రెండో రోజు మెరిసిన భారత్‌

ఆస్ట్రేలియాతో సిడ్నీలో జరుగుతున్న మూడో టెస్టులో భారత్‌ దీటుగా బదులిస్తోంది. 166/2 ఓవర్‌నైట్‌ స్కోరుతో రెండో రోజును ఆరంభించిన కంగారూలు 338 పరుగులకు ఆలౌటయ్యారు. తర్వాత టీమ్‌ఇండియా సైతం బ్యాటింగ్‌లో...

Updated : 08 Jan 2021 13:23 IST

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌ 338
దీటుగా బదులిస్తోన్న రహానె సేన

సిడ్నీ: ఆస్ట్రేలియాతో సిడ్నీలో జరుగుతున్న మూడో టెస్టులో భారత్‌ దీటుగా బదులిస్తోంది. 166/2 ఓవర్‌నైట్‌ స్కోరుతో రెండో రోజు ఆటను ఆరంభించిన కంగారూలు 338 పరుగులకు ఆలౌటయ్యారు. తర్వాత టీమ్‌ఇండియా బ్యాటింగ్‌లో మంచి ప్రదర్శనే చేసింది. దీంతో శుక్రవారం ఆట ముగిసే సమయానికి భారత్‌ 45 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 96 పరుగులు చేసింది. ఆతిథ్య జట్టు కన్నా ఇంకా 242 పరుగుల వెనుకబడి ఉంది. ప్రస్తుతం పుజారా (9), తాత్కాలిక కెప్టెన్‌ రహానె (5) క్రీజులో ఉన్నారు. శనివారం వీరిద్దరూ ఎలా ఆడతారనేది ఆసక్తిగా మారింది. 

స్మిత్‌ శతకం..

అంతకుముందు ఆల్‌రౌండర్‌‌ రవీంద్ర జడేజా చెలరేగడంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 338 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్‌ బ్యాట్స్‌మెన్‌ మార్నస్‌ లబుషేన్ ‌(91; 196 బంతుల్లో 11x4) త్రుటిలో శతకం చేజార్చుకున్నా.. స్టీవ్ ‌స్మిత్ ‌(131; 226 బంతుల్లో 16x4) ఆ అవకాశాన్ని వదులుకోలేదు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 100 పరుగులు జోడించారు. ఈ క్రమంలోనే జట్టు స్కోర్‌ 206 పరుగుల వద్ద జడ్డూ లబుషేన్‌ను ఔట్‌ చేసి రెండో రోజు వికెట్ల పతనాన్ని ఆరంభించాడు. ఆపై బుమ్రా అద్భుతంగా బౌలింగ్‌ చేయడంతో ఆసీస్‌ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. వచ్చిన బ్యాట్స్‌మెన్‌ వచ్చినట్లు పెవిలియన్‌ చేరినా స్మిత్‌ ఒంటరి పోరాటం చేశాడు. క్రీజులో పాతుకుపోయి టెస్టుల్లో 27వ శతకం సాధించాడు. చివరికి జడేజానే అతడిని రనౌట్‌ చేయడంతో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌కు తెరపడింది.

రోహిత్‌, గిల్‌ శుభారంభం..

అనంతరం బ్యాటింగ్‌ ఆరంభించిన టీమ్‌ఇండియా ఆట ముగిసే సమయానికి రెండు వికెట్లు కోల్పోయి 96 పరుగులు చేసింది. ఓపెనర్లు శుభారంభం చేశారు. గాయం నుంచి కోలుకొని నేరుగా ఈ మ్యాచ్‌లో ఆడుతున్న రోహిత్‌ శర్మ (26; 77 బంతుల్లో 3x4, 1x6) సంయమనంతో బ్యాటింగ్‌ చేశాడు. యువ ఓపెనర్‌ శుభ్‌మన్ ‌గిల్‌ (50; 101 బంతుల్లో 8x4)తో కలిసి తొలి వికెట్‌కు 70 పరుగులు జోడించాడు. ఈ క్రమంలో హేజిల్‌వుడ్‌ వేసిన 27వ ఓవర్‌ చివరి బంతికి రిటర్న్‌ క్యాచ్‌ ఇచ్చి రోహిత్‌ ఔటయ్యాడు. ఆపై గిల్‌ అర్ధశతకం బాదిన వెంటనే కమిన్స్‌ బౌలింగ్‌లో గ్రీన్‌ చేతికి చిక్కాడు. దీంతో భారత్‌ 85 పరుగుల వద్ద రెండో వికెట్‌ కోల్పోయింది. ఈ నేపథ్యంలో జోడీ కట్టిన పుజారా, రహనె మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడారు. చివరికి భారత్‌ 45 ఓవర్లలో 96/2తో నిలిచి రెండో రోజును ముగించింది.

ఇవీ చదవండి..
నాలుగో టెస్టుపై నీలి నీడలు..
కోహ్లీ సరసన ‌స్మిత్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని