IPL Auction: అందరి చూపులూ ఆమె వైపే..!

ఐపీఎల్‌ మినీవేలం సందర్భంగా కావ్య మారన్‌ మరోసారి సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్‌ అవుతున్నారు.  ఇంతకీ  ఆమె ఎవరు? ఎందుకంత క్రేజ్‌?

Published : 24 Dec 2022 01:17 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఐపీఎల్‌ వేలం (IPL Auction) ప్రారంభమైందంటే చాలు.. అందరి దృష్టి ఆమె పైనే. ఎంతో చలాకీగా ఉంటూ.. జట్టు సభ్యులను ఎంపిక చేసుకోవడంలో మేనేజ్‌మెంట్‌ సలహాలు తీసుకుంటూ వేలం జరుగుతున్నంత సేపూ చాలా హడావుడిగా ఉంటారు. ఆమే.. కావ్య మారన్‌ (Kavya Maran). ఈసారి కోచిలో జరిగిన ఐపీఎల్‌ మినీ వేలంలోనూ ఆమె పాల్గొన్నారు. ఇంగ్లాండ్‌ ఆటగాడు హ్యరీ బ్రూక్‌ (Harry Brook)ను 13.25 కోట్లకు దక్కించుకున్నారు. దేశీయ ఆటగాడు మయాంక్‌ అగర్వాల్‌ను (Mayank Agarwal) రూ.8.25 కోట్లకు కొనుగోలు చేశారు. తాజా ఐపీఎల్‌ వేలంతో మరోసారి ఆమె పేరు సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్‌ అవుతోంది. ఇంతకీ కావ్య మారన్‌ ఎవరు? ఆమెకు అంత క్రేజ్‌ ఎందుకు?

ఏకైక వారసురాలు

సన్‌నెట్‌వర్క్‌ అధినేత కళానిధి మారన్‌ (Kalanidhi Maran), కావేరీ మారన్‌ దంపతుల ముద్దుల తనయే కావ్య మారన్‌. 1992 ఆగస్టు 6న చెన్నైలో జన్మించారు. అందరూ ముద్దుగా కావ్య అని పిలుచుకుంటారు. బిజినెస్‌పై ఆసక్తితో ఎంబీఏ చేశారు. ఏవియేషన్‌, మీడియా అంటే ఆమెకు చాలా ఇష్టం. ప్రస్తుతం సన్‌నెట్‌వర్క్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. కళానిధి మారన్‌ 1990లో చిన్న మ్యాగజైన్‌తో తన వ్యాపారాన్ని ప్రారంభించి అంచెలంచలుగా ఎదిగారు. తాజాగా రజనీకాంత్‌ హీరోగా నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ‘జైలర్‌’ చిత్రానికి కళానిధి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

రాజకీయంగానూ పలుకుబడి

కావ్య మారన్‌ కుటుంబానికి కేవలం బిజినెస్‌ మాత్రమే కాకుండా రాజకీయంగానూ మంచి పలుకుబడి ఉంది. కావ్య వాళ్ల తాత మురసోలి మారన్‌ డీఎంకే పార్టీ నుంచి కేంద్ర మంత్రిగా పని చేశారు. బాబాయ్‌ దయానిది మారన్‌ గతంలో లోక్‌సభ ఎంపీగా ఎన్నికయ్యారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి.. కావ్య వాళ్ల తాతయ్యకు స్వయానా మామయ్య. సన్‌ గ్రూప్‌లో జెమినీతోపాటు అనేక భాషల్లో చాలా ఛానళ్లు ఉన్నాయి. సన్‌డైరెక్ట్‌ డీటీహెచ్‌ కూడా ఈ గ్రూప్‌నకు చెందిందే. రెడ్‌ ఎఫ్‌ఎంతోపాటు ఇండియా మొత్తం..70 రేడియో స్టేషన్లు ఉన్నాయి.

విలియమ్సన్‌ను కాదని మయాంక్‌కు

గతంలో సన్‌రైజర్స్‌ కెప్టెన్‌గా ఉన్న న్యూజిల్యాండ్‌ ఆటగాడు కేన్‌ విలియమ్సన్‌ను ఈసారి ఎంపిక చేసుకోలేదు. అతడి స్థానంలో మయాంక్‌ అగర్వాల్‌ను హైదరాబాద్‌ జట్టు కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఫామ్‌లో లేనందువల్లే విలియమ్సన్‌ను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. గతంలో రూ.14 కోట్లకు విలియమ్సన్‌ను సన్‌రైజర్స్‌ కొనుగోలు చేసింది. హైదరాబాద్‌ తరఫున 76 మ్యాచ్‌లు ఆడి..2101 పరుగులు చేశాడు.  తాజాగా వేలంలో విలియమ్సన్‌ను గుజరాత్‌ టైటాన్స్‌ రూ. 2కోట్లకు కొనుగోలు చేసింది. పక్కా వ్యూహంతోనే విలియమ్సన్‌ స్థానంలో మయాంక్‌ అగర్వాల్‌ను హైదరాబాద్‌ జట్టు ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్‌ 2022లో కేవలం 13 మ్యాచ్‌లు ఆడిన మయాంక్‌ 196 పరుగులే చేసినప్పటికీ.. పంజాబ్‌ జట్టును ఆరో స్థానంలో నిలపడంలో కీలకంగా వ్యవహరించాడు. మరోవైపు హైదరాబాద్‌ జట్టు కెప్టెన్‌గా మయాంక్‌కు బాధ్యతలు అప్పగించే అవకాశాలు కూడా ఉన్నాయని ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని