Team India: మా వరల్డ్‌ కప్‌ జట్టు ఇదేనంటున్న మాజీలు.. ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌కు స్పాన్సర్‌షిప్‌ హక్కులు.. పాక్‌కు బీసీసీఐ అధ్యక్షుడు!

ఆసియా కప్ కోసం (Asia Cup 2023) పాకిస్థాన్‌కు బీసీసీఐ అధ్యక్షుడు రోజర్‌ బిన్నీ వెళ్తున్నారా..? వరల్డ్‌ కప్‌ (ODI World Cup 2023) కోసం ప్రకటించే భారత జట్టులో గంగూలీ, సంజయ్‌ బంగర్ ఛాయిస్‌ ఎవరంటే? టీమ్‌ఇండియా (Team India) టైటిల్ స్పాన్సర్‌గా కొత్త భాగస్వామ్యంతో బీసీసీఐ జట్టు కట్టనుంది. ఇలాంటి విశేషాలు మీ కోసం..

Published : 26 Aug 2023 11:17 IST

ఇంటర్నెట్ డెస్క్‌: పాకిస్థాన్‌, శ్రీలంక వేదికగా ఆగస్ట్ 30 నుంచి ఆసియా కప్‌ (Asia Cup 2023) ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. పాక్‌లో నాలుగు మ్యాచ్‌లు, మిగతా మ్యాచ్‌లు శ్రీలంక వేదికగా జరగనున్నాయి. భారత్ ఆడే మ్యాచ్‌లు మాత్రం లంకలోనే ఉంటాయి. ఈ క్రమంలో పాకిస్థాన్‌లోని ముల్తాన్‌ వేదికగా పాక్-నేపాల్ (PAK vs NEP) మ్యాచ్‌తో టోర్నీ ఆరంభం కానుంది. మ్యాచ్‌కు హాజరుకావాలని ఇప్పటికే పాక్‌ క్రికెట్ బోర్డు ఏసీసీ (ACC) సభ్య దేశాలకు ఆహ్వానాలు పంపించింది. తొలుత భారత్ నుంచి బీసీసీఐ కార్యదర్శి, ఏసీసీ అధ్యక్షుడు జైషా హాజరవుతారని వార్తలు వచ్చాయి. వాటిని బీసీసీఐ వర్గాలు కొట్టిపడేశాయి. 

ICC World Cup 2023 Tickets: ప్రపంచకప్‌ టికెట్లు ఇలా పెట్టారో లేదో..

తాజాగా మరో విషయం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ (Rozer Binny), ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా పాకిస్థాన్‌లో జరిగే మ్యాచ్‌లకు హాజరయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే అధికారిక వర్గాల నుంచి ఆమోదం కూడా లభించినట్లు వార్తలు వచ్చాయి. అయితే, బీసీసీఐ మాత్రం ఇంకా అధికారికంగా స్పందించలేదు. సెప్టెంబర్ 5న(శ్రీలంక X అఫ్గానిస్థాన్), సెప్టెంబర్ 6న లాహోర్ వేదికగా సూపర్‌ ఫోర్ మ్యాచ్‌ జరగనుంది. ఒకవేళ సూపర్‌ -4 మ్యాచ్‌లో భారత్‌ తలపడితే ఆ వేదిక శ్రీలంకకు మారే అవకాశాలు ఉన్నాయి. రోజర్ బిన్నీ, రాజీవ్ శుక్లా, జై షా సెప్టెంబర్ 2న భారత్ X పాకిస్థాన్‌ మ్యాచ్‌కు హాజరవుతారని.. ఆ తర్వాత బిన్నీ, శుక్లా మాత్రమే లాహోర్‌కు వెళ్లే అవకాశం ఉందని బీసీసీఐ వర్గాలు అనధికారికంగా వెల్లడించాయి.


ఒక్క ఆటగాడి విషయంలోనే గంగూలీ, బంగర్ అంచనాల్లో వ్యత్యాసం

ప్రస్తుతం భారత్ ఆసియా కప్‌పై (Asia Cup 2023) దృష్టి సారించింది. సెప్టెంబర్ 2న దాయాది దేశం పాకిస్థాన్‌తో తలపడేందుకు సిద్ధమవుతోంది. అయితే, మాజీ క్రికెటర్లు మాత్రం ఆసియా కప్‌ కంటే వన్డే ప్రపంచకప్‌ (ODi World Cup 2023) బరిలోకి దిగబోయే జట్టుపైనే ఆసక్తి చూపిస్తున్నారు. వరల్డ్‌ కప్‌ కోసం జట్టును బీసీసీఐ (BCCI) సెప్టెంబర్ 4 లోగా ప్రకటించే అవకాశం ఉంది. ఆలోగా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ, మాజీ కోచ్‌ సంజయ్ బంగర్ తమ అంచనాలతో కూడిన జట్టును వెల్లడించారు. ఇద్దరూ దాదాపు ఒకేలాంటి జట్టును ఎంపిక చేసినా ఒకే ఒక్క ఆటగాడిని తీసుకోవడంలో వ్యత్యాసం చూపారు. యువ ఆటగాళ్లు తిలక్ వర్మ, ప్రసిధ్ కృష్ణతోపాటు సీనియర్‌ ఆటగాడు సంజూ శాంసన్‌ను పక్కన పెట్టేశారు. గంగూలీ తన జట్టులోకి పేస్‌ ఆల్‌రౌండర్‌గా హార్దిక్‌పాండ్యతోపాటు శార్దూల్‌ ఠాకూర్‌ను ఎంపిక చేయగా.. బంగర్‌ మాత్రం శార్దూల్‌కు బదులు అర్ష్‌దీప్‌ను తీసుకున్నాడు. వీరిద్దరి జట్లు ఇలా.. 

గంగూలీ జట్టు: రోహిత్ శర్మ, శుభ్‌మన్‌ గిల్, ఇషాన్‌ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్‌ యాదవ్, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్‌దీప్‌ యాదవ్, బుమ్రా, షమీ, సిరాజ్‌, శార్దూల్ ఠాకూర్

సంజయ్‌ టీమ్‌: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్‌ యాదవ్, ఇషాన్‌ కిషన్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, కుల్‌దీప్‌ యాదవ్, బుమ్రా, షమీ, సిరాజ్‌, అర్ష్‌దీప్‌ సింగ్


ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌కు అంతర్జాతీయ, దేశవాళీ టైటిల్ స్పాన్సర్‌షిప్‌ హక్కులు

టీమ్ఇండియా ఆడే అంతర్జాతీయ మ్యాచులతోపాటు డొమిస్టిక్‌ స్థాయిలో జరిగే సిరీస్‌ టైటిల్‌ స్పాన్సర్‌షిప్‌ హక్కులను ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ లిమిటెడ్  దక్కించుకుంది. ఈ మేరకు బీసీసీఐ ప్రకటన వెలువరించింది. బీసీసీఐ నిర్వహించే ఇరానీ, దులీప్‌, రంజీ ట్రోఫీలతోపాటు భారత పురుష, మహిళా జట్లు ఆడే ద్వైపాక్షిక సిరీస్‌లకు టైటిల్‌ స్పాన్సర్‌గా ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ వ్యవహరించనుంది. భారత్ వేదికగా ఆసీస్‌తో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌ నుంచి ఈ ఒప్పందం ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా బీసీసీఐ అధ్యక్షుడు రోజర్‌ బిన్నీ, కార్యదర్శి జైషా ఆనందం వ్యక్తం చేశారు. బీసీసీఐ-ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ భాగస్వామ్యంతో భారత క్రికెట్‌ మరింత విజయవంతమవుతుందని ఆకాంక్షించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని