Rahul Gandhi: కూటమి విజయం సాధిస్తే.. రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి తొలగిస్తాం: రాహుల్‌ గాంధీ

సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి విజయం సాధిస్తే.. రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి తొలగిస్తామని రాహుల్‌ గాంధీ ప్రకటించారు.

Published : 05 Feb 2024 19:29 IST

రాంచీ: రిజర్వేషన్లపై కాంగ్రెస్‌ (Congress) అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) కీలక ప్రకటన చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో ‘ఇండియా’ (INDIA) కూటమి విజయం సాధిస్తే.. రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని తొలగిస్తామని చెప్పారు. దాంతోపాటు దేశవ్యాప్తంగా కులగణన చేపడతామని తెలిపారు. భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర (Bharat Jodo Nyay Yatra)లో భాగంగా ఝార్ఖండ్‌ (Jharkhand)లో ఆయన ఈ ప్రకటన చేశారు. ఈసందర్భంగా సైకిల్‌పై బొగ్గు తీసుకెళుతున్న యువతతో కాసేపు ముచ్చటించారు. 

‘‘ఆదివాసీలకు, దళితులకు కల్పించే రిజర్వేషన్లలో ఎలాంటి మార్పు ఉండదు. దేశంలో వెనకబడిన కులాల వారు తప్పకుండా తమ హక్కులు పొందుతారు. కార్పొరేట్‌ సంస్థలు, ఆసుపత్రులు, పాఠశాలల్లో వారి భాగస్వామ్యాన్ని తగ్గించి, కార్మికులుగా మార్చారు. ఇది సామాజిక, ఆర్థికపరమైన సమస్య. ‘ఇండియా’ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి ఎత్తివేయడంతోపాటు, దేశవ్యాప్తంగా కులగణన చేపడతాం. ఎన్నికల సమయంలో మాత్రమే మోదీకి ఓబీసీ అనే విషయం గుర్తొస్తుంది. కులగణన కోరిన ప్రతిసారీ దేశంలో ఉన్నది ధనిక, పేద అనే రెండు కులాలు మాత్రమేనని చెబుతారు’’ అని రాహుల్‌ ఆరోపించారు.

ఎట్టకేలకు వీడిన అనిశ్చితి.. బలపరీక్షలో నెగ్గిన చంపయీ ప్రభుత్వం

ఝార్ఖండ్‌ అసెంబ్లీలో చంపయీ సోరెన్‌ బలపరీక్షలో విజయం సాధించడంపై ఆయన హర్షం వ్యక్తంచేశారు. ‘‘కాంగ్రెస్‌-జేఎమ్‌ఎమ్‌లు కలిసికట్టుగా ప్రభుత్వాన్ని కాపాడుకున్నాయి. కేంద్రంలోని భాజపా ప్రభుత్వం ప్రజాస్వామ్యంపై దాడులు చేస్తోంది. ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ధనం, దర్యాప్తు సంస్థల అండతో ప్రభుత్వాలను కూల్చేయాలనుకుంటుంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే ఇండియా కూటమి ఏర్పడింది’’ అని రాహుల్‌ గాంధీ తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని