Amit Shah: మళ్లీ మోదీదే అధికారం.. దేశ ప్రజలకు అనుమానమే లేదు: షా

Amit Shah: దిల్లీలోని భారత మండపంలో జరుగుతున్న భాజపా జాతీయ మండలి సమావేశాల్లో అమిత్‌ షా మాట్లాడారు. ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

Published : 18 Feb 2024 13:19 IST

దిల్లీ: ప్రధాన మంత్రి మోదీ (Narendra Modi) మరోసారి అధికారాన్ని నిలబెట్టుకుంటారనే అంశంలో దేశ ప్రజలకు ఎలాంటి అనుమానం లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) అన్నారు. దేశంలో ఉగ్రవాదం, నక్సలిజం అంత్య దశకు చేరుకున్నాయని.. వచ్చే మోదీ 3.0 ప్రభుత్వంలో అవి పూర్తిగా తుడిచిపెట్టుకుపోతాయని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే లోక్‌సభ ఎన్నికలను మహాభారత యుద్ధంతో పోల్చిన ఆయన.. మోదీ ఒకవైపు.. కుటుంబ పార్టీలకు నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్‌ మరోవైపు ఉన్నాయని వ్యాఖ్యానించారు. దిల్లీలోని భారత మండపంలో జరుగుతున్న భాజపా (BJP) జాతీయ మండలి సమావేశాల్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

మోదీ (Narendra Modi) పేద ప్రజలు, దేశ అభివృద్ధి కోసం ఆలోచిస్తారని షా అన్నారు. మరోవైపు ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’ కూటమి నేతలు తమ వారసులను ముఖ్యమంత్రి, ప్రధానమంత్రిని చేయడంలో నిమగ్నమయ్యారని విమర్శించారు. భాజపాలోనూ ఇదే తరహా విధానం ఉండి ఉంటే ఒక చాయ్‌వాలా కుమారుడు ప్రధాని అయ్యేవాడు కాదని అన్నారు. మోదీని ఓడించేందుకు రాకుమారులంతా ఏకమయ్యారని పరోక్షంగా ప్రతిపక్ష కూటమి పార్టీ నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. బుజ్జగింపు రాజకీయాల వల్లే రామమందిర ప్రాణప్రతిష్ఠ ఆహ్వానాన్ని కాంగ్రెస్‌ నిరాకరించిందని ధ్వజమెత్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని