IND vs ENG: భారత్‌లో ఇంగ్లాండ్‌ పర్యటన.. కుక్‌ నుంచి ఇలాంటి వ్యాఖ్యలు ఊహించలేదు: మార్క్‌వా

ఇంగ్లాండ్‌ సిరీస్‌ను కోల్పోవడం ఆ జట్టు మాజీలకు రుచించడం లేదు. దీంతో తమ జట్టు ప్రదర్శన గురించి పెద్దగా మాట్లాడకుండా.. పర్యటన గురించి వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

Published : 10 Mar 2024 15:38 IST

ఇంటర్నెట్ డెస్క్‌: భారత్‌ చేతిలో ఇంగ్లాండ్‌ ఐదు టెస్టుల (IND vs ENG) సిరీస్‌ను కోల్పోవడంతో.. దానిని తక్కువ చేసేందుకు ఆ జట్టు మాజీలు తాపత్రయపడుతున్నారు. ఈ క్రమంలో మాజీ కెప్టెన్ అలిస్టర్‌ కుక్‌ చేసిన వ్యాఖ్యలపై ఆసీస్ మాజీ ఆటగాడు మార్క్‌వా విస్మయం వ్యక్తం చేశాడు. అతడి నుంచి ఇలాంటి మాటలు ఊహించలేదన్నాడు. జట్టును వెనకేసుకురావడం ఓకే కానీ.. పర్యటనను తక్కువ చేయడం మంచిది కాదని పేర్కొన్నాడు. ‘‘అలిస్టర్ కుక్‌ ఇలా స్పందిస్తాడని అనుకోలేదు. అంతర్జాతీయ క్రికెటర్‌గా దీనిపై శిక్షణ పొందే ఉంటావు’’ అని మార్క్‌వా వ్యాఖ్యానించాడు.

ఇంతకీ కుక్‌ ఏమన్నాడంటే..?

బజ్‌బాల్ క్రికెట్‌తో ప్రత్యర్థులను హడలెత్తిద్దామని వచ్చిన ఇంగ్లాండ్‌ చివరికి కుదేలైంది. దాదాపు నెల రోజులపాటు సాగిన పర్యటన గురించి టీవీల్లో కూర్చొని మాట్లాడటం తేలిగ్గానే ఉంటుందని అలిస్టర్ కుక్ వ్యాఖ్యానించాడు. ‘‘టెస్టు సిరీస్‌ గురించి మాట్లాడేటప్పుడు కాస్త మానవత్వం అవసరం. మ్యాచ్‌ల భావోద్వేగాలపై మనం ఇక్కడ కూర్చొని ఏదైనా మాట్లాడొచ్చు. నేనేమీ ఇంగ్లాండ్‌ను వెనకేసుకురావడం లేదు. దాదాపు ఎనిమిది వారాల పాటు బయటే గడిపారు. ఇదెంతో క్లిష్టమైన టూర్. వారేమీ రోబోలు కాదు. వారి ప్రదర్శన గురించి మాట్లాడటం లేదు. వ్యక్తిగతంగా ఇంటికి దూరంగా ఉండటమనేది ఒత్తిడితో కూడుకున్నదే’’ అని కుక్‌ అన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని