Team India: అనుకున్నట్లే ఆ ముగ్గురికీ దక్కని చోటు.. వన్డే ప్రపంచ కప్‌నకు భారత జట్టు ఇదే..

భారత్‌ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్‌ కోసం బీసీసీఐ టీమ్‌ఇండియా (Team India) జట్టును ప్రకటించింది. 

Updated : 05 Sep 2023 15:39 IST

ఇంటర్నెట్ డెస్క్: అక్టోబర్‌ 5 నుంచి భారత్ వేదికగా జరగనున్న ప్రతిష్ఠాత్మక ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ (World Cup 2023) కోసం బీసీసీఐ (BCCI) భారత జట్టును ప్రకటించింది. చీఫ్ సెలక్టర్‌ అజిత్ అగార్కర్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ రోహిత్‌ శర్మ (Rohit Sharma) కెప్టెన్‌గా 15 మందితో జట్టుని ఎంపిక చేసింది. ఆసియా కప్‌తో పునరాగమనం చేసిన శ్రేయస్ అయ్యర్, కేఎల్‌ రాహుల్‌లకు అవకాశం దక్కింది. సీనియర్ స్టార్ పేసర్ బుమ్రా పేస్ దళాన్ని ముందుండి నడిపించనున్నాడు. వన్డేల్లో పెద్దగా రాణించలేకపోతున్నప్పటికీ సూర్యకుమార్‌ యాదవ్‌ వైపు సెలక్టర్లు మొగ్గుచూపారు. శార్దూల్ ఠాకూర్, హార్దిక్‌ పాండ్యను పేస్‌ ఆల్‌రౌండర్లుగా.. రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్‌కు స్పిన్‌ ఆల్‌రౌండర్లుగా అవకాశం కల్పించారు. యుజ్వేంద్ర చాహల్‌కు మరోసారి నిరాశే మిగలగా.. కుల్‌దీప్‌ యాదవ్‌ను స్పెషలిస్ట్‌ స్పిన్నర్‌గా తీసుకున్నారు. హైదరాబాదీ కుర్రాడు తిలక్ వర్మ, ప్రసిధ్ కృష్ణతోపాటు వికెట్ కీపర్‌ సంజు శాంసన్‌కు అవకాశం దక్కలేదు. 

ఎందుకు తీసుకోలేదంటే.. 

ఇటీవల జరిగిన విండీస్‌ పర్యటనలో తిలక్ వర్మ రాణించి ఆసియా కప్‌ జట్టులో చోటు సంపాదించాడు. అయితే, వరల్డ్‌ కప్‌ విషయానికొచ్చేటప్పటికీ సెలక్షన్ కమిటీ అనుభవానికి ఓటేసినట్లు అర్థమవుతోంది. ఆ కారణంతోనే తిలక్‌ను కాదని సూర్యకుమార్‌, రాహుల్‌, శ్రేయస్‌కు జట్టులో స్థానం ఇచ్చారు. ప్రసిధ్ కృష్ణ విషయానికొస్తే.. అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. అందులోనూ భారత్‌లో మ్యాచ్‌లు జరగనుండటంతో అదనపు పేసర్ అవసరం లేదని టీమ్‌ఇండియా సెలెక్షన్ కమిటీ భావించినట్లు సమాచారం. బుమ్రా, షమీ, సిరాజ్‌ రూపంలో స్పెషలిస్ట్‌ పేసర్లు జట్టులో ఉన్న విషయం తెలిసిందే. సంజూ శాంసన్‌కు అడపాదడపా అవకాశాలు ఇచ్చినా అంచనాల మేరకు రాణించలేకపోయాడు. మరోవైపు వచ్చిన అవకాశాలను ఇషాన్ కిషన్‌ రెండుచేతులా ఒడిసిపట్టాడు. ఈ నేపథ్యంలో సంజూ చోటు దక్కించుకోలేకపోయాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు