర్‌, శ్వేత చంగప్ప, ఉమాశ్రీ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. కూర్పు: దీపు ఎస్‌.కుమార్‌, సంగీతం: అర్జున్‌ జన్య, ఛాయాగ్రహణం: స్వామి జె.గౌడ్‌.


సరికొత్త సస్పెన్స్‌ థ్రిల్లర్‌..

రవింద్‌ కృష్ణ, రజత్‌ రాఘవ్‌, నటాషాదోషి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘యస్‌.ఐ.టి’. స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌.. అన్నది ఉపశీర్షిక. వీబీఆర్‌ తెరకెక్కించారు. ఎస్‌.నాగిరెడ్డి, తేజ్‌ పల్లి, గుంటక శ్రీనివాస్‌రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను ఇటీవల విడుదల చేశారు. ‘‘సరికొత్త సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ఇది. స్క్రీన్‌ప్లే ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణాంతర పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అన్నారు. సంగీతం: వరికుప్పల యాదగిరి, ఛాయాగ్రహణం: జగదీష్‌ బొమ్మిశెట్టి.


‘దహనం’.. అరుదైన చిత్రం

దిత్య ఓం కథానాయకుడిగా ఆడారి మూర్తి సాయి తెరకెక్కించిన చిత్రం ‘దహనం’. పి.సతీష్‌ కుమార్‌ నిర్మించారు. మార్చి రెండో వారంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాలోని ‘‘గరళం తాగినోడు గంగమ్మ మొగుడు’’ అనే గీతాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో ఆదిత్య ఓం మాట్లాడుతూ.. ‘‘ఇలాంటి సినిమా చాలా అరుదుగా వస్తుంది. నా కెరీర్‌లో మైలురాయి లాంటిదిది. ఇందులో మంచి సందేశముంది’’ అన్నారు. ‘‘నాలుగు దశాబ్దాల క్రితం జరిగిన కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కించాం’’ అన్నారు మూర్తి సాయి. సతీష్‌ కుమార్‌ మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్రానికి క్లైమాక్స్‌ ప్రాణం. చివరి 20 నిమిషాలు కథ ఊహించని మలుపులు తిరుగుతుంది’’ అన్నారు. కార్యక్రమంలో ఆళ్ల తరుణ్‌ కుమార్‌, శాంతిచంద్ర, రాజీవ్‌, సోనీరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


ఆద్యంతం నవ్విస్తూ..

చేతన్‌ మద్దినేని హీరోగా నటిస్తూ.. స్వీయ నిర్మాణంలో ఓ చిత్రం రూపొందిస్తున్నారు. గోపి మోహన్‌ దర్శకుడు. ఈ సినిమా ఇటీవలే ఓ కీలక షెడ్యూల్‌ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా హీరో, నిర్మాత చేతన్‌ మాట్లాడుతూ.. ‘‘ఇదొక విభిన్నమైన రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌. ఓవైపు నవ్విస్తూనే.. ఆద్యంతం థ్రిల్‌కి గురి చేస్తుంది. కథ బాగా నచ్చడంతో నేనే నిర్మాతగా మారా. ఇప్పటికే 50శాతం చిత్రీకరణ పూర్తయింది. పోలెండ్‌లో కీలక సన్నివేశాలు తెరకెక్కించాం. త్వరలో మరిన్ని వివరాలు ప్రకటిస్తాం. దీంతో పాటు ప్రస్తుతం నేను ‘జేమ్స్‌బాండ్‌’ ఫేమ్‌ సాయికిషోర్‌ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నా. త్వరలో దాని టైటిల్‌ ప్రకటిస్తాం’’ అన్నారు.


చెడ్డి గ్యాంగ్‌ వచ్చేస్తోంది

వెంకట్‌ కల్యాణ్‌ హీరోగా నటిస్తూ.. స్వయంగా తెరకెక్కించిన చిత్రం ‘చెడ్డి గ్యాంగ్‌ తమాషా’. సిహెచ్‌ క్రాంతికిరణ్‌ నిర్మించారు. గాయత్రి పటేల్‌ కథానాయిక. ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో ఉన్న ఈ సినిమా ఫిబ్రవరి రెండో వారంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్మాత క్రాంతి మాట్లాడుతూ.. ‘‘టైటిల్‌కు తగ్గట్లుగానే ఆద్యంతం వినోదాత్మకంగా సాగే చిత్రమిది. ఇప్పటికే విడుదలైన టీజర్‌, ట్రైలర్‌తో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. బిజినెస్‌ పరంగానూ సంతోషంగా ఉన్నాం’’ అన్నారు. సంగీతం: అర్జున్‌, ఛాయాగ్రహణం: జి.కె.యాదవ్‌ బంక.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని