రిటైర్మెంటా..?ఆ మాట అనలేదు: నీతీశ్ 

‘ఇవే నా చివరి ఎన్నికలు’ అంటూ బిహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో చివరి రోజున జేడీయూ అధినేత, ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్ ఉద్వేగంతో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

Updated : 13 Nov 2020 12:59 IST

దిల్లీ: ‘ఇవే నా చివరి ఎన్నికలు’ అంటూ బిహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో చివరి రోజున జేడీయూ అధినేత, ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్ ఉద్వేగంతో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే, తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని, ఇప్పట్లో రిటైర్ అయ్యే ఉద్దేశం లేదని తాజాగా నీతీశ్‌ స్పష్టం చేశారు. ‘నేను రిటైర్మెంట్ గురించి మాట్లాడలేదు. అన్నీ బాగా ముగుస్తాయంటూ నేను ప్రతి ఎన్నికల చివరి ర్యాలీలో ఇదే మాట చెబుతాను. మరోసారి మీరు నా ప్రసంగాన్ని వింటే మీకు ఈ విషయం స్పష్టమవుతుంది’ అని వెల్లడించినట్లు ఓ వార్త సంస్థ వెల్లడించింది. 

అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పూర్నియాలో పాల్గొన్న ర్యాలీలో నీతీశ్‌ మాట్లాడుతూ..‘ఎన్నికల ప్రచారానికి ఇది చివరి రోజు. ఎల్లుండి చివరి దశ ఓటింగ్ జరగనుంది. ఇవే నా చివరి ఎన్నికలు. అన్నీ బాగా ముగుస్తాయి’ అంటూ మద్దతుదారులను ఉద్దేశించి ఉద్వేగంగా మాట్లాడారు. అయితే, అదో రాజకీయ జిమ్మిక్కంటూ విపక్షాలు విమర్శలు చేశాయి. కాగా, ఆ రాష్ట్రంలో తాజాగా జరిగిన ఎన్నికల్లో అధికార ఎన్డీఏ కూటమి విజయం సాధించి.. మహాకూటమి ఆశలపై నీళ్లు చల్లింది. కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వీ యాదవ్‌ను అధికారానికి దూరం చేసింది. దాంతో వరసగా నాలుగోసారి నీతీశ్‌ కుమార్‌ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించనున్నారు. ఈ నెల 16న ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనున్నట్లు తెలుస్తోంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని