IND vs SA: విక్రమ్‌ రాఠోడ్‌వల్లే తిరిగి లయ అందుకున్నా: అశ్విన్

టీమ్‌ఇండియా సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ బౌలింగ్‌తోనే కాకుండా అప్పుడప్పుడూ బ్యాట్‌తోనూ జట్టుకు విలువైన పరుగులు సాధిస్తాడు...

Published : 04 Jan 2022 13:23 IST

జోహెనెస్‌బర్గ్‌: టీమ్‌ఇండియా సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ బౌలింగ్‌తోనే కాకుండా అప్పుడప్పుడూ బ్యాట్‌తోనూ జట్టుకు విలువైన పరుగులు సాధిస్తాడు. తాజాగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో (46; 50 బంతుల్లో 6x4,) అతడు (92) మెరుగైన స్ట్రైక్‌రేట్‌తో కీలక పరుగులు చేశాడు. దీంతో జట్టును 200 పరుగులు దాటించి గౌరవప్రదమైన స్కోర్‌ అందించడంలో కీలక పాత్ర పోషించాడు. చివరికి భారత్‌ 202 పరుగులకు ఆలౌటైంది. మ్యాచ్‌ అనంతరం మీడియాతో మాట్లాడిన అశ్విన్‌.. ఈ గేమ్‌లో తాను ఇంత మంచి స్ట్రైక్‌రేట్‌ కలిగి ఉండటానికి ప్రత్యేకంగా ప్రయత్నం ఏమీ చేయలేదని చెప్పాడు. తాను లయ అందుకోవడంలో బ్యాటింగ్‌ కోచ్‌ విక్రమ్‌ రాఠోడ్‌ సాయం చేశాడన్నాడు.

‘నేను గత కొన్నేళ్లుగా బ్యాటింగ్‌ టెక్నిక్‌పై దృష్టిసారించాను. జట్టుకు భారీ పరుగులు అందించి నా వంతు తోడ్పాటు అందించాలనుకున్నాను. అంతకుముందు కూడా బాగా ఆడిన సందర్భాలు ఉండటంతో ఈ మ్యాచ్‌లో మంచి స్ట్రైక్‌రేట్‌తో అలాంటి మెరుగైన షాట్లు ఆడేందుకు ప్రత్యేకంగా శ్రమ పడలేదు. ఇక మా బ్యాటింగ్‌ కోచ్‌ విక్రమ్‌ కూడా నాకు విలువైన సూచనలు చేస్తూ నాలోని లోపాలను సరిద్దిద్దాడు. దీంతో నేను ఇలా బాగా బ్యాటింగ్‌ చేయగల లయ అందుకున్నానని అనుకుంటున్నా’ అని అశ్విన్‌ వివరించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని