Punjab Vs Delhi : దిల్లీ ప్లేఆఫ్స్‌ ఆశలు సజీవం.. ఇంటి ముఖం పట్టిన పంజాబ్‌

ప్లేఆఫ్స్ బెర్తు కోసం కీలక సమరం.. ఏది ఓడితే అది ఇంటిముఖం పట్టక తప్పదు. ఇలాంటి చావో రేవో మ్యాచ్‌లో మరికాసేపట్లో దిల్లీ, పంజాబ్‌ జట్లు తలపడనున్నాయి. టాస్‌ నెగ్గిన ...

Updated : 16 May 2022 23:40 IST

ముంబయి: ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో దిల్లీ సత్తా చాటింది. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 17 పరుగుల తేడాతో విజయం సాధించి ప్లేఆఫ్స్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన దిల్లీ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 142 పరుగులే చేసింది. పంజాబ్‌ బ్యాటర్లలో జితేశ్ శర్మ (44; 34 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), జానీ బెయిర్‌ స్టో (28; 15 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించగా.. ధావన్‌ (19) ఫర్వాలేదనిపించాడు. మయాంక్ అగర్వాల్ (0) డకౌట్ కాగా.. లివింగ్ స్టోన్‌ (3), హర్‌ప్రీత్ (1), రిషి ధావన్‌ (4), భానుక రాజపక్స (4), రబాడ (6), అర్ష్‌దీప్‌ సింగ్ (2*), రాహుల్ చాహర్‌ (25*) పరుగులు చేశారు. దిల్లీ బౌలర్లలో శార్దూల్ ఠాకూర్‌ నాలుగు వికెట్లతో ఆకట్టుకోగా.. అక్షర్‌ పటేల్, కుల్‌దీప్ యాదవ్ రెండు వికెట్లు పడగొట్టారు. నార్జ్‌ ఒక వికెట్ తీశాడు. ఈ ఓటమితో పంజాబ్‌ ప్లేఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించి ఇంటి ముఖం పట్టింది. 


 పంజాబ్‌ మరో వికెట్ కోల్పోయింది. అక్షర్‌ పటేల్ వేసిన 13వ ఓవర్లో రిషి ధావన్ (4) క్లీన్‌ బౌల్డ్ అయ్యాడు. 15 ఓవర్లకు పంజాబ్ 101/7 స్కోరుతో ఉంది. జితేశ్‌ శర్మ (36), రాహుల్ చాహర్‌ (3) క్రీజులో ఉన్నారు. పంజాబ్‌ విజయానికి 30 బంతుల్లో 59 పరుగులు కావాలి. 


స్వల్ప వ్యవధిలో ఐదు వికెట్లు

పంజాబ్ స్వల్ప వ్యవధిలో ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. శార్దూల్‌ ఠాకూర్‌ వేసిన ఆరో ఓవర్‌లో మూడో బంతికి భానుక రాజపక్స (4).. నార్జ్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. ఇదే ఓవర్‌లో చివరి బంతికి శిఖర్‌ ధావన్‌ (19) పంత్‌కి చిక్కాడు. ఈ వరుస షాక్‌ల నుంచి తెరుకోకముందే అక్షర్‌ పటేల్ వేసిన ఏడో ఓవర్‌లో పంజాబ్‌ కెప్టెన్‌ మయాంక్ అగర్వాల్ (0) క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. కుల్‌దీప్‌ యాదవ్‌ వేసిన ఎనిమిదో  ఓవర్‌లో చివరి బంతికి లివింగ్ స్టోన్‌ (3) స్టంపౌట్‌ కాగా.. పదో ఓవర్‌లో మూడో బంతికి  హర్‌ప్రీత్‌ బ్రార్‌ (1) క్లీన్‌ బౌల్డ్ అయ్యాడు. 10 ఓవర్లకు పంజాబ్ ఆరు వికెట్ల నష్టానికి 68 పరుగులు చేసింది. రిషి ధావన్ (1), జితేశ్ శర్మ (10) క్రీజులో ఉన్నారు.  


 జానీ బెయిర్‌ స్టో ఔట్‌

దిల్లీ నిర్దేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు పంజాబ్‌ బరిలోకి దిగింది. దూకుడుగా ఆడుతున్న ఓపెనర్ జానీ బెయిర్‌ స్టో (28; 15 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌).. నార్జ్‌ వేసిన నాలుగో ఓవర్‌లో పెవిలియన్‌ చేరాడు. ఖలీల్‌ అహ్మద్‌ వేసిన మూడో ఓవర్‌లో 13 పరుగులు వచ్చాయి. 5 ఓవర్లకు పంజాబ్ వికెట్ నష్టానికి 44 పరుగులు చేసింది. శిఖర్ ధావన్‌ (14), భానుక రాజపక్స (0) క్రీజులో ఉన్నారు.


పంజాబ్ ముందు మోస్తరు లక్ష్యం

పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో దిల్లీ బ్యాటింగ్‌ ముగిసింది. మిచెల్ మార్ష్‌ (63; 48 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), సర్ఫరాజ్ ఖాన్‌ (32; 16 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో పంత్‌ సేన ఏడు వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. దిల్లీ మిగతా బ్యాటర్లలో లలిత్‌ యాదవ్‌ (24) ఫర్వాలేదనిపించగా.. డేవిడ్ వార్నర్ (0) గోల్డన్‌ డక్‌గా వెనుదిరిగాడు. రిషభ్‌ పంత్ (7), రోమన్‌ పావెల్ (2), శార్దూల్ ఠాకూర్‌ (3), అక్షర్‌ పటేల్ (15*), కుల్‌దీప్‌ యాదవ్‌ (3*) పరుగులు చేశారు. పంజాబ్‌ బౌలర్లలో లివింగ్ స్టోన్, అర్ష్‌దీప్ సింగ్ మూడు వికెట్లు పడగొట్టగా.. రబాడ ఒక వికెట్ తీశాడు.  


  స్వల్ప వ్యవధిలో మూడు వికెట్లు

దిల్లీ స్వల్పవ్యవధిలో మూడు వికెట్లు కోల్పోయింది. అర్ష్‌దీప్ సింగ్ వేసిన 11వ ఓవర్‌లో చివరి బంతికి లలిత్‌ యాదవ్‌ (24) రాజపక్సకు చిక్కాడు. లివింగ్‌ స్టోన్‌ వేసిన తర్వాతి ఓవర్‌లో చివరి బంతికి రిషభ్ పంత్ (7) స్టంపౌట్‌ అయ్యాడు. రాహుల్ చాహర్‌ వేసిన 13వ ఓవర్‌లో రెండు పరుగులు రాగా.. లివింగ్‌ స్టోన్‌ 14వ ఓవర్‌లో రోమన్‌ పావెల్ (2) శిఖర్‌ ధావన్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. 15 ఓవర్లకు దిల్లీ 116/5 స్కోరుతో ఉంది. అక్షర్‌ పటేల్ (3), మిచెల్ మార్ష్‌ (46) క్రీజులో ఉన్నారు. 


 నెమ్మదించిన దిల్లీ స్కోరు బోర్డు

పంజాబ్ బౌలర్లు కాస్త కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తుండటంతో దిల్లీ పరుగుల వేగం తగ్గింది. ప్రస్తుతం 10 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి 86 పరుగులు చేసింది. క్రీజ్‌లో మిచెల్ మార్ష్ (32*), లలిత్‌ యాదవ్ (21*) ఉన్నారు. పవర్‌ప్లే ఓవర్ల తర్వాత దిల్లీ బ్యాటర్లు ఆచితూచి ఆడుతుండటంతో స్కోరు బోర్డు నెమ్మదించింది. 


పవర్‌ప్లే ముగిసింది..

తొలి బంతికే వికెట్‌ కోల్పోయినా పవర్‌ప్లేలో దిల్లీ స్కోరు ఏ మాత్రం తగ్గలేదు. దీనికి ప్రధాన కారణం సర్ఫరాజ్‌ ఖాన్‌(32) వీర బాదుడే. అయితే అర్ష్‌దీప్‌సింగ్ వేసిన ఓవర్‌లో రాహుల్‌ చాహర్‌ చేతికి చిక్కి పెవిలియన్‌కు చేరాడు. ప్రస్తుతం ఆరు ఓవర్లు ముగిసేసరికి దిల్లీ రెండు వికెట్ల నష్టానికి 59 పరుగులు చేసింది. క్రీజ్‌లో మిచెల్ మార్ష్‌ (20*), లలిత్ యాదవ్ (6*) ఉన్నారు. అంతకుముందు రెండో వికెట్‌కు మార్ష్‌తో కలిసి సర్ఫరాజ్‌ 51 పరుగులను జోడించాడు.


వార్నర్ గోల్డెన్‌ డక్‌

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దిల్లీకి తొలి బంతికే షాక్‌.. విధ్వంస బ్యాటర్‌ డేవిడ్ వార్నర్ (0) గోల్డెన్‌ డక్‌గా పెవిలియన్‌కు చేరాడు. తొలి ఓవర్‌ వేసిన లియామ్‌ లివింగ్‌స్టోన్‌ బౌలింగ్‌లో వార్నర్ షాట్‌కు యత్నించి రాహుల్ చాహర్‌ చేతికి చిక్కాడు. ఈ ఓవర్‌లో ఐదు పరుగులు వచ్చాయి. అయితే రబాడ వేసిన రెండో ఓవర్‌లో మిచెల్ మార్ష్‌ (16*) వరుసగా రెండు సిక్సర్లు బాదాడు. ఈ ఓవర్‌లో మొత్తం 15 పరుగులు వచ్చాయి. ప్రస్తుతం రెండు ఓవర్లు ముగిసేసరికి దిల్లీ వికెట్ నష్టానికి 20 పరుగులు చేసింది. క్రీజ్‌లో మార్ష్‌తోపాటు సర్ఫరాజ్‌ ఖాన్‌ (3*) ఉన్నాడు.


టాస్‌ నెగ్గిన మయాంక్‌

ప్లేఆఫ్స్ బెర్తు కోసం కీలక సమరం.. ఏది ఓడితే అది ఇంటిముఖం పట్టక తప్పదు. ఇలాంటి చావో రేవో మ్యాచ్‌లో మరికాసేపట్లో దిల్లీ, పంజాబ్‌ జట్లు తలపడనున్నాయి. టాస్‌ నెగ్గిన పంజాబ్‌ కెప్టెన్‌ మయాంక్ అగర్వాల్ బౌలింగ్‌ ఎంచుకుని దిల్లీకి బ్యాటింగ్‌ అప్పగించాడు. గత మ్యాచ్‌లో బెంగళూరును చిత్తు చేసిన రేసులోకి వచ్చిన పంజాబ్‌.. అదే ఊపును కొనసాగించి గెలవాలని భావిస్తోంది. మరోవైపు దిల్లీ పరిస్థితి కూడానూ పంజాబ్‌ మాదిరిగానే ఉంది. చెన్నైపై ఘోర పరాభవం తర్వాత పటిష్టమైన రాజస్థాన్‌పై అద్భుత విజయం సాధించింది. ఇరు జట్లకూ ఇదే కీలకం. ఇందులో గెలిచి తమ ఆఖరి మ్యాచ్‌లోనూ విజయం సాధిస్తే ప్లేఆఫ్స్ అవకాశాలు ఉంటాయి. 

జట్ల వివరాలు:

దిల్లీ: డేవిడ్ వార్నర్, సర్ఫరాజ్ ఖాన్‌, మిచెల్ మార్ష్, రిషభ్‌ పంత్ (కెప్టెన్), లలిత్ యాదవ్, రోవ్‌మన్ పావెల్, అక్షర్‌ పటేల్, శార్దూల్ ఠాకూర్, నోకియా, ఖలీల్ అహ్మద్

పంజాబ్‌: జానీ బెయిర్‌స్టో, శిఖర్ ధావన్, భానుక రాజపక్స, లియామ్‌ లివింగ్‌ స్టోన్, మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), జితేశ్‌ శర్మ, హర్‌ప్రీత్ సింగ్, రిషి ధావన్, కగిసో రబాడ, రాహుల్ చాహర్, అర్ష్‌ దీప్‌ సింగ్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని