Team India: లోడ్.. ఎయిమ్.. షూట్... ప్రపంచకప్ ముంగిట సమసిపోతున్న భారత్‌ సమస్యలు

బెంచ్‌ స్ట్రెంగ్త్‌... ఏ జట్టుకైనా ఇది చాలా అవసరం. ఒకరు అందుబాటులో లేకపోతే ఇంకొకరు అనేలా ఉండాలి. ప్రపంచ కప్‌ (Odi world cup 2023) ముందు భారత్‌ (Team India)కు ఇప్పుడు అలాంటి బెంచ్‌ స్ట్రెంగ్త్‌ దొరికింది. దీంతో టీమ్‌ ఇండియాలో ఇన్నాళ్లు ఉన్న సమస్యలు పోతున్నాయ్‌.  

Published : 26 Sep 2023 12:09 IST

వన్డే ప్రపంచకప్ (ODI World Cup 2023) తరుముకొస్తుండగా.. వేరే జట్లు ఓవైపు పూర్తి సన్నద్ధతతో కనిపిస్తుంటే.. టీమ్ఇండియా (Team India) మాత్రం ప్రపంచకప్ జట్టును ఖరారు చేయలేక.. ఆటగాళ్ల ఫిట్‌నెస్, ఫామ్ విషయంలో కంగారు పడుతూ.. ఎవరిని ఎక్కడ ఆడించాలో తెలియక అయోమయ స్థితిలో కనిపించింది కొన్ని వారాల ముందు వరకు. కానీ కప్పు సమీపిస్తున్న కొద్దీ ఒక్కో సమస్య పరిష్కారమైపోతోంది. ఈ మెగా టోర్నీ మొదలయ్యే సమయానికి టీమ్‌ఇండియా హాట్ ఫేవరెట్‌గా మారడం ఖాయంగా కనిపిస్తోంది.

కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్‌ల ఫిట్‌నెస్, ఫామ్ మీద సందేహాలు.. వాళ్లిద్దరినీ ప్రపంచకప్‌కు ఎంపిక చేయాలో వద్దో తెలియదు.. వీళ్లు అందుబాటులో లేకుంటే ప్రత్యామ్నాయాలేంటో తెలియదు.. ఫినిషర్‌గా ఉపయోగపడతాడనుకున్నా సూర్యకుమార్ వన్డేల్లో సత్తా చాటలేక ఇబ్బంది పడుతున్నాడు. మరోవైపు బుమ్రా ఫిట్‌నెస్ మీదా అనుమానాలే. బుమ్రా అందుబాటులోకి వచ్చినా.. జట్టులో మూడో పేసర్‌గా ఎవరిని ఎంచుకోవాలో తెలియని గందరగోళం.. ఇలా ఒక నెల కిందట టీమ్‌ఇండియాకు ఎన్నో తలనొప్పులు. సొంతగడ్డపై జరిగే ప్రపంచకప్‌లో విజేతగా నిలుస్తుందని అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకుంటే.. అంతర్గత సమస్యలతో సతమతమవుతూ కనిపించింది భారత్. కానీ ఈ నెల రోజుల్లో ఒక్కొక్కటిగా సమస్యలు పరిష్కారం అయిపోవడం జట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతోంది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో ‘లోడ్.. ఎయిమ్.. షూట్’ డైలాగ్‌ తరహాలో ఒక్కో సమస్యను లక్ష్యంగా చేసుకుని పరిష్కరించుకుంటూ ముందుకు సాగుతోంది టీమ్‌ఇండియా.

భరోసానిచ్చిన బుమ్రా..

రెండేళ్ల ముందు ప్రపంచంలోనే అత్యుత్తమ పేస్ దళంగా పేరు తెచ్చుకుంది భారత ఫాస్ట్‌బౌలింగ్ విభాగం. కానీ ప్రధాన పేసర్ బుమ్రా గాయపడి జట్టుకు దూరం కావడంతో మన పేస్ విభాగం ఒక్కసారిగా బలహీన పడింది. పేస్ దళపతి అందుబాటులో లేకపోయేసరికి మిగతా బౌలర్లూ జావగారి పోయారు. గత ఏడాది టీ20 ప్రపంచకప్‌కు భరోసానిచ్చే బౌలర్లు లేక చాన్నాళ్లుగా టీ20 జట్టులో లేని షమి, భువనేశ్వర్‌లను నమ్ముకోవాల్సి వచ్చింది. వెన్ను గాయంతో సుదీర్ఘ కాలం ఆటకు దూరమైన బుమ్రా.. ఈ ఏడాది వన్డే ప్రపంచకప్‌నకు అయినా అందుబాటులో ఉంటాడా లేదా అని అభిమానులు కంగారు పడ్డారు. ఐతే అతను గత నెలలో ఫిట్‌నెస్ సాధించి ఐర్లాండ్ పర్యటనకు కెప్టెన్‌గా వెళ్లాడు. అక్కడ ఫిట్‌నెస్, ఫామ్ చాటుకుని జట్టుకు కొండంత భరోసానిచ్చాడు. 

ఆసియాకప్‌లోనూ అతను నిలకడగా బౌలింగ్ చేశాడు. అతడి భాగస్వామ్యంలో సిరాజ్ సైతం ఉత్తమ ప్రదర్శన చేశాడు. ఆసియా కప్‌ ఫైనల్లో అతనెంతగా రెచ్చిపోయాడో తెలిసిందే. ఐతే వీళ్లిద్దరికీ తోడుగా మూడో పేసర్ ఎవరిని దించాలా అన్న ప్రశ్న తలెత్తింది. కొన్ని మ్యాచ్‌ల్లో శార్దూల్ ఠాకూర్‌ను ఆడిస్తే అతను నిరాశపరిచాడు. మధ్యలో షమికి అవకాశం వచ్చినా ఉపయోగించుకోలేదు. ఆసియా కప్‌లో ఈ ప్రశ్నకు జవాబు దొరకలేదు. కానీ ఆస్ట్రేలియాతో ఇటీవలే మొదలైన వన్డే సిరీస్‌లో సమాధానం దొరికేసింది. మొహాలిలో రెచ్చిపోయి బౌలింగ్ చేసిన షమి.. 5 వికెట్లతో అదరగొట్టాడు. దీంతో అతనే మూడో పేసర్‌గా ఖరారైపోయాడు. దీంతో భారత పేస్ విభాగం పటిష్టంగా తయారైంది.

ఒక్కొక్కరుగా గాడిలోకి..

బ్యాటింగ్‌లో కూడా టీమ్‌ఇండియా సమస్యలు గత కొన్ని రోజుల్లోనే ఒక్కొక్కటిగా పరిష్కారం అయిపోయాయి. ఫిట్‌నెస్ సాధించేశాడు అనుకున్నాక కూడా ఇంకేదో చిన్న గాయమై తనపై సందేహాలు రేకెత్తించిన కేఎల్ రాహుల్.. ఆసియా కప్‌లో సూపర్-4 దశ నుంచి అందుబాటులోకి రావడమే కాదు.. తొలి మ్యాచ్‌లోనే చక్కటి ప్రదర్శన చేశాడు. కీలకమైన పాకిస్థాన్‌ మ్యాచ్‌లో అజేయ శతకంతో తన పునరాగమనాన్ని ఘనంగా చాటిన అతను.. ఆస్ట్రేలియాతో తొలి రెండు వన్డేల్లో అర్ధశతకాలు సాధించాడు. ఈ మ్యాచ్‌ల్లో అతను కెప్టెన్‌గా కూడా తనదైన ముద్ర వేశాడు. వికెట్ కీపింగ్ కూడా చేస్తూ ఫిట్‌నెస్ పరంగా తనకు ఏ ఇబ్బందులూ లేవని చాటాడు. 

రాహుల్ లాగే గాయంతో సుదీర్ఘ కాలం జట్టుకు దూరమై.. ఆసియా కప్‌లో పునరాగమనం చేశాక కూడా మళ్లీ ఫిట్‌నెస్ సమస్యలు ఎదుర్కొన్న శ్రేయస్ సైతం.. ఇప్పుడు గాడిన పడ్డాడు. ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో అనవసరంగా రనౌటైన అతను.. రెండో వన్డేలో అద్భుత శతకం బాది తనపై నెలకొన్న సందేహాలన్నీ పటాపంచలు చేశాడు. ఇదే మ్యాచ్‌లో సూర్యకుమార్ కూడా అదరగొట్టాడు. టీ20 మెరుపులు వన్డేల్లో కొనసాగించలేకపోతున్నాడని విమర్శలు ఎదుర్కొన్న అతను.. ఇందౌర్‌లో తన మార్కు చూపించాడు. తొలి వన్డేలోనూ అతను అర్ధశతకం సాధించి ప్రపంచకప్‌లో ఫినిషర్ పాత్రకు తనే సరైన వాడినని చాటాడు. ఇలా బ్యాటింగ్ పరంగా కూడా భారత్‌కు తలనొప్పి తీరిపోయింది.

అనుకోకుండా అశ్విన్..

ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో భారత్‌కు హుషారు తెప్పించిన మరో విషయం.. అశ్విన్ అంచనాలను మించి రాణించడం. అసలు కొన్ని రోజుల ముందు వరకు ప్రపంచకప్ ప్రణాళికల్లో అశ్విన్ లేనే లేడు. అతణ్ని సెలక్టర్లు పరిగణనలోకే తీసుకోలేదు. ఏడాదిన్నరగా అశ్విన్ అసలు వన్డేలే ఆడలేదు. కానీ ఆసియా కప్‌లో అక్షర్ పటేల్ గాయపడటంతో ప్రత్యామ్నాయ ఆటగాడిగా అశ్విన్‌ను ఎంచుకున్నారు. ఆస్ట్రేలియాపై అతణ్ని ఆడిస్తే.. తొలి వన్డేలో పొదుపుగా బౌలింగ్ చేసి ఒక వికెట్ తీశాడు. రెండో వన్డేలో విజృంభించిన అతను మూడు వికెట్లతో ఆసీస్ పతనాన్ని శాసించాడు. దీంతో ప్రపంచకప్‌కు అశ్విన్‌ను ఎంపిక చేయాలన్న డిమాండ్లు పెరిగిపోయాయి. 

అక్షర్ కంటే అశ్విన్ మెరుగైన స్పిన్నర్ అని.. జడేజా, కుల్‌దీప్, అక్షర్ ముగ్గురూ ఎడమ చేతి వాటం స్పిన్నర్లే కాబట్టి.. ఫిట్‌నెస్ సమస్యలతో ఇబ్బంది పడుతున్న అక్షర్‌ను తప్పించి అశ్విన్‌ను ఎంచుకుంటే బౌలింగ్‌లో వైవిధ్యం కూడా వస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతానికి శార్దూల్ ఠాకూర్ ఒక్కడే జట్టుకు కొంచెం భారంగా కనిపిస్తున్నాడు. అతను వికెట్లు తీయట్లేదు. ధారాళంగా పరుగులూ ఇచ్చేస్తున్నాడు. తన బదులు ఆసీస్‌తో రెండో వన్డేలో ఆకట్టుకున్న ప్రసిద్ధ్ కృష్ణను ఎంచుకోవడం మంచిదనే చర్చ జరుగుతోంది.

- ఈనాడు క్రీడా విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు