IPL 2021: అందుకే వారికి చార్టర్‌ ఫ్లైట్లు.. దుబాయ్‌కి భారత్‌, ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు

టీమ్‌ఇండియా, ఇంగ్లాండ్‌ జట్ల మధ్య ఆసక్తికరంగా సాగిన ఐదు టెస్టుల సిరీస్‌ చివరి మ్యాచ్‌ జరగకుండానే పూర్తయింది. దీంతో అనుకున్న షెడ్యూల్‌ కన్నా ముందే ఇరు జట్ల ఆటగాళ్లు ఐపీఎల్‌ కోసం దుబాయ్‌కు బయలుదేరనున్నారు...

Published : 12 Sep 2021 01:10 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా, ఇంగ్లాండ్‌ జట్ల మధ్య ఆసక్తికరంగా సాగిన ఐదు టెస్టుల సిరీస్‌ చివరి మ్యాచ్‌ జరగకుండానే పూర్తయింది. దీంతో అనుకున్న షెడ్యూల్‌ కన్నా ముందే ఇరు జట్ల ఆటగాళ్లు ఐపీఎల్‌ కోసం దుబాయ్‌కు బయలుదేరనున్నారు. కరోనా నేపథ్యంలోనే మే 4న నిరవధికంగా వాయిదా పడిన టీ20 లీగ్‌.. ఈనెల 19 నుంచి తిరిగి యూఏఈలో ప్రారంభమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, ముంబయి ఇండియన్స్‌, పంజాబ్‌ కింగ్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్లు తమ ఆటగాళ్లను దుబాయ్‌కు తీసుకొచ్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాయి. ఐదో టెస్టు రద్దవ్వడం వల్ల సుదీర్ఘ పర్యటన నుంచి ఆటగాళ్లకు కాస్త ఉపశమనం లభిస్తుందని, అందుకే వారిని త్వరగా తీసుకొస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ముంబయి, బెంగళూరు ప్రత్యేక విమానాలు..

ఈ ఐపీఎల్‌ సీజన్‌లో ప్రస్తుతం నాలుగో స్థానంలో కొనసాగుతున్న డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ ముంబయి ఇండియన్స్‌ తమ ఆటగాళ్ల కోసం ప్రత్యేక విమానం ఏర్పాటు చేసింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో పాటు మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌ సూర్యకుమార్‌, పేస్‌గుర్రం జస్ప్రిత్‌ బుమ్రా తమ కుటుంబాలతో సహా ఇంగ్లాండ్‌కు వెళ్లారు. దీంతో వారందరినీ శనివారం ప్రత్యేకంగా చార్టర్‌ ఫ్లైట్‌లో మాంచెస్టర్‌ నుంచి దుబాయ్‌కు తీసుకొచ్చింది. మరోవైపు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు కూడా తమ కెప్టెన్‌ విరాట్ కోహ్లీ, పేస్‌ బౌలర్‌ మహ్మద్‌ సిరాజ్‌ కోసం ప్రత్యేక విమానం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. వీరు శనివారం రాత్రి అక్కడి నుండి బయలుదేరి ఆదివారం ఉదయం యూఏఈకి చేరుకోనున్నారు.

కమర్షియల్‌ బాటలో చెన్నై, పంజాబ్‌..

మరోవైపు ఆర్సీబీ, ముంబయి ఇండియన్స్‌ తర్వాత ఇక మాంచెస్టర్‌లో మిగిలింది చెన్నై సూపర్‌ కింగ్స్‌, పంజాబ్ కింగ్స్‌ ఆటగాళ్లే. అయితే, ఈ రెండు జట్లూ తమ క్రికెటర్లను దుబాయ్‌కు తీసుకొచ్చేందుకు కమర్షియల్‌ బాటపట్టాయి. రవీంద్ర జడేజా, చెతేశ్వర్‌ పుజారా, శార్దూల్‌ ఠాకూర్‌, మొయిన్‌ అలీ, సామ్‌కరన్‌.. ఈ ఐదుగురిని కమర్షియల్‌ విమానంలో తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథన్‌ వెల్లడించారు. మరోవైపు పంజాబ్‌ కింగ్స్‌ సైతం తమ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌తో పాటు మయాంక్ అగర్వాల్‌, మహ్మద్‌ షమి, డేవిడ్‌ మలన్‌ను కమర్షియల్‌ విమానంలోనే తరలించేందుకు సిద్ధమైనట్లు ఆ జట్టు సీఈవో సతీశ్‌ మీనన్‌ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, ఇప్పటికే ఈ నాలుగు జట్లలోని మిగతా ఆటగాళ్లంతా యూఏఈకి చేరుకున్నారు. అక్కడ క్వారంటైన్‌ గడువు పూర్తిచేసుకున్న వారు ప్రాక్టీస్ చేస్తుండగా మిగతా వారు తమ హోటల్‌ గదుల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.

అందుకే సొంత ఖర్చులతో తరలింపు..

అసలు ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌ పూర్తయ్యాక బీసీసీఐ ఇరు జట్ల ఆటగాళ్లను మాంచెస్టర్‌ నుంచి దుబాయ్‌కు తరలించేందుకు ప్రత్యేక విమానం ఏర్పాటు చేయాలనుకుంది. ఒక బయో బుడగ నుంచి మరో బుడగలోకి ఆటగాళ్లను ప్రవేశ పెడితే క్వారంటైన్‌ నిబంధనలు కలిసి వస్తాయని భావించింది. అయితే, ఇప్పుడు చివరి టెస్టు రద్దవ్వడంతో బీసీసీఐ ఆ ఏర్పాట్లు చేయడం లేదని ఓ ఫ్రాంఛైజీ ప్రతినిధి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే తమ ఆటగాళ్లను సొంత ఖర్చులతో తీసుకొస్తున్నట్లు ఆయన వెల్లడించారు. కాగా, ఇంగ్లాండ్‌ పర్యటన నుంచి దుబాయ్‌కు చేరుకునే ఇరు జట్ల క్రికెటర్లు కచ్చితంగా ఆరు రోజుల క్వారంటైన్‌లో ఉంటారని చెప్పారు. చివరి టెస్టు రద్దవ్వడంతో వీలైనంత త్వరగా ఆటగాళ్లను ఇక్కడికి తీసుకువస్తే.. వారికి కాస్త ఉపశమనం కలిగించడమే కాకుండా కరోనా భయాలు, క్వారంటైన్ నిబంధనలు కలిసివస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని