చెపాక్‌ గడ్డ.. త్రిశతకాల అడ్డా!

దాదాపు 14 నెలల తర్వాత భారత్‌లో తిరిగి అంతర్జాతీయ క్రికెట్ ప్రారంభం కానుంది. చెన్నైలోని చెపాక్‌ స్టేడియం వేదికగా శుక్రవారం నుంచి భారత్‌×ఇంగ్లాండ్ టెస్టు సిరీస్‌ జరగనుంది. అయితే చెపాక్‌ భారత క్రికెట్‌కు...

Updated : 03 Feb 2021 10:02 IST

ఇంగ్లాండ్‌పై విరాట్‌, రోహిత్‌ త్రిశతకం సాధిస్తారా?

దాదాపు 14 నెలల తర్వాత భారత్‌లో తిరిగి అంతర్జాతీయ క్రికెట్ ప్రారంభం కానుంది. చెన్నైలోని చెపాక్‌ స్టేడియం వేదికగా శుక్రవారం నుంచి భారత్‌×ఇంగ్లాండ్ టెస్టు సిరీస్‌ జరగనుంది. అయితే చెపాక్‌ భారత క్రికెట్‌కు ఎన్నో జ్ఞాపకాల వేదికగా నిలిచింది. టీమిండియా తొలిసారిగా గెలుపు రుచిచూసింది ఇక్కడే. 1934లో మొదలైన భారత క్రికెట్.. 1952లో ఈ మైదానంలోనే తొలి విజయాన్ని నమోదుచేసింది.

అంతేగాక దిగ్గజ క్రికెటర్‌ సునిల్‌ గావస్కర్‌ 30వ శతకం, 1986-87లో భారత్‌×ఆస్ట్రేలియా మ్యాచ్ ‘టై’ చెన్నైలోనే. ఇక చెపాక్ స్టేడియమంటే మన బ్యాట్స్‌మెన్‌కు చెప్పలేని హుషారు వచ్చేస్తుంది. భారత క్రికెట్ చరిత్రలో మూడు త్రిశతకాలు నమోదైతే అందులో రెండు ఇక్కడే నమోదయ్యాయి. 2008లో వీరేంద్ర సెహ్వాగ్ వీరవిహారం చేస్తే కరుణ్‌ నాయర్‌ 2016లో సునామీ సృష్టించాడు. ఇక టీమిండియా అత్యధిక స్కోరు (759/7) నమోదైంది కూడా చెపాక్‌ వేదికగానే.

టీమిండియా తరఫున నమోదైన మూడు త్రిశతకాల్లో రెండు సెహ్వాగే సాధించాడు. 2004లో ముల్తాన్ స్టేడియంలో పాకిస్థాన్‌పై తొలి ట్రిపుల్ శతకం (309) బాదాడు. ఆ తర్వాత నాలుగేళ్లకే చెన్నైలో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో మరో త్రిశతకాన్ని అందుకున్నాడు. సెహ్వాగ్‌ ఊచకోతకు 2008 భారత పర్యటన సఫారీలకు పీడకలగా మారింది. మొదటి ఇన్నింగ్స్‌లో గ్రేమ్‌స్మిత్‌ సేన 540 పరుగులు చేసింది. ఆమ్లా 159 పరుగులు చేశాడు. దీంతో భారత్‌కు కష్టాలు తప్పవని భావించారంతా. కానీ సెహ్వాగ్‌ ఇన్నింగ్స్‌ను చూసిన తర్వాత కష్టాలు టీమ్‌ఇండియాకు కాదు సఫారీలకు అనేలా పరిస్థితి మారిపోయింది.

స్పిన్నర్, పేసర్‌ అనే తేడా లేకుండా సఫారీ బౌలర్లను వీరూ ఊచకోత కోశాడు. 42 ఫోర్లు, ఐదు సిక్సర్లతో 319 పరుగుల భారీ ఇన్నింగ్స్‌ ఆడాడు. అతడికి తోడుగా ఇండియన్ వాల్‌ రాహుల్ ద్రవిడ్‌ శతకంతో కదంతొక్కగా భారత్‌ 627 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లోనూ దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ రాణించడంతో మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్‌లో సెహ్వాగ్‌ రెండు కీలక వికెట్లు కూడా పడగొట్టాడు. ఏబీ డివిలియర్స్‌, మార్క్‌ బౌచర్‌ను బోల్తా కొట్టించాడు.


సెహ్వాగ్‌ భారీ ఇన్నింగ్స్‌ సాధించిన ఎనిమిదేళ్ల తర్వాత యువ ఆటగాడు కరుణ్‌ నాయర్‌ చెన్నైలోనే త్రిశతకం బాదేశాడు. 2016లో భారత్‌ పర్యటనకు వచ్చిన ఇంగ్లాండ్‌పై అతడు విజృంభించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ 477 పరుగులు చేసింది. మొయిన్ అలీ 146 పరుగులు చేశాడు. అనంతరం బరిలోకి దిగిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 759/7 రికార్డు స్కోరు నమోదుచేసింది. అయిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన కరుణ్‌ నాయర్‌ (303*) పరుగుల వరద పారిస్తూ ట్రిపుల్ సెంచరీ అందుకున్నాడు. అతడితో పాటు కేఎల్‌ రాహుల్ (199) చెలరేగాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 207 పరుగులకే ఆలౌటవ్వడంతో భారత్ ఇన్నింగ్స్‌ 75 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

అయితే కరుణ్‌ తర్వాత భారత్‌ తరఫున ఇప్పటివరకు త్రిశతకాన్ని ఎవరూ సాధించలేకపోయారు. ప్రస్తుత భారత జట్టులో స్టార్‌ బ్యాట్స్‌మన్‌కు కొదవలేదు. కోహ్లీ, రోహిత్, పుజారా, రహానె సీనియర్‌ ఆటగాళ్లతో పాటు రాహుల్‌, గిల్‌, మయాంక్‌‌, పంత్‌ వంటి యువ ఆటగాళ్లు ఉన్నారు. వీళ్లంతా సంచనాలను సృష్టించగలిగే బ్యాట్స్‌మెన్‌. మరోవైపు ఆస్ట్రేలియా గడ్డపై చారిత్రక విజయం సాధించిన ఆత్మవిశ్వాసం, సొంతగడ్డపై ఎన్నో నెలల విరామం అనంతరం ఆడుతున్న ఉత్సాహంతో.. టీమిండియా బరిలోకి దిగుతోంది. అంతేగాక ఇంగ్లాండ్‌తో తొలి రెండు టెస్టులు చెపాక్ స్టేడియంలోనే జరగనున్నాయి. ఈ నేపథ్యంలో త్రిశతక రికార్డును భారత బ్యాట్స్‌మెన్‌ అందుకుంటారని అభిమానులు ఆశిస్తున్నారు. మరి ఈ రికార్డుల అడ్డాలో ఈ సారి ట్రిపుల్ సెంచరీ కొట్టేదెవరో!

- ఇంటర్నెట్‌డెస్క్

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని