Lucknow vs Delhi: చెలరేగిన డికాక్‌.. లఖ్‌నవూ ఖాతాలో ముచ్చటగా మూడో విజయం

టీ20 మెగా టోర్నీలో లఖ్‌నవూ వరుసగా మూడో విజయం సాధించింది. దిల్లీ జట్టుతో జరిగిన మ్యాచులో 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దిల్లీ నిర్దేశించిన 150 పరుగుల మోస్తరు లక్ష్యాన్ని 19.4 ఓవర్లలోనే ఛేదించింది...

Updated : 08 Apr 2022 05:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ : టీ20 మెగా టోర్నీలో లఖ్‌నవూ వరుసగా మూడో విజయం సాధించింది. దిల్లీ జట్టుతో జరిగిన మ్యాచులో 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దిల్లీ నిర్దేశించిన 150 పరుగుల మోస్తరు లక్ష్యాన్ని 19.4 ఓవర్లలోనే ఛేదించింది. దిల్లీకి ఇది వరుసగా రెండో ఓటమి కావడం గమనార్హం. లఖ్‌నవూ విజయంలో ఓపెనర్‌ క్వింటన్ డి కాక్ (80 : 52 బంతుల్లో 9×4, 2×6) కీలకంగా వ్యవహరించాడు. కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ (24), దీపక్ హుడా (11) పరుగులు చేశారు. ఎవిన్ లూయిస్ (5) విఫలమయ్యాడు. కృనాల్ పాండ్య (19*), ఆయుష్‌ బదోని (10*) జట్టుని విజయ తీరాలకు చేర్చారు. దిల్లీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్‌ రెండు, లలిత్ యాదవ్‌, శార్దూల్ ఠాకూర్‌ చెరో వికెట్ పడగొట్టారు.


లక్ష్యం దిశగా లఖ్‌నవూ..

లఖ్‌నవూ బ్యాటర్లు నిలకడగా ఆడుతూ లక్ష్యం దిశగా సాగుతున్నారు. లలిత్‌ యాదవ్ వేసిన 11వ ఓవర్లో ఐదు పరుగులు.. కుల్దీప్ యాదవ్‌ వేసిన ఆ తర్వాతి ఓవర్లో ఏడు పరుగులు ఇచ్చాడు. 13వ ఓవర్లో మూడో బంతికి ఎవిన్‌ లూయిస్‌ (5) కుల్దీప్ యాదవ్‌కి చిక్కి క్రీజు వీడాడు. అన్రిచ్ నార్జ్‌ వేసిన 14 ఓవర్లో తొలి బంతిని క్వింటన్ డి కాక్‌ భారీ సిక్సర్‌గా మలిచాడు. శార్దూల్ ఠాకూర్ వేసిన 15వ ఓవర్లో డి కాక్‌ (71) మరో ఫోర్ కొట్టాడు. దీపక్‌ హుడా (6) క్రీజులో ఉన్నాడు.  దీంతో 15 ఓవర్లు పూర్తయ్యే సరికి లఖ్‌నవూ 111/2 స్కోరుతో నిలిచింది. లఖ్‌నవూ విజయానికి ఇంకా 40 పరుగుల దూరంలో ఉంది. 


దూకుడుగా ఆడుతున్న క్వింటన్‌ డికాక్‌.. లఖ్‌నవూ ఇంకా ఎంత కొట్టాలంటే.?

దిల్లీతో జరుగుతున్న మ్యాచ్‌లో 150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లఖ్‌నవూ సునాయసంగా పరుగులు రాబడుతోంది. పది ఓవర్లు పూర్తయ్యేసరికి  74/1 స్కోరుతో పటిష్ట స్థితిలో నిలిచింది. ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌ (47; 33 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధశతకానికి చేరువయ్యాడు. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ (24) ఔటయ్యాడు. అతడు కుల్‌దీప్‌ యాదవ్‌ వేసిన 9.4 ఓవర్‌కు పృథ్వీ షాకి చిక్కాడు. అక్షర్‌ పటేల్ వేసిన ఏడో ఓవర్‌లో మూడు, కుల్‌దీప్‌ యాదవ్‌ వేసిన తర్వాతి ఓవర్‌లో 11, అక్షర్‌ పటేల్ వేసిన తొమ్మిదో ఓవర్‌లో ఎనిమిది, కుల్‌దీప్‌ యాదవ్‌ వేసిన పదో ఓవర్‌లో నాలుగు పరుగులు వచ్చాయి. లఖ్‌నవూ విజయం సాధించాలంటే ఇంకా 60 బంతుల్లో 76 పరుగులు చేయాలి.  


పవర్‌ ప్లే పూర్తి..

పవర్‌ ప్లే పూర్తయ్యే సరికి లఖ్‌నవూ వికెట్‌ నష్టపోకుండా 48 పరుగులు చేసింది. లలిత్ యాదవ్‌ వేసిన నాలుగో ఓవర్లో మూడో బంతిని బౌండరీకి తరలించిన క్వింటన్ డి కాక్‌ (36).. అన్రిచ్ నార్జ్‌ వేసిన ఆ తర్వాతి ఓవర్లో హ్యాట్రిక్‌ ఫోర్లు సహా ఓ సిక్స్‌ బాదాడు. ముస్తాఫిజుర్ రహ్మాన్‌ వేసిన ఆరో ఓవర్లో మూడే పరుగులు ఇచ్చాడు. కెప్టెన్ కేఎల్ రాహుల్ (10) క్రీజులో ఉన్నాడు.   


ఛేదనకు దిగిన లఖ్‌నవూ.. క్రీజులో కేఎల్ రాహుల్‌, డి కాక్‌..

దిల్లీ నిర్దేశించిన మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు లఖ్‌నవూ బ్యాటర్లు బరిలోకి దిగారు. ముస్తాఫిజుర్‌ వేసిన తొలి ఓవర్లో ఐదు పరుగులు ఇవ్వగా.. రెండో ఓవర్లో లలిత యాదవ్‌ రెండే పరుగులు ఇచ్చాడు. శార్దూల్ ఠాకూర్‌ వేసిన మూడో ఓవర్లో రెండో బంతిని కెప్టెన్‌ కేఎల్ రాహుల్ (8) బౌండరీకి తరలించాడు. క్వింటన్‌ డి కాక్‌ (5) క్రీజులో ఉన్నాడు. మూడు ఓవర్లు పూర్తయ్యే సరికి లఖ్‌నవూ వికెట్ నష్టపోకుండా 15 పరుగులు చేసింది.  


దిల్లీ బ్యాటింగ్‌ పూర్తి.. లఖ్‌నవూ లక్ష్యం ఎంతంటే.? 

లఖ్‌నవూ జట్టుతో జరుగుతున్న మ్యాచులో దిల్లీ ఇన్నింగ్స్‌ పూర్తయ్యింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దిల్లీ.. నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. లఖ్‌నవూ ముందు 150 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. దిల్లీ బ్యాటర్లలో ఓపెనర్ పృథ్వీ షా (61 : 34 బంతుల్లో 9×4, 2×6) క్రీజులో ఉన్నంత సేపు బౌండరీలతో అలరించాడు. కెప్టెన్ రిషభ్ పంత్‌ (39*), సర్ఫరాజ్‌ ఖాన్‌ (36*) కీలక ఇన్నింగ్సులు ఆడారు. డేవిడ్‌ వార్నర్ (4), రోమన్‌ పావెల్ (3) నిరాశ పర్చారు. లఖ్‌నవూ బౌలర్లలో రవి బిష్ణోయ్ రెండు, కృష్ణప్ప గౌతమ్‌ ఓ వికెట్ పడగొట్టారు. 


వేగం పెంచిన దిల్లీ బ్యాటర్లు.. క్రీజులో పంత్, సర్ఫరాజ్‌ ఖాన్‌..

లఖ్‌నవూ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేస్తున్నారు. దీంతో దిల్లీ స్వల్ప వ్యవధిలోనే కీలక వికెట్లు కోల్పోయింది. 15 ఓవర్లు పూర్తయ్యే సరికి దిల్లీ 99/3 స్కోరుతో నిలిచింది. రవి బిష్ణోయ్‌ వేసిన 11వ ఓవర్లో మూడో బంతికి రోమన్‌ పావెల్ (3) బౌల్డయ్యాడు. కృష్ణప్ప గౌతమ్‌ వేసిన తర్వాతి ఓవర్‌ మెయిడిన్‌ అయ్యింది. 13వ ఓవర్లో కృనాల్ పాండ్య ఏడు.. ఆ తర్వాతి ఓవర్లో ఆండ్రూ టై మూడు పరుగులు ఇచ్చారు. రవి బిష్ణోయ్‌ వేసిన 15వ ఓవర్లో ఆఖరు బంతిని రిషభ్‌ పంత్ (12) బౌండరీకి తరలించాడు. సర్ఫరాజ్ ఖాన్‌ (16) క్రీజులో ఉన్నాడు. 


పుంజుకుంటున్న లఖ్‌నవూ బౌలర్లు.. కీలక వికెట్లు కోల్పోయిన దిల్లీ

ఆరంభం నుంచే ధాటిగా ఆడుతున్న ఓపెనర్‌ పృథ్వీ షా (61).. కృనాల్ పాండ్య వేసిన ఏడో ఓవర్లో నాలుగో బంతికి రెండు  పరుగులు తీసి అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. కృష్ణప్ప గౌతమ్‌ వేసిన తర్వాతి ఓవర్లో ఓ సిక్స్‌, ఓ ఫోర్ బాదిన పృథ్వీ.. మూడో బంతికి కీపర్‌కి చిక్కి క్రీజు వీడాడు. రవి బిష్ణోయ్‌ వేసిన 9వ ఓవర్లో మూడో బంతికి మరో ఓపెనర్‌ డేవిడ్ వార్నర్‌ (4) ఆయుష్‌ బదోనికి క్యాచ్‌ ఇచ్చాడు. దీంతో దిల్లీ స్వల్ప వ్యవధిలో రెండు కీలక వికెట్లు కోల్పోయినట్లయింది, పదో ఓవర్లో కృష్ణప్ప గౌతమ్‌ మూడే పరుగులు ఇచ్చాడు. ప్రస్తుతం కెప్టెన్ రిషభ్‌ పంత్‌ (3), రోమన్‌ పావెల్ (3) క్రీజులో ఉన్నారు. పది ఓవర్లు పూర్తయ్యే సరికి దిల్లీ 73/2 స్కోరుతో నిలిచింది. 


ధాటిగా ఆడుతున్న పృథ్వీ షా.. సహకరిస్తున్న వార్నర్‌..

దిల్లీ ఓపెనర్ పృథ్వీ షా ధాటిగా ఆడుతున్నాడు. జేసన్‌ హోల్డర్ వేసిన మూడో ఓవర్లో ఓ ఫోర్‌, ఓ సిక్స్‌ బాదిన పృథ్వీ షా (47).. అవేశ్ ఖాన్‌ వేసిన ఆ తర్వాతి ఓవర్లో హ్యాట్రిక్ ఫోర్లు బాదాడు. అదే ఊపును కొనసాగస్తూ రవి బిష్ణోయ్‌ వేసిన 5వ ఓవర్లో ఓ ఫోర్‌, ఆండ్రూ టై వేసిన ఆరో ఓవర్లో మరో ఫోర్ బాదాడు. డేవిడ్‌ వార్నర్ (3) అతడికి సహకరిస్తున్నాడు. దీంతో పవర్‌ ప్లే పూర్తయ్యే సరికి దిల్లీ వికెట్ నష్టపోకుండా 52 పరుగులు చేసింది. 


బ్యాటింగ్‌కు దిగిన దిల్లీ.. క్రీజులో పృథ్వీ షా, వార్నర్‌..

ముంబయిలోని డీవై పాటిల్ వేదికగా లీగ్‌ మ్యాచ్‌ ప్రారంభమైంది. టాస్‌ ఓడిన దిల్లీ జట్టు బ్యాటింగ్‌కు దిగింది. జేసన్‌ హోల్డర్‌ వేసిన తొలి ఓవర్లో తొలి బంతికి ఓపెనర్‌ పృథ్వీ షా (11) మూడు పరుగులు తీయగా.. నాలుగో బంతిని డేవిడ్ వార్నర్‌ (2) సింగిల్‌ తీశాడు.  కృష్ణప్ప గౌతమ్‌ వేసిన తర్వాతి ఓవర్లో వార్నర్ మరో సింగిల్ తీయగా.. పృథ్వీ రెండు ఫోర్లు బాదాడు. దీంతో రెండు ఓవర్లు పూర్తయ్యే సరికి దిల్లీ 13/0 స్కోరుతో నిలిచింది. 


టాస్‌ నెగ్గిన లఖ్‌నవూ.. జోరు కొనసాగించేనా.?

టీ20 మెగా టోర్నీలో భాగంగా మరి కాసేపట్లో లఖ్‌నవూ, దిల్లీ జట్లు తలపడనున్నాయి. టాస్‌ నెగ్గిన లఖ్‌నవూ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్ బౌలింగ్‌ ఎంచుకున్నాడు. దిల్లీకి బ్యాటింగ్‌ అప్పగించాడు. లఖ్‌నవూ జట్టు మూడింట్లో రెండు విజయాలు సాధించగా.. దిల్లీ రెండు మ్యాచులు ఆడితే ఓ మ్యాచులో గెలుపొంది, మరో మ్యాచులో ఓటమి పాలైంది. ముంబయిలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా జరుగనున్న ఈ మ్యాచులో పై చేయి సాధించేదెవరో చూడాలి.!

తుది జట్ల వివరాలు..

లఖ్‌నవూ : కేఎల్ రాహుల్ (కెప్టెన్), క్వింటన్ డి కాక్‌ (వికెట్ కీపర్‌), ఎవిన్ లూయిస్‌, దీపక్‌ హుడా, ఆయుష్ బదోని, కృనాల్ పాండ్య, జేసన్ హోల్డర్, కృష్ణప్ప గౌతమ్‌, ఆండ్రూ టై, రవి బిష్ణోయ్‌, అవేశ్ ఖాన్‌

దిల్లీ : పృథ్వీ షా, డేవిడ్ వార్నర్‌, రిషభ్‌ పంత్‌ (కెప్టెన్, వికెట్ కీపర్‌), లలిత్‌ యాదవ్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌, రోమన్‌ పావెల్‌, శార్దూల్ ఠాకూర్‌, అక్షర్‌ పటేల్‌, కుల్దీప్ యాదవ్‌, అన్రిచ్‌ నార్జ్‌, ముస్తాఫిజుర్‌ రహ్మాన్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని