Tokyo Paralympics: ఈ యోధుల కథలు వింటే జీవితంపై కొత్త ఆశలు!

అన్ని అవయవాలు సక్రమంగా ఉండి.. అన్ని వనరులు అందుబాటులో ఉన్నప్పటికీ.. తామేమీ సాధించాలేమనే నిరాశలో కుంగిపోతూ చాలా మంది తమ జీవితాలను వృథా చేసుకుంటుంటారు...

Published : 23 Aug 2021 09:58 IST

రేపటి నుంచే టోక్యో పారాలింపిక్స్‌
ఈనాడు క్రీడావిభాగం

అన్ని అవయవాలు సక్రమంగా ఉండి.. అన్ని వనరులు అందుబాటులో ఉన్నప్పటికీ.. తామేమీ సాధించాలేమనే నిరాశలో కుంగిపోతూ చాలా మంది తమ జీవితాలను వృథా చేసుకుంటుంటారు. అలాంటివాళ్లు ఒక్కసారి ఈ వీరుల గురించి తెలుసుకుంటే.. ఈ యోధుల కథలు వింటే జీవితంపై కొత్త ఆశ చిగురించడం ఖాయం. ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలుంటాయి. వాటిని దాటితేనే విజేతలుగా నిలుస్తారు. కానీ వీళ్ల జీవితమే కష్టతరమై.. జీవన ప్రయాణంలో అడుగడుగునా అడ్డంకులు ఎదురైనా.. వీళ్లు వెన్నుచూపలేదు. భయపడి చీకటిలోనే ఉండిపోలేదు. వైకల్యాన్ని అధిగమించి ఆటల్లో సత్తాచాటి వెలుగులోకి వచ్చారు. ఇప్పుడదే ఆటల్లో దేశం తరపున పారాలింపిక్స్‌లో పతకాలు సాధించేందుకు సిద్ధమయ్యారు. టోక్యోలో పోడియంపై  నిలబడి.. దేశ జాతీయ పతాకాన్ని రెపరెపలాడిస్తారనే ఆశలు పుట్టిస్తున్నారు. మరి వాళ్లెవరూ.. వాళ్ల నేపథ్యాలేంటి?

19 ఏళ్లకే..

పాఠశాలలో అందరితో కలిసి ఆడుకునే అవకాశం పలక్‌ కోహ్లీకి లేకపోయింది. పుట్టుకతోనే వచ్చిన తన వైకల్యాన్ని చూసి మిత్రులు దూరం పెట్టారు. ఈ పరిస్థితుల్లో ఆటలు అవసరమా.. బుద్ధిగా చదువుకో అని ఉపాధ్యాయులూ చెప్పారు. ఇప్పటికే ఓ చేయి సరిగ్గా లేదు.. ఉన్న ఇంకో చేతిని పాడు చేసుకుంటావా? అని గద్దించారు. దీంతో తానెంటో నిరూపించాలని ఆ అమ్మాయి గట్టిగా అనుకుంది. ఆటల్లో సత్తాచాటాలని నిర్ణయించుకుంది. ఆ సమయంలో పారా బ్యాడ్మింటన్‌ కోచ్‌ గౌరవ్‌ ఖన్నా ఆమెకు అండగా నిలిచాడు. అంతకంటే ఆరు నెలల ముందే ఆమెను బ్యాడ్మింటన్‌లోకి రావాలని ఆహ్వానించిన అతను.. ఇక ఆ తర్వాత పలక్‌కు ఉత్తమ శిక్షణ అందించాడు. క్రమంగా ఆటపై పట్టు సాధించిన ఆమె అతి తక్కువ సమయంలోనే టోర్నీల్లో పతకాలు సాధించడం మొదలెట్టింది. అంతర్జాతీయ టోర్నీల్లోనూ సింగిల్స్, డబుల్స్‌లో సత్తాచాటింది. తన ర్యాంకింగ్స్‌తో టోక్యో పారాలింపిక్స్‌కు అర్హత సాధించి.. ఆ ఘనత అందుకున్న అతి పిన్న వయస్సు షట్లర్‌గా చరిత్ర సృష్టించింది. పూర్తిగా ఎదగని ఎడమచేతితో పుట్టిన 19 ఏళ్ల ఈ పంజాబ్‌ చిన్నది.. ఇప్పుడు టోక్యోలో ఎస్‌యూ5 సింగిల్స్‌ విభాగంతో పాటు మిక్స్‌డ్‌ డబుల్స్, మహిళల డబుల్స్‌లోనూ పోటీపడే అవకాశం కొట్టేసింది. ఈ పారాలింపిక్స్‌ల్లో పతకంతో తన సామర్థ్యంపై ప్రజలు పెట్టుకున్న అనుమానాలను పటాపంచలు చేయాలనే పట్టుదలతో ఉంది.

విశ్వ క్రీడల్లో తొలిసారి

ప్రమోద్‌ భగత్‌.. ఇప్పటికే రెండు సార్లు పారా ప్రపంచ బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌ ఛాంపియన్‌గా నిలిచాడు. డబుల్స్‌లోనూ పతకాల మోత మోగించాడు. మరెన్నో ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ పారా బ్యాడ్మింటన్‌ టోర్నీల్లో ఛాంపియన్‌గా నిలిచాడు. కానీ ఇప్పటివరకూ పారాలింపిక్స్‌లో ఆడే అవకాశం రాలేదు. గత పారాలింపిక్స్‌ల్లో బ్యాడ్మింటన్‌ లేకపోవడమే అందుకు కారణం. కానీ ఇప్పుడు టోక్యో పారాలింపిక్స్‌లో తొలిసారి పారా బ్యాడ్మింటన్‌ ప్రవేశపెట్టడంతో అతని రాకెట్‌కు రెక్కలొచ్చాయి. ప్రస్తుతం పురుషుల సింగిల్స్‌ ఎస్‌ఎల్‌3 విభాగంలో ప్రపంచ నంబర్‌వన్‌గా కొనసాగుతోన్న అతను.. టోక్యోలో పసిడి పట్టేయాలనే ఆత్రుతతో ఉన్నాడు. ఒడిషాకు చెందిన ఈ 33 ఏళ్ల పారా షట్లర్‌ ఫామ్‌ ప్రకారం చూస్తే స్వర్ణం సాధించడం పెద్ద కష్టమేమీ కాదు. చిన్నతనంలోనే అతని ఎడమ కాలికి పోలియో సోకింది. 13 ఏళ్ల వయసులో ఓ సారి బ్యాడ్మింటన్‌ మ్యాచ్‌ చూడడం తన జీవితాన్ని మలుపు తిప్పింది. ఆ ఆటను చూసిన తర్వాత అతను దాని ప్రేమలో పడిపోయాడు. అప్పటి నుంచి రాకెట్‌ పట్టుకుని కోర్టులో సంచలనాలు నమోదు చేయడం మొదలెట్టాడు. ఓ కాలిలో బలం లేనప్పటికీ దానిపై ఎక్కువ భారం పడకుండా తెలివిగా షాట్లు ఆడుతూ.. ప్రపంచ పారా బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్స్‌లో పసిడి పంట పండించాడు.

టోక్యోలో కలెక్టర్‌

పుట్టుకతోనే అతని ఓ కాలు సరిగ్గా లేదు. అయినా ఆ లోపం అతనికి ఏ దశలోనూ అడ్డంకి కాలేదు. దేశంలోనే అత్యున్నత సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష రాసి కలెక్టర్‌గా ఉద్యోగం సంపాదించినా.. పారా బ్యాడ్మింటన్‌ ఆటగాడిగా విజయాలు సాధించినా అతనికే చెల్లింది. అతనే.. కర్ణాటకకు చెందిన 38 ఏళ్ల సుహాస్‌. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని గౌతమ్‌ బుద్ధా నగర్‌ జిల్లా మెజిస్ట్రేట్‌గా పాలన బాధ్యతలు కొనసాగిస్తున్న అతను.. టోక్యో పారాలింపిక్స్‌లో భారత్‌ తరపున ప్రాతినిథ్యం వహించనున్నాడు. ఆ ఘనత సాధించిన భారత తొలి ఐఏఎస్‌ అధికారిగా అతను చరిత్ర నమోదు చేశాడు. అటు చదువుతో పాటు ఇటు బ్యాడ్మింటన్‌పైనా ప్రేమ పెంచుకున్న అతను రాకెట్‌తో అద్భుతాలు చేయడం మొదలెట్టాడు. 2007 నుంచి వివిధ టోర్నీల్లో పతకాలు గెలుస్తూ నిలకడగా రాణిస్తున్న అతను ప్రస్తుతం పురుషుల సింగిల్స్‌ ఎస్‌ఎల్‌4 విభాగంలో ప్రపంచ రెండో ర్యాంకులో కొనసాగుతున్నాడు. 2016 ఆసియా పారా బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌గా నిలిచిన అతను.. 2018 ఆసియా పారా క్రీడల్లో కాంస్యం సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు టోక్యోలోనూ పతకంపై ఆశలు రేకెత్తిస్తున్నాడు.

హ్యాట్రిక్‌ కొట్టాలని..

టోక్యో ఒలింపిక్స్‌లో సరికొత్త చరిత్ర సృష్టిస్తూ  జావెలిన్‌ త్రోలో పసిడి గెలిచిన నీరజ్‌ చోప్రా దేశాన్ని సంతోషంలో ముంచెత్తాడు. కానీ అతని కంటే ముందే జావెలిన్‌ త్రోలో పారాలింపిక్స్‌ల్లో రెండు స్వర్ణాలు గెలిచిన అథ్లెట్‌ ఒకరున్నారు. అతనే.. భారత పారా అథ్లెట్‌ దిగ్గజం దేవేంద్ర జజారియా. జావెలిన్‌ త్రో ఎఫ్‌46 విభాగంలో 2004 ఏథెన్స్‌ ఒలింపిక్స్‌లో ఛాంపియన్‌గా నిలిచిన ఈ రాజస్థాన్‌ అథ్లెట్‌.. గత 2016 రియో క్రీడల్లో మరోసారి పసిడి అందుకున్నాడు. మధ్యలో 12 ఏళ్ల పాటు పారాలింపిక్స్‌ జావెలిన్‌ త్రోలో ఎఫ్‌46 విభాగంలో పోటీలు నిర్వహించలేదు. లేకపోతే దేవేంద్ర ఖాతాలో మరికొన్ని ఒలింపిక్స్‌ పతకాలు చేరేవి! అతని జావెలిన్‌ ఎప్పుడూ ప్రపంచ రికార్డునే ముద్దాడుతుంది. 2004లో స్వర్ణం సాధించినపుడు ప్రపంచ రికార్డు సృష్టించిన అతను.. రియోలోనూ ఆ రికార్డును తానే మెరుగుపర్చాడు. ఈ ఏడాది జులైలో 65.71 మీటర్ల దూరం ఈటెను విసిరి మళ్లీ తన రికార్డును మెరుగుపర్చుకున్న ఈ 40 ఏళ్ల అథ్లెట్‌పై టోక్యోలో కచ్చితంగా పోడియంపై నిలబడతాడనే అంచనాలున్నాయి. ఎనిమిదేళ్ల వయసులో ఓ చెట్టు ఎక్కే ప్రయత్నంలో విద్యుతాఘాతానికి గురై తన ఎడమ చేతిని మోచేతి వరకు కోల్పోయిన దేవేంద్ర.. ఇప్పుడు టోక్యోలో హ్యాట్రిక్‌ స్వర్ణం సాధించాలనే పట్టుదలతో ఉన్నాడు.

కష్టాల నుంచి ఎగిరాడు

ఆ కుటుంబంలో మొత్తం ఆరుగురు పిల్లలు. అయిదుగురు కొడుకులు, ఓ తనయ. తండ్రి ఆ కుటుంబాన్ని విడిచి తన దారి తాను చూసుకోవడంతో ఆ తల్లి రోజూ కూరగాయాలు అమ్మి పిల్లలను పెంచింది. అందులో ఓ అబ్బాయి.. మరియప్పన్‌ తంగవేలు అయిదేళ్ల వయసులో చలాకీగా పాఠశాలకు వెళ్తున్నాడు. ఓ రోజు అలాగే వెళ్తున్న అతని పాలిట ఓ బస్సు శాపమైంది. మద్యం మత్తులో ఉన్న డ్రైవర్‌ నడిపిన ఆ బస్సు చక్రాలు అతని కుడి కాలి మీద నుంచి వెళ్లాయి. దీంతో మోకాలి కింద నుంచి అతని కాలు మొత్తం నుజ్జునుజ్జయింది. వైద్యులు చికిత్స చేసినప్పటికీ ఆ తర్వాత అతను సాధారణంగా నడవలేకపోయాడు. కానీ మిగతా పిల్లలకంటే తానేమీ తక్కువ కాదనే ఆత్మవిశ్వాసంతో సాగాడు. పాఠశాలలో ఓ సారి పీటీ ప్రోత్సాహంతో హైజంప్‌లో పాల్గొన్న అతను ఇక అప్పటి నుంచి దాన్నే కెరీర్‌గా ఎంచుకున్నాడు. పోరాటమే ఆయుధంగా మలుచుకుని గత రియో క్రీడల హైజంప్‌ టీ42 విభాగంలో పసిడి గెలిచే స్థాయికి చేరాడు. 26 ఏళ్ల ఈ తమిళనాడు అథ్లెట్‌ 2019 ప్రపంచ పారా అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌లో కాంస్యంతో మెరిశాడు. ఇప్పుడు టోక్యోలో పారాలింపిక్స్‌ ఆరంభోత్సవ వేడుకలో త్రివర్ణ పతాకాన్ని చేతబూని భారత బృందాన్ని నడిపించనున్న అతను.. స్వర్ణం సాధించాలనే లక్ష్యంతో ఉన్నాడు.

పోలియోను పక్కకుతోసి..

2012 పారాలింపిక్స్‌కు ముందు భారత అథ్లెటిక్స్‌ వర్గాల్లో ఓ కుర్రాడి గురించి ఎక్కువగా చర్చ జరిగింది. అప్పుడు హైజంప్‌లో ‘ఎ’ అర్హత ప్రమాణాన్ని అందుకున్న అతను.. ఎక్కువ బెర్తులు లేకపోవడంతో ఆ పారాలింపిక్స్‌కు వెళ్లలేకపోయాడు. అయినప్పటికీ అది తన దురదృష్టమని భావించి అక్కడే ఆగిపోలేదు. మరింత కసిగా సాధన కొనసాగించాడు. 2016 పారాలింపిక్స్‌కు అర్హత సాధించడమే కాకుండా కాంస్య పతకమూ గెలిచాడు. అతనే 26 ఏళ్ల వరుణ్‌ సింగ్‌. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాకు చెందిన ఈ అథ్లెట్‌కు చిన్నతనంలో పోలియో సోకింది. దీంతో ఎడమ కాలిలో బలం లేకుండా పోయింది. కాలులో సత్తువ లేకపోయినప్పటికీ గుండెల నిండా పట్టుదల ఉన్న అతను ఆటల వైపు మళ్లాడు. హైజంప్‌ పట్ల ఆకర్షితుడయ్యాడు. అంచెలంచెలుగా ఎదుగుతూ ఒలింపిక్స్‌ హైజంప్‌ టీ42 విభాగంలో కంచు పతకం సాధించే స్థాయికి చేరాడు. పారా ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌ (2017)లో కాంస్యం, ఆసియా పారా క్రీడ (2018)ల్లో రజతం ఖాతాలో వేసుకున్న అతను.. ఇప్పుడు టోక్యోలో పతకం రంగు మార్చాలనే ధ్యేయంతో పోటీలో దిగనున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని